Monday, November 29, 2010

తూ.గో.జి. వారికి ఒక విఙ్ఞప్తి

తూర్పు గోదావరి జిల్లా బ్లాగర్స్ కి ఒక విఙ్ఞప్తి, నేను ఒక క్విజ్ కార్యక్రమం చేయబోతున్నాను. అందులో తూర్పు గోదావరి కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలి. నాకంటే మీ జిల్లాకి సంబంధించిన సమాచారం మీ అందరి దగ్గర బాగా వుంటుంది. కాబట్టి దయచేసి తూర్పు గోదావరి జిల్లాకి సంబందించి ఏవైనా ప్రశ్నలు వుంటే రేపు ఎల్లుండిలోపల నాకు పంపండి. మరీ కష్టమైనవి కాకుండా మరీ అందరికీ తెలిసేవి కాకుండా వుంటే బాగుంటాయి.

మీ సహాయానికి కృతఙ్ఞతలు.

Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.

Monday, November 8, 2010

మిస్ యు ఆల్.

హలో,


గుర్తున్నానా?? అంతర్జాలాన్ని చాలా మిస్ అవుతున్నాను. మొత్తానికి హైదరాబాదులో వచ్చి పడ్డాను. ఇక్కడి ట్రాఫిక్, పొల్యూషన్, హడావుడి, సిటీ బస్సులకు, ఆటో మీటరుకి ఇంకా అలవాటు పడలేదు. ఐనా ఇంత చలేంటండీ బాబు. మా నెల్లూరులో 5 యేళ్ళూ ఎప్పుడు కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. ఇక్కడ పగలు కూడా ఫుల్ గా ముసుగే. మా బాబు కి స్కూల్ వెతికేసరికి నాకు మొత్తం మన విద్యా వ్యవస్థ మీద విరక్తి వచ్చేసింది.

ఏంటీ అన్నీ నెగెటివే చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేమీ లేదు. ఇక్కడ చాలా మంది బంధువులు, స్నేహితులు నాకు దగ్గరలో వున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో ఎక్కువ టైము గడుపుతున్నాను. అంతే కాదండోయ్ మంచి కలర్ వచ్చేస్తున్నాను. (బాగా వండుకొని తింటున్నా కదా మరి).


ఇలా మంచి చెడ్డలు, కష్టసుఖాల తో బాగానే వున్నను. ఇంట్లోనే ఆఫీసు. కానీ ఇంక సెట్ కావాలి. ఇంటెర్నెట్ కనెక్షన్ ఇంకా పెట్టలేదు. వరుసగా పండగలు, వర్షాలు తో సెలవులు కదా!అందుకే మీరంతా బతికిపోయారు. అలా అని ఇలాగే సుఖంగా వుంటాము అనుకోవద్దు. నేను త్వరలో ఒక పెద్ద టపా తో వచ్చేస్తున్నా...కాసుకోండి.

బట్ ఐ మిస్ ద బ్లాగ్ వర్ల్డ్. మిస్ యు ఆల్.