Monday, November 29, 2010

తూ.గో.జి. వారికి ఒక విఙ్ఞప్తి

తూర్పు గోదావరి జిల్లా బ్లాగర్స్ కి ఒక విఙ్ఞప్తి, నేను ఒక క్విజ్ కార్యక్రమం చేయబోతున్నాను. అందులో తూర్పు గోదావరి కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలి. నాకంటే మీ జిల్లాకి సంబంధించిన సమాచారం మీ అందరి దగ్గర బాగా వుంటుంది. కాబట్టి దయచేసి తూర్పు గోదావరి జిల్లాకి సంబందించి ఏవైనా ప్రశ్నలు వుంటే రేపు ఎల్లుండిలోపల నాకు పంపండి. మరీ కష్టమైనవి కాకుండా మరీ అందరికీ తెలిసేవి కాకుండా వుంటే బాగుంటాయి.

మీ సహాయానికి కృతఙ్ఞతలు.

Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.

Monday, November 8, 2010

మిస్ యు ఆల్.

హలో,


గుర్తున్నానా?? అంతర్జాలాన్ని చాలా మిస్ అవుతున్నాను. మొత్తానికి హైదరాబాదులో వచ్చి పడ్డాను. ఇక్కడి ట్రాఫిక్, పొల్యూషన్, హడావుడి, సిటీ బస్సులకు, ఆటో మీటరుకి ఇంకా అలవాటు పడలేదు. ఐనా ఇంత చలేంటండీ బాబు. మా నెల్లూరులో 5 యేళ్ళూ ఎప్పుడు కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. ఇక్కడ పగలు కూడా ఫుల్ గా ముసుగే. మా బాబు కి స్కూల్ వెతికేసరికి నాకు మొత్తం మన విద్యా వ్యవస్థ మీద విరక్తి వచ్చేసింది.

ఏంటీ అన్నీ నెగెటివే చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేమీ లేదు. ఇక్కడ చాలా మంది బంధువులు, స్నేహితులు నాకు దగ్గరలో వున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో ఎక్కువ టైము గడుపుతున్నాను. అంతే కాదండోయ్ మంచి కలర్ వచ్చేస్తున్నాను. (బాగా వండుకొని తింటున్నా కదా మరి).


ఇలా మంచి చెడ్డలు, కష్టసుఖాల తో బాగానే వున్నను. ఇంట్లోనే ఆఫీసు. కానీ ఇంక సెట్ కావాలి. ఇంటెర్నెట్ కనెక్షన్ ఇంకా పెట్టలేదు. వరుసగా పండగలు, వర్షాలు తో సెలవులు కదా!అందుకే మీరంతా బతికిపోయారు. అలా అని ఇలాగే సుఖంగా వుంటాము అనుకోవద్దు. నేను త్వరలో ఒక పెద్ద టపా తో వచ్చేస్తున్నా...కాసుకోండి.

బట్ ఐ మిస్ ద బ్లాగ్ వర్ల్డ్. మిస్ యు ఆల్.

Monday, September 27, 2010

సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా?

ధర్మం, ఈ మాట ఒక్కోసారి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా! ఇది మంచి ఇది చెడు అని అసలు ఎవరు నిర్ణయించారు.ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పినవే ఇప్పటికీ ధర్మాలా/నీతులా? ధర్మమ ఎప్పటికీ మారదా?మరి మన పురాణాలలో ఎప్పుడు ఎవరికి ఎలా కావలిస్తే అలా మార్చేసుకొని అదే ధర్మం అని చెప్పుకుంటూ వచ్చారే! అమ్మా తల్లీ నీకెందుకీ ధర్మ సందేహాలు మాకెందుకీ నీతి బోధలు అనుకుంటున్నారా? ఏమో బాబు నాకు అప్పుడప్పుడు ఇలాంటి ధర్మ సందేహాలు వస్తూ వుంటాయి. ఎవరిని అడగాలో అర్ధం కాదు. నాకు తెలిసిన విధంగా నాకు నేనే నా సందేహాలకు సమాధానాలు చెప్పేసుకుంటుంటాను. అలాగే ఒకానొక సమయంలో నాకు ఒక ధర్మ సందేహం కలిగింది. ఒకటేమిటీ చాలానే కలిగాయి ఆ విషయంలో. ఫ్యాక్షనిస్టుని పెళ్ళిచేసుకోవచ్చా? అనీ.పోనీ పెళ్లి చేసుకోకపోతేనేమి ప్రేమించ వచ్చా అనీ, ప్రేమిస్తే పెళ్ళిచేసుకోవాలా అనీ, అసలు ప్రేమించిన వానితో పోలిస్తే జీవితంలో మిగిలిన కష్టాలన్నీ చిన్నవి కాదా అనీ. అసలు ఇది ఒక ధర్మ సందేహమా, కొన్ని పేజీల ధర్మ సందేహాలా అని మీకు కూడా ధర్మ సందేహం వచ్చి వుండాలే ఈ పాటికి . వచ్చిన రాకపోయినా మీ ధర్మ సందేహం తీర్చడం ఒక బాద్యత కల భారత బ్లాగర్ గా నా ధర్మం....ఇక చదివి మీ ధర్మ సందేహాలు తీర్చుకోండి....


పని లేని మంగలి పిల్లి తల గొరిగాడంట, ఆ సామెత విన్నప్పుడంతా మరీ అంత పిచ్చి పని ఎవరైనా చేస్తారా అనుకున్నాను. కానీ నేను అదే చేసాను కొన్నాళ్ళ క్రితం. పెద్దగా పనిలేక టి.వి లో అదేదో బాలకృష్ణ సినిమాలు, చిరంజీవి సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఇస్తే చూశాను. కంటిచూపుతో చంపేయటాలు, ట్రైన్ ని ఆపేయడాలు, ఎవరెవరో వచ్చి అన్నా అని కాళ్ళకు దండాలు పెట్టేయడాలు చూస్తుంటే విపరీతమగా ఫీలయిపోయాను.నా జీవితం తో ఆడుకున్న సినిమాలు అవి. అదెలాగో తెలియాలంటే నాతో పాటు మీరు 1999 వ సంవత్సరం కి రావాలి.

అప్పట్లో శిరీష ఒక పసికందు(మానసికంగా పసిపిల్ల అని చెప్పడానికి అలా చెప్పా)ఎప్పుడు చూసినా ఫ్రెండ్సు, సినిమాలు, షికార్లు,జోకులు ఇవే తెలుసు. కుటుంబం అంటే అందరు కలిసి బోజనాలు చేస్తారని,పండగలు చేసుకుంటారని, టూర్లకి వెళ్తారని మాత్రమే తెలుసిన రోజులు. అటువంటి నాకు ఒక కొత్త ప్రపంచం చూపించాడు ది గ్రేట్ వెంకటేశ్వర రెడ్డి, అప్పటి నా కొలీగ్. కుటుంబం లో వాళ్ళు కలిసి మర్డర్ ప్లానింగ్ చెయ్యడం, ఊర్లో వాళ్ళు దానికి సహాయపడటం, ఒక వైపు మనిషి చనిపోతే ఊర్లో అందరు తమ ఇంట్లో మనిషి చనిపోయినట్లు ఆవేశపడటం, అవతలి వైపు వారి ఇళ్ళల్లో వాళ్ళని లాక్కొని వచ్చి చంపేయటం, ఇళ్ళకు, పండిన పత్తి కి నిప్పు అంటించెయ్యటం, మగవాళ్ళందరు ఊరొదిలి పారిపోయి అడవుల్లో దాక్కోవటం, ఆడవాళ్ళు కూడా ఊరొదిలి బంధువుల ఇళ్ళకి పోవటం, పోలీసులు సంవత్సరాలు తరబడి ఊర్లో కర్ఫ్యూ పెట్టడం,వున్న ఒకటి, రెండు ఇళ్ళ వాళ్ళని పోలీసులు కష్టాలు పెట్టడం.....ఈ మద్యలో కొన్ని ప్రేమ జంటల జీవితాలు, కుదిరిన పెళ్ళిళ్ళు, చదువుతున్న చదువులు అన్ని ఆగిపోయి జీవితాలు తలక్రిందులైపోవటం అనే కధలు చెప్పాడు. ఇదంతా వెంకటేశ్వర రెడ్డీ వాళ్ళ ఊరు చిందుకూరు (నంద్యాల దగ్గర) కధ. ఈ కధ అంతా నా ఒక్క దానికే కాదు మా టీం లో అందరికీ చెప్పాడు రెడ్డి. అందరూ  ఆశ్చర్యపోతూ, భయపడుతూ వింటుంటే నేను మాత్రం రెడ్డీ ని ఆరాధనగా చూస్తూ వినేదాన్ని. మాతో పాటు సామాన్యమైన మనిషిలా తిరుగుతూ, బోజనం చేస్తూ, ఆడుతూ పాడుతూ ఉన్న ఈ రెడ్డీ నిజానికి ఒక సమర సింహా రెడ్డి అయివుంటాడని, అఙ్ఞాతంలో వున్న ఇంద్రసేనా రెడ్డి అయివుంటాడని అనుకునేదాన్ని. ఒంటి చేత్తో ట్రైను ఆపేసే శక్తిమంతుడయి వుంటాడని, కంటి చూపుతో ప్రాణాలు తీసేసే పవర్ ఫుల్ మనిషి అయి వుంటాడని అనుకునేదాన్ని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తనికెళ్ళ భరణి లా మా ఆఫీసు కి వచ్చి అన్నా, రెడ్డన్నా అని మా రెడ్డి కాళ్ళ మీద పడిపోతాడనీ, ఎక్కడో ఏదో ఒక గుడిలో అనుకోకుండా ఒక జంట ఒక పసిపిల్లాడితో వచ్చి రెడ్డన్నా..ఏమై పోయావన్నా, అని కన్నీరు పెట్టుకొని ఆ పసిబిడ్డని రెడ్డి కాళ్ళమీద పెట్టేసి అన్నా ఈ బిడ్డ నీ దయవల్ల కలిగాడు(డబల్ మీనింగ్ ఏమీలేదు) వీడికి నీ పేరే పెట్టాము, నీ చేత్తో ఒక బంగారు గొలుసు ఇయ్యన్నా అంటారని ఆశపడి రెడ్డి ఎక్కడికెళ్ళినా వెనకే తిరిగేదాన్ని అలాంటి సీన్ మిస్ అయిపోకూడదని. ఏదో ఒక బస్ స్టాండులో సడన్ గా రెడ్డి మీద ఎవరైనా విలన్స్ అటాక్ చేస్తారేమో అని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించేదాన్ని.

అంత జాగ్రత్తగా, అపూర్వంగా రెడ్దిని చూసుకుంటున్న రోజుల్లో ఇంకా అధ్భుతమైన విషయం చెప్పాడు. ఈ ఫాక్షన్ కధలో మరుగున పడిపోయిన ఒక విషాదభరితమైన ప్రేమ కధ. అది ఎవరిదో కాదు, మీరు మరీను అసలు సినిమాల్లో ప్రేమ కధలు,ఫ్లాష్ బ్యాక్ లు ఎవరికి వుంటాయి ఆ మాత్రం తెలుసుకోలేరా? ఆ... అదే హీరో కే.అంటే సమర సింహారెడ్డికే, ఇంద్రసేనా రెడ్డికే. అంటే వెంకటేశ్వర రెడ్డికే. అది కూడా పసివాడుగా వున్న సమరసింహా రెడ్డి గుణగణాలను ముందే ఊహించి అతనికోసమె ఆడపిల్లని కన్నారు ఆ ఊరి ఫాక్షన్ పార్టీ ఒక వైపు పెద్ద గారు. మన హీరో కూడా చిన్నప్పటి నుండే ఆమెతో మొగుడు పెళ్ళాలాట ఆడటం మొదలు పెట్టాడు.(నిజంగా పూర్తి ఆట ఆడితే తోలు తీస్తారు అక్కడ అందుకని కనిపించిన వాళ్ళందరికి ఆమె నా పెళ్ళాం అని చెప్పుకోవడం, ఆమె కాలేజి కెళ్ళినా,గుడికెళ్ళినా కాపల కాయడం లాంటి బాధ్యత గల పనులు మాత్రం చేసేవాడు) ఇలా పిల్లలు ముదురు వేషాలేస్తున్న సమయంలో జరిగింది ఆ ఊర్లో మొదటి ఫాక్షన్ హత్య. ఆ అమ్మాయి వాళ్ళ చిన్నాన్న ని అటువైపు వాళ్ళు ప్లాన్ వేసి పక్క ఊరికి పనిమీద పూజారి గారింటికెళ్తే వారితో కుమ్మక్కై కత్తులు కొడవళ్ళతో ముక్కలు గా నరికేశారు.అది జరిగిన అరగంటలో ఊరు అల్లకల్లోలం అయిపోయింది.ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎవరిని చంపుతున్నారో,ఎవరిళ్ళు తగలబెడుతున్నారో తెలీకుండా ప్రవర్తించారు.పోలీసులకి తెలిసి వచ్చే లోపల మగవాళ్ళు అందరూ పారిపోయారు.అడవులు పట్టుకొని తిరిగారు.అక్కడితో అయిపోలేదు. చనిపోయినతని భార్య శపదం పట్టింది నా భర్త కి ఆపోజిట్ మనిషి తాలూక వాడి రక్తంతో బొట్టుపెట్టి తరువాతే భర్తకి పిండం పెడతా అని. అలాగే ప్లాన్ చేసి బాంబు పెట్టి అతను వెళ్తున్న కారు పేల్చి అతన్ని ఇంట్కి లాక్కొచ్చి నరికించింది ఒక సంవత్సరంలో. కానీ ఈలోగా అవతలి వాళ్ళు కూడా ఊరుకోలేదు. మన హీరోయిన్ ఇంట్లో దొరికిన వాళ్ళని బంధువులని కూడా చంపారు. హీరోయిన్ అక్క భర్త పాపం ఎక్కడో కర్నూలు లో లాయర్ అయితే ఏసంబంధం లేని అతన్ని కూడా చంపేసారు. ఊర్లో అందరిమీదా పోలీసు కేసులు పెట్టారు.ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున అందరిని జైల్లో పెట్టరు. ఇటువంటి సమయంలో వెంకటేశ్వర రెడ్డీ తల్లిదండ్రులు ఆ సంబంధం చేసుకుని కొడుకుని బలి ఇవ్వలేము అని రెడ్డిని ఊరొదిలి ఎక్కడో దూరంగా వుండు అని పంపేసారు. ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళి అయిపోయింది. అలా అజ్ఞాతవాసం చేస్తూ వచ్చాడు రెడ్డి శ్రికాకుళానికి.

ఈ కధ విని బుర్ర వున్న అడ్డగాడిద ఎవరైనా సరే చచ్చినా ఆ ఊరితో కానీ, ఆ మనిషి తో కాని సంభంధం వద్దురా అని దూరం పారిపోతారు.మరి నేను బుర్ర లేని అడ్డగాడిదని కదా అందుకని రెడ్డిని ఇంకా ఇంకా ఆరాధన చూపులు చూడటం మొదలుపెట్టాను. ఫ్లాష్ బ్యాక్ లో పల్లెటూరి హీరోయిన్ అడ్డంకూడా తొలగిపోయింది కాబట్టి,నేనే ఇక ఈ కధలో నవ హీరోఇన్ అనుకుని ఫిక్స్ అయిపోయా, ఈ సమర సింహా రెడ్డి నాకే సొంతం అని డ్యూయెట్లు వేసేసుకున్నా. అసలు మా కుటుంబం లో ఎవరూ ఇంతవరకు కనీసం మర్డర్ స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేరు, కానీ రెడ్డిని ఎన్ని మర్డర్లో చూసిన అనుభవం వుంది. మా వాళ్ళు ఎవరైన గట్టిగా మాట్లాడితే భయపడిపోతారు కానీ రెడ్డి వందమందితో అయినా డిషుం డిషుం అని ఫైటింగ్ చేసేస్తాడు, మా డాడీ మహా అయితే నాకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తెస్తారు, వాడితో నేను అమెరికా వెళ్ళి అంట్లు తోమాలి అందరిలా కాకుండా మెషిన్లో తోమాలి అంతే తేడా.అదే ఈ ఫాక్షన్ హీరో ని చేసుకుంటే ...."నేను ఒక పెద్ద కుంకుమ బొట్టు తో, కాస్త కష్టమైన రోజూ ఇంట్లో కూడా కంచిపట్టు చీర కట్టుకొని, రెడ్డి ఏమో వైట్ అండ్ వైట్ పంచెకట్టు తో మేమిద్దరం పేదలకి బట్టలు పంచుతూ, పిల్లలికి పుస్తకాలు పంచుతూ.."అలాంటి డ్రీంస్ వేసుకున్నా. ఒక్క సారి ఊహించండి సమర సిం హా రెడ్డీ నో, ఇంద్రసేనా రెడ్డీ నో పెళ్ళిచేసుకుంటే ఎలా వుంటుందో!! (ఒక అమ్మాయి ఏంగిల్ నుండి ఆలోచించండి) నేను కూడా అలాంటి కలలే కన్నాను. టాటా సుమోలు, కడప బాంబులు, తొడకొట్టడాలు, కంటిచూపుతోనే రౌడీలను చంపేసేంత ధైర్యవంతుడు లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత ధైర్యంగా వుంటుంది కదా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఎవరితో చిన్న గొడవైతే వాళ్ళ కొంపలేదో మునిగిపోతాయి అన్నట్లు భయపడుతూ బతుకుతుంటారు, సో నాకు కూడా పెద్దగా ధైర్యం లేదు. కానీ రెడ్డీ మాత్రం ఆర్.టి.సి కండక్టర్ చిల్లర ఇవ్వకపోయినా వాడిని దబాయించేవాడు, చిన్న చిన్న అన్యాయాలు ఎదిరిస్తుండే వాడు. అదిచూసి నేను తనలో నిజమైన ఇంద్రసేనా రెడ్డిని చూసాను.ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా తాగి మాట్లాడినా,చీకటై ఒక్కదానిని భయపడినా తోడుండేవాడు. ఎన్ని సార్లు నేనూ తనతో ఒంటరిగా వున్నా ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. ఇవన్నీ చూసి కూడా లవ్ చెయ్యకపోవడానికి నాకేమైనా మెంటలా?అలాంటి సీన్లలో రెడ్డి అచ్చం హీరో అనిపించేవాడు.(ప్రేమ గుడ్డిది కదా,ఒక్కసారి కూడా నేను తనకి నచ్చలేదేమో అని ఆలోచించలేని గర్వం నా అందం మీద నాకు)

అంతవరకు పెళ్ళే చేసుకోను అనుకుని తీవ్రమైన నిర్ణయం తీసుకున్న నేను సరేలే ఈ ఒక్కసారికి ఈ సమరసింహారెడ్డిని చేసుకుందాం అనుకొని మా ఇంట్లో చెప్పేశా. వాళ్ళు కూడా సగం నా లాంటి ఊహలతో, ఇంకో సగం ఈ దెయ్యం (అంటే నేనే)ఎవర్నో ఒకరిని  చేసుకుంటే చాలు అనుకుని మొత్తానికి మా పెళ్ళి కానిచ్చేసారు.

అప్పుడు మొదలయింది అసలు కధ. అసలు పెళ్ళి చేసుకోవాలంటే ముందు ఇంట్లో చెప్పాలన్నప్పుడే మా సమరసింహా రెడ్డి భయపడుతుంటే తన అసలు ధైర్యం బయటపడింది, కానీ నేను సరేలే పెద్దలంటే గౌరవం ఏమో అనుకున్నా( అక్కడికి నాకు అది లేనట్లు) పెళ్ళయ్యాక మా అత్తగారు అసలు కధ చెప్పారు. ఊరందరి ఇంట్లో ఒకరు జైల్లో వున్నారు మరి మన ఇంట్లో ఎవరూ జైల్లో లేరేంటండీ అని అడిగాను. ఆవిడ అప్పుడు చెప్పారు "మీ వాయన కూడా వెళ్ళే వాడే గొడవల్లోకి, ఊర్లో అందరితో పాటు వెళ్తానని అంటే నేనే తిట్టి పంపించేసా కర్నూలు మా తమ్ముని ఇంటికి ఆతరువాత శ్రికాకుళం కి, వాడొక్కడే కొడుకు కదా వాడికేమైనా ఐతే మేము ఇక బతకలేము" అని చెప్పారు. నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. ఆ తరువాత రెడ్డీ ని అడిగా "నువ్వు ఒక్కరిని కూడా నరకలేదా? ఒక్కసారి కూడా బాంబు వెయ్యలేదా? కనీసం తొడ కొట్టడం ఐనా వచ్చా అని" అవేవీ రావని ఆ తరువాత చాలా సంధర్భాలలో చెప్పకనే అర్ధం అయిపోయింది.నా కలలన్నీ కల్లలైపోయాయి. అరివీర భయంకర శూరుడనుకొని పెళ్ళాడానే,కనీసం మామూలు శూరుడు కూడా కాదు కదా!

ఇప్పుడు చెప్పండి నాకు అన్యాయం చేసింది ఎవరు సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా? బాంబులతో , కొడవళ్ళతో ఫైటింగులు చేసే గొప్ప వీరుడని పొరబడ్డాను. అయినా తనంటే ఇష్టమే కలుగుతుంది. ఇది ధర్మమా???

(కానీ ఫ్యాక్షన్ తాలూక నిజమైన కధ తరువాత పోస్ట్ లో చెప్తాను, అది నా కళ్ళతో చూసింది, మా అత్తయ్యా చెప్పింది.మనసు ద్రవించిపోయే నిజాలు, నిజమైనా జీవితాల కధలు. కానీ ఈసారి కాస్త టైం పడుతుంది పోస్ట్ రాయడానికి, కామెంట్లకు జవాబివ్వడానికి ఎందుకంటే ఈ నెల్లూరు నెరజాణ ??? ఇక నెల్లూరు వదిలి హైదరాబాదు వెళ్తుంది.సో ఇల్లు, ఊరు,ఉద్యోగం అన్నీ మారాలంటే కాస్త టైము కావాలి కదా)

Friday, September 10, 2010

నా విరహంలో నీ తోడు

"వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా? విరహానా జోడీ నీవే. నీకు భూలోకుల కన్ను సోకక ముందే పొద్దు తెల్లార కుండా పంపిస్తాలే"

ఈ పాట లో గ్రామర్, చందస్సు ఇలాంటివన్నీ నాకు అర్ధం కావు కాని,భావం మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఎవరూ లేని ఒంటరితనంలో మనసు తోడు కోరుకున్నప్పుడు, చుట్టూ ఆహ్లాదమైన వాతావరణంలో అంటే చిన్న చిరు జల్లు పడుతుంటే సాయంత్రం 7 దాటాక వరండాలో కూర్చున్నప్పుడు కాని, చల్లని రాత్రి పూట డాబామీద ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కాని, ఏదైన తోటలో, నీటి వొడ్డున ప్రసాంతంగా వున్న ఆ మౌనంలో నాకు మాత్రం వేరే ఏ మనిషి తోడు కూడా వొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమో నాకు ఆ ఒంటరితనం చాలా బాగుంటుంది. కాని నాతో పాటు మౌనంగా కూర్చొని ఆ ఏకాంతానికే అందాన్ని, అద్భుతాన్ని తీసుకు రాగల ఒక తోడు కావాలనిపిస్తుంది. అది వేరే ఏ మనిషి తీసుకు రాగలరని నాకు అనిపించదు. మనకెంతో ఇష్టమైన మన పిల్లలైనా, ప్రియుడైనా, నేస్తమైనా కూడా కొన్ని సంధర్భాలలో ఎవరూ వద్దు ఒంటరిగా వుండాలి అనిపిస్తుంది కాని ఇంకేదో తోడు కావాలనిపిస్తుంది. ఈ భావం ఏంటో నాకే అర్ధం కాదు. అంటే అప్పుడు తోడు వద్దు కాని కావాలి అంటే ఏమైనా అర్ధం వుందా అసలు. నాకు మెంటల్ వచ్చిందా ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. నాకు చాలా సార్లు అలాగే అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించేదాన్ని ఇప్పుడు మరి నాకు ఎలాంటి తోడు కావాలి అని. ఏ మనిషి లో ఐన ఏదో ఒకటి నచ్చనిది వుంటుంది, వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి. అలాంటి తోడు కాదు కావాల్సింది. మౌనంగా వుండాలి కాని మాట్లాడుతున్నట్లే వుండాలి. ఆ చల్లని రేయికి, ఆ చక్కని ప్రకృతికి, ఆ చిక్కని నిశి కి కూడా అందాన్ని తెచ్చేలా వుండాలి. తను పక్కనుంటే చాలు మనసు ప్రశాంతంగా అయిపోవాలి, అమ్మ ప్రేమలా, స్నేహితుని భరోసా లా చల్లగా అనిపించాలి. ప్రియుని కౌగిలిలా మత్తుగా గమ్మత్తుగా వుండాలి.

ఇవన్నీ మనుషులెవరూ ఇవ్వలేరు. కాని ఇలాంటి అనుభవం నాకు కలిగింది.ఒకసారి కాదు కొన్ని సంధర్భాలలో తన తోడు నా విరహపు రాత్రుల్లో దొరికింది. ఆ తోడే, నేస్తమే, ఆ ప్రియుడే నా అందాల మామ, చంద మామ. ఆ ఏకాంతంలో తన తోడు దొరికినప్పుడంతా ఎంతో తృప్తి. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు చంద్రుడు రోజూ అక్కడే వుంటాడు. కాని మనం చూసే దృష్టి వల్ల ఒక్కోసారి మాత్రమే అందంగా కనిపిస్తాడు అని. కాని అది నిజం కాదు. ఆ చంద్రుడు మన మనసు లోకి చొరబడితేనే అందం కనిపిస్తుంది. ఏకాంతంలో తన తోడు ని అనుభవిస్తూ మౌనంగా ప్రేమించగలిగేతేనే ఈ తృప్తి కలుగుతుంది.

వజ్రపుకొత్తూరు లో వున్నప్పుడు కొన్ని సార్లు సాయత్రం 7 దాటాక సముద్రపు ఒడ్డుకు వెళ్ళేదాన్ని. చీకటి, చక్కని రేయి, నిర్మానుష్యమైన సముద్ర తీరం, చల్లగా మెత్తగా కాళ్ళకింద తగిలే ఇసుక, గాలి తో పాటు ఎగిరి వచ్చి తాకే నీటి తుప్పర్లు, అంత ఒంటరి రేయిలో కూడా హోరున ఏదో చెప్తున్నట్లుందే సముద్రపు ఘోష. మొదట కలిగేది భయం, అది ఈ లోకపు పరిస్థితులు కలిగించే భయం. ధైర్యం చేసి అక్కడెక్కడో పడవల దగ్గర కనిపించే ఒకరో ఇద్దరో మనుషుల గురించి భయపడకుండా, తోటి మనుషులున్నారు అని ధైర్య పడగలిగి ఇసుకలో కూర్చోగలిగితే మొదలవుతుంది ఆ ప్రేమ ప్రయాణం. సముద్రం పై వెన్నెల చేసిన వెండి వెలుగుల దారి లో మొదలవుతుంది ఈ లోకాన్ని విడిచి తనతో గడపాలని చూసే నాకోసం చనదమామ దిగి వచ్చే అద్భుతం.కెరటాల మీద వెన్నెల వజ్రాల మెరుపులు నన్ను, నా చుట్టూ వున్న లోకాన్ని అబ్భుతమైన సౌందర్య రాసిగా ముస్తాబు చేస్తాయి. ఆ కెరటాల హోరు లో వున్న విరహ వేదన నాదేనా అనిపిస్తుంది. గాలి తో పాటు నా వేదనా గీతిక చంద్రుని చేరిందా! ఆ చీకటి వెలుగుల్లో ఒంటరిగా ఎవరు నాకోసం చూస్తున్నారు అని మబ్బుల చాటునుండి మరింత ప్రకాశంతో నన్ను తొంగి చూస్తున్నది అందుకేనా! ఇంత విశాల ప్రపంచంలో పక్కనే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి గొడవల్లో వాళ్ళు పడిపోతే కేవలం తన కోసమే ఈ అంతులేని జలరాసి కి ఎదురుగా, అందరికీ దూరంగా ఈ ఇసుక తిన్నెల నడుమ భయపడక చూస్తున్న నాకోసం దిగి రాక ఏమి చేస్తాడు? చంద మామ తన నేస్తాన్ని కలవాలని వచ్చినప్పుడు ఇక ఆ ఏకాంతానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డు తగల లేదు. మరునాడు ఇవ్వాల్సిన రిపోర్టులు కాని, చీకటిలో కలిగే భయాలు కాని, ఇంటికెళ్ళమని హెచ్చరించే పల్లెకారులు కాని, తొందరగా తిరుగుతున్న చేతి వాచి ముల్లు కాని ఏమీ కనిపించవు వినిపించవు. ఇక ఎవరూ మనుషులు రారు అని ధైర్యంగా ఇసుక రంధ్రాల లోనుండి బయటకి వచ్చి సముద్రపు ఒడ్డునంతా నింపేసి అల్లరిగా పరిగెత్తే పీతలు జనాభా కూడా కనిపించదు, దూరంగా సముద్రం లోపలకి వేటకి వెళ్ళిన వారికోసం ఒడ్డున ఏర్పాటు చేసిన ఎత్తైన రాట పై కుండలో వెలుగుతున్న దీపం వెలుతురే పట్టపగలు అనిపించేంత ధైర్యాన్ని ఇస్తుంది. గాలి తో పాటు తాకుతున్న నీటి తుప్పర్లు మేమంతా నీకు తోడున్నాము అని చెప్తాయి. సముద్రపు ఘోష సంగీతమైపోతుంది. ఇక నాకు భయమన్న మాటే మతికి రాదు. చందమామ నా విరహాన తోడై వచ్చేసాడు. నేను, తను ఇద్దరం మౌనంగా సముద్రాన్ని చూస్తున్నాము. నాకు ఆ సముద్రం ఎందుకో ఆడుతూ అల్లరి చేస్తున్న నా చిన్నారి పాప లా అనిపించింది. చందమామ తన వెన్నెల తో పాపని నిమురుతున్నాడు. నేను నా చూపులతో కెరటాల అల్లరికి నవ్వుతూ మురిసిపోతున్నాను. ఈ సముద్రానికి ఇంత అందం ఎక్కడిది. కెరటాల పై మెరిసే ఆ వజ్రాల వెలుగు, పాల నురుగు చందమామది ఐతే, ఈ చలాకీ తనం, లోతైన భావం నా పోలిక. ఆ అంతులేని తనం మా ఇద్దరి పోలిక నాకు చంద్రుని పై వున్న అంతులేని ప్రేమ లా, చంద్రునికి వున్న అంతులేని ఆకర్షణ లా ఈ సముద్రానికి ఎక్కడా లేని అంతులేని నీరు గా మారింది. నేను చంద్రుని చూడటం లేదు కాని ఆ సముద్రంలో మెరుపుగా,ఆ గాలిలో చల్లదనం లా, ఆ చీకటిలో వెలుగులా, నన్ను చుట్టు ముట్టిన తన వెన్నెల కౌగిలిలోనే నేను వున్నాను. చందమామ కూడా నన్ను చూడటం లేదు ఎగిసి పడుతున్న కెరటాలలో నా మనసులోని భావాలను,భయాలనూ నవ్వుతూ చూస్తున్నాడు. మేమిద్దరం మౌనంగా వున్నాము కాని మాట్లాడుకుంటున్నాము. " నేను ఫీల్డ్ కి వెళ్ళినా, బండి మీద వస్తున్నా నా వెంటే వస్తున్నావు కదా, జీడి చెట్ల చాటునుండి నువ్వు నన్ను చూడటం నేను చూసాలే అని నేను చెప్పాను.' 'చూస్తున్నానని నువ్వు గమనిస్తున్నావని నేను కూడా చూశాలే, ఎవరితోనో మాట్లాడుతూ చీకటి పడే సరికి నేను వచ్చానా లేదా అని నువ్వు ఆకాశం వైపు చూడటం నేనూ చూశాలే, నేను రాని రోజున నీ కళ్ళల్లో నిరాశ ని మబ్బుల చాటు నుండి చూశాలే" అని నన్ను మౌనంగా నే ఆట పట్టిస్తున్నాడు"

ఎంత సమయమైనా మేమిద్దరం ఇలా మౌనంగా ఒకరికొకరు తోడుగా వుండగలం. తన చల్లని వెన్నెల వెలుగులు నాకిష్టం, తనని చూసి మురిసిపోయే నా కళ్ళల్లో వెలిగిపోయే వెన్నెల తనకిష్టం. కాని మా మౌనం, ఏకాంతం సముద్రపు ఘర్జన తో భంగం అయింది. ఇక నేను అల్లరి చేసి ఆటలాడి అలసి పోయాను, ఇక నిద్ర వస్తుంది నాకు అని గట్టిగా చెప్పింది. ఇక చేసేదేముంది, మళ్ళీ కలవాలని కళ్ళతోనే బాస చేసుకొని విడిపోయాము. చందమామ పైకెళ్ళిపోయాడు, సముద్రానికి వెన్నెల దుప్పటి కప్పి జోకొట్టాడు. నేను పెదవులు కలిపాను గుడ్ నైట్ కిస్ పెట్టాలని,సముద్రపు ఉప్పదనం తగిలింది నా పెదవుల పై. నవ్వుకుంటూ వచ్చేశాను.మనసంతా ఎంతో హాయిగా వుంది,తృప్తిగా వుంది,అసంతృప్తిగా వేదనగా కూడా వుంది. నాకు తెలుసు పైనుండి నన్నే చూస్తున్నాడని, అదే నాకు తనపై వున్న భరోసా. తనకి తెలుసు నేను ఇప్పుడు తనని చూడనని, చూస్తే వదిలి వెళ్ళలేనని, ఆ ప్రేమకే లొంగి పోయి వస్తున్నాడు నాకోసం నేలపైకి నా విరహపు రాత్రుల్లో తోడుగా..ఎప్పటికీ.

ఇలాగే కాకపోయినా కొద్ది తేడాతో అయినా మనలో ప్రతీ ఒక్కరికి జీవితంలో అప్పుడప్పుడు ఏకాంతం కావాలని, ఆ ఏకాంతంలో ప్రకృతి మన తోడు గా వుంటే మనసు సంతోషంతో నిడిపోయి తృప్తి,అసంతృప్తి ల మధ్య ఊగిసలాడుతూ ఒక తీరని వేదన కలుగుతుంది కదా!! అది ఎందుకు అలా? అది ప్రకృతిలో వున్న గొప్పతనమా? ఇటువంటి అనుభవం నాలుగు గోడల మధ్య ఏరోజూ కలగదు. నేను ఎప్పుడైనా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సముద్రపు వొడ్డున వున్నా, కృష్ణ తీరాన కూర్చున్నా, జీడి తోటలో కూర్చున్నా, వెన్నెల రాత్రిలో మాత్రమే కలుగుతుంది. రూం లో ఒక్కదాన్నే వున్నా కూడా ఇటువంటి అద్భుతమైన భావం కలగదు. మహా అయితే బోర్ కొట్తి విరుగొస్తుంది, టి.వి.చూసి తలనొప్పి వస్తుంది. మీకెంతో నచ్చిన ఫ్రెండ్ తో మాట్లాడినా, ఒక వేళ మీ లవర్ తో మాట్లాడినా కూడా కలగని సంతోషం ప్రకృతిలో వుంది. వీలైతే ట్రై చెయ్యండి. అదే ఇష్టమైన మనిషితో ఒక్కసారి అలా ఒక ఏకాంతమైన ప్రకృతిలో 10 నిముషాలు మాట్లాడకుండా కూర్చున్నా కూడా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. నాకు ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూనే వుంటాయి అటువంటి సన్నివేశాలు. ఇంత గొప్ప అనుభవాలను ఇచ్చిన ఈ జీవితం అంటే, ఈ వుద్యోగం అంటే, వీటిని ఆస్వాదించగలిగే నా మనసంటే నాకెంతో ఇష్టం. ఇదంతా మనం మనిషిగా పుట్టడం వలనే కదా! ఎన్నో భావాలను నింపుకున్న మనసులున్న ఈ మనుషులంటే కూడా ఎంతో ఇష్టం. కలిసిన ప్రతీ మనిషి లో ఏదో ఒకటి నచ్చుతుంటే అందరిని ఇష్టపడుతుంటే జీవితం ఎంత బాగుంటుంది కదా!!! ద్వేషాలు లేని, కోపాలు లేని, కల్మషంలేని సంతోషం అందరికీ దొరకాలని ఆశిస్తూ....

మరొక అరుదైన అనుభవాల దిరిసెన పుష్పాన్ని మీ ముందుంచుతున్నాను.

(అంతా రాసి చదివాక ఏదో కవిత్వం లా అనిపిస్తుంది. కాని మొన్న ఒకసారి ఊరినుండి వస్తుంటే జీప్ లో నుండి చూస్తే నాతో పాటు వస్తున్న చంద్రుడుని చూస్తూ వచ్చాను. హొటెల్ రూంలోకి వచ్చాక కూడా నా వెంట పరిగెత్తి వస్తున్న ఆ చందమామే కళ్ళముందు కనిపిస్తుంటే మనసులో కలిగిన భావాలు గుర్తొచ్చిన ఙ్ఞాపకాలు ఇలా రాసాను)

Sunday, August 22, 2010

లవ్, సెక్స్ అండ్ బిజినెస్

(ఈ పోస్ట్ కి ఈ పేరు కి సంబంధం లేక పోతే మాత్రం నన్ను తిట్టుకోకండి. నాకు పేరు తోచలేదు అందుకే ఈ పేరు పెట్టేసా.)

ఆ మధ్య నా కొలీగ్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అందమైన ఆడ జీవి కనిపించింది. నా మనసులో సంతోషం ఆపుకోలేక తన అందాన్ని నా కొలీగ్ కి వర్ణించాను. "చూడు వినోద్ ఆ షేప్ బ్యాక్ నుండి చూస్తే ఇలాంటి షేప్ బెస్ట్, స్కిన్ చూడు ఎలా మెరుస్తుందో, ఇలా ఆరోగ్యంగా పెద్ద బ్యాక్ తో వుంటేనే అసలు సిసలు జాతి అందం,బాగా పాలు పడతాయి తెలుశా అని చెప్పాను." నా కొలీగ్ నా వైపు చాలా వింతగా చూసి నువ్వు మరీ ఇంత పచ్చిగా  మాట్లాడతావా అని నా వైపు అక్కడ ఎదురుగా వెనక్కి తిరిగి నిల్చున్న ఒకామె బ్యాక్ షేపు ని మార్చి మార్చి చూడటం మొదలు పెట్టాడు. ఛీ ఛీ నేను  చెప్పింది ఆవిడ గురించి  కాదు అక్కడ మేస్తున్న గేదె గురించి అని చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఆశ్చర్యపోతూ "నువ్వు గేదె అందం గురించి మాట్లాడుతున్నావా?" అని అడిగాడు.మీకెప్పుడైన అందం అంటే ఎవరు గుర్తొస్తారు, అమ్మాయిలు, చిన్నపిల్లలు, ప్రకృతి, మంచి ఆర్ట్ ఇలా ఏవేవో గుర్తొస్తాయి కదా, కానీ నాకు గేదెలు గుర్తొస్తున్నాయి. నాకు దెయ్యం పట్టిందా అని చూడకండి ఇది నిజంగా నిజం. ఇప్పుడు కాస్త ఆ పిచ్చి తగ్గింది కాని, ఆ మధ్య పశువుల పెంపకం ట్రైనింగ్ తీసుకున్నప్పుడునుండి ఈ పిచ్చి. ఎక్కడైన గేదె కనిపిస్తే చాలు, దాని బ్యాక్ షేప్ ఎలా వుంది, స్కిన్ మెరుస్తుందా లేదా, కొమ్ములు బాగున్నాయా లేదా, నడక బాగుందా లేదా అని చూడటం మొదలు పెట్టాను.

పల్లెల్లో పనిచేస్తున్నప్పుడు వారి ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రాజెక్టులు చెయ్యటం ముఖ్యం. కూటి కోసమే కదా కోటి విద్యలు. సిటీ లో రకరకాలా పనులుంటాయి చేసి బతకడానికి. కానీ పల్లెల్లో ఏ కుటుంబం చూసినా వారి జీవనాధార గంపలో కనీసం రెండు మూడు రకాల పండ్లు(పనులు) వుంటాయి. అవి కూడా వ్యవసాయము, పశువుల పెంపకం లాంటివే. పల్లెల్లో ప్రతీ వారికి తప్పక ఒకటైన పశువు/ఎనుము/(బర్రె లేదా అవు), వుంటాయి. మరీ పేద వాళ్ళయితే మేకలు, గొర్రెలు వుంటాయి. నిజంగా చూస్తే బర్రెలు, ఆవుల కంటే మేకలే నయం. వాటిని మూవింగ్ బ్యాంక్స్/బ్యాంక్స్ ఆన్ లెగ్స్ అనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయొచ్చు. తినేది తక్కువ, వాటికోసం చేసే సేవ, కష్టం తక్కువ ఆదాయం బాగుంటుంది. కానీ ఈ బర్రెలున్నాయే.......అదో పెద్ద వ్యాపారం, పని, కళ, కధ ఎదైనా అనొచ్చు. నాకు మనుషుల కంటే కూడా బర్రెలగురించే బాగా తెలుసు అనిపిస్తుంది ఒక్కోసారి.

చిన్నప్పుడు మా ఇంట్లో కూడా పశువులుండేవి అంట. కానీ మా ఇంటికి దూరంగా పశువుల శాల లో వుండేవి. నాకు పాల మీగడలో పంచదార వేసుకొని తినడమే తెలుసు కానీ పశువుల గురించి అసలు ఈ జాబ్ లో జాయిన్ అయిన వరకు ఏమీ తెలీదు. ఎద్దు అన్నా దున్నపోతన్నా మా మమ్మీ నన్ను తిట్టడానికి వాడే తిట్లు అని మాత్రమే తెలుసు. ఇక పశువుల్లో ఆడ మగ తేడా అసలు ఊహకే రాని విషయం.(మా మమ్మీ మాత్రమే, నన్ను మాత్రమే తిట్టే తిట్టు - లెంబెయ్యలా ఏడవకు" అని అర్ధం తెలుశా మీకు?) అలాంటి నేను మీకిప్పుడు ఎన్ని విషయాలైనా చెప్పగలను.

పల్లెల్లో ఆదాయాభివృద్ధి కార్యక్రమం అనగానే గుర్తొచ్చేది ఈ పశువులే, వాళ్ళు కూడా మాకు ఒక గేదెని ఇప్పించండి బాగుపడతాం అంటారు. మొదట్లో అవును కాబోలు, నిజమే ఏముంది ఒక గేదె ఇచ్చేస్తే పోయిందికదా, అది చక్కగా రోజూ పాలిచ్చేస్తుంది, ఆపాలు అమ్మేసుకొని వీళ్ళు అదేదో సినిమాలో వెంకటేష్ లాగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లు అయిపోతారు అనుకునేదాన్ని

అసలు పశువులు ఎక్కడబడితే అక్కడ ఎడ్జస్ట్ కాలేవు.వాటికి అలవాటైన వాతావరణం లో కూడా సరిగా పాలు ఇవ్వాలంటే ఎన్నో కండిషన్స్ అప్లై అవుతాయి.పచ్చి మేత,ఎండు మేత, దాణా, నీళ్ళు, దోమలు, అది వుండే ప్రదేశం, వేడి, వాసన,కాలం ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో విషయాల ప్రభావం వుంటుంది. ఎక్కడో హర్యానాలో బాగా పాలిస్తున్నాయి కదా అని జెర్సీ జాతి ఆవులని ఇక్కడికి తెచ్చి ఇచ్చారు పశు క్రాంతి పధకం లో, చూడడానికి భలే బాగున్నాయి. అది తినే తిండి పెట్టలేక ఆస్థులు అమ్ముకోవలసి వచ్చింది రైతులకి. తీరా తినింది కదా ఇక పాలివ్వొచ్చు కదా!! అహా లేదు అసలు ఇవ్వట్లేదు. కారణాలేంటని మాకొక చర్చ జరిగింది. ఏలూరులో వెలుగులో మా డి.పి.ఎం లు ఆ ఆవుల వెంట తిరిగి, వాటితో పాటు మేతకెళ్ళి, నిద్రపోయి పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడి వేడి తట్టుకోలేకపోవటమే కాక, పాపం ఈ ఆవులు సైటు కొడుతుంటే ఎద్దులకి తెలియటం లేదంట. అర్ధం కాలేదా, సరిగా చెప్తా వినండి. మామూలుగా ఈనిన 21 రోజులకే పశువులు మళ్ళీ ఎదకొస్తాయంట, ఎదకొస్తే మన ఏరియా లో పశువులు నానా హంగామా చేస్తుంటాయి. ఎక్కువగా అరవటం, కట్టు తెంచుకొని పరిగెత్తటం, మిగిలిన పశువుల మీదకి ఎక్కడం లాంటివేవో, చేస్తాయి. గేదలకైతె కొన్నిసార్లు మూగ ఎద వస్తుంది అంటే సరిగా ఎద లక్షణాలు కనిపించవు. అందుకని వేసక్టమీ చేసిన పోతులని మందలో వదలటం లేదా చీకటి గదిలో 2 రోజులు వుంచటం చేస్తారు. ఇలా మన ఏరియా పశువుల ప్రేమ భాషే మనకి తెలీదు. ఇక హర్యానా పశువు ప్రేమ భాష ఇక్కడి ఎద్దులు అర్ధం చేసుకోలేకపోయాయి. ఇలా మనసు విరిగిన ఆవులు పాలు ఇవ్వటం, చూడి కట్టడం మానేసాయి.(లవర్ మీద కోపం వస్తే అమ్మ మీద అలిగి అన్నం మానేసినట్లు) మనకేమైనా సరదా నా వాటిని ఊరికే మేపి కూర్చోబెట్టడానికి.వాటి ప్రేమ, వాటి సెక్స్, వాటి జీవితం అంతా మనం నియంత్రిస్తున్నది ఎందుకు?, మన లాభం కోసమే కదా. అలా అని ఎవరితో బడితే వాళ్ళతో ..ఐ మీన్ దారిన పోయే దున్నపోతులన్నిటితో ప్రేమలో పడకూడదు. మేలు జాతి గిత్తలుండాలి. అవి ఎవరు పెంచుతున్నారు ఈకాలం. వ్యవసాయానికి అవసరమైన రోజుల్లో ,ఎడ్ల పందాల కోసమో వుండేవి. ఇప్పుడు వాటితో అంత వుపయోగం లేదు.ఒక వేళ ఒకటీ రెండూ అక్కడక్కడా వున్నా అవి మేలు జాతి అని గ్యారంటీ లేదు, దీని తల్లి గుణాలు బట్టి మేలు జాతి అవునా కాదా అని నిర్ణయించాలి. ఆవిడెక్కడుందో ఎవరికి తెలుస్తుంది(మనుషులని అలా తల్లి నుండి కుటుంబం నుండి వేరు చేసేసి ఎక్కడో సంతలో అమ్మేస్తే ఎలా అనిపిస్తుంది? ఒక్కోసారి ఇలా సంతలని, పశువులని పరిశీలిస్తే బాధగా అనిపిస్తుంది, వాటికి అసలు తెలుస్టుందో లేదో కాని) ఒక వేళ మేలు జాతి అయినా మహా అయితే 100-150 సార్లు మాత్రమే సెక్శ్ చెయ్యగలదు జీవిత కాలంలో. మన బిజినెస్ టార్గెట్స్ కి ఈ సెక్స్ నెంబర్ ఏమూలకీ రాదు. అదే వీర్యం కలెక్ట్ చేసి పెడితే 2-5 వేల పశువులకి గర్భదారణ చెయ్యొచ్చు. పశువులని చూస్తే వాటి మగ జాతి మీద పాపం జాలేస్తుంది. కేవలం వీర్య దాతలుగా కాక ఇంకెందుకూ అవసరం లేకుండా పోయాయి. కోళ్ళల్లో పెట్టకావాలి గుడ్డు కావాలి, పెద్ద పశువుల్లో చూస్తే ఆవు, గేదె కావాలి పాలు కావాలి. ఆడ దూడ కావాలి.కోడె దూడ కొన్నిరోజులకే తిండి దండగ అంటారు.మేకల్లో కూడా అంతే ఆడ మేక కావాలి చక్కగా సంవత్సరం తిరిగే సరికి 4 పిల్లలు రెండు ఈతల్లో.మేకల్లో ఐతే అసలు మరీ దారుణం మంద అంతటికీ కలిపి ఒకటే మేక పోతు. మరీ ఇంత బహు భార్యత్వమా?? మొదట్లో మేము చాలా ఇబ్బందులు పడేవాల్లం కొన్ని ప్రశ్నలు వెయ్యడానికి. నాబార్డ్ రూల్స్ ప్రకారం 6మేకలు ఒక మేక పోతు కొనుక్కోమని ఒక గ్రామంలో 20 మండికి డబ్బులిచ్చాము. వాలేమో ఊరిలో మంద మొత్తానికి ఒకే మేక పోతు కొన్నారు ఎందుకలా చేశారు అని అడిగితే ఒకటి చాలు మంద అంతటికీ అని చెప్పారు. మా సుధర్శంగారు తనకి వచ్చిన తెలుగులో "అలా అయితే ఎలా బాబు ఒక్క పోతు ఎంత కష్టపడుతుంది అన్ని మేకలతో?" అని అడిగేసారు. ఆ గ్రామస్థులందరు నవ్వి నవ్వి ఎదో బూతు మాట అనేసారు. అతనికి తెలుగు రాదు కాబట్టి అర్ధం కాక బతికిపోయారు, నాకు అర్ధం అయి కానట్లు నటంచేసాను. ఉత్పత్తి దారుడికి కష్టమే తప్ప లాభం పెద్దగా వుండదు ఎలాగూ అందుకే వాళ్ళు ఇవన్నీ అంచనా వేసి ఏది లాభం అని చూసుకుంటారు. ఎదకొచ్చింది కదా అని ఎప్పుడు బడితే అప్పుడు గర్భదారణ చేయించరు. 12 గంటలలోపల చేయించాలి. కానీ పాలిచ్చే పశువులకి కనీసం 4, 5 నెలలు ఎదకొచ్చినా కట్టించరు. గర్భం వస్తే పాలు తగ్గిపోతాయనే అనుమానం తో, కానీ సరైన ఆహారం పెడితే, ఈత, పాల గ్రాఫ్ చూసుకొంటే మొదటి, రెండో ఎదల్లో కట్టిస్తే వాళ్ళకి కూడా లాభం ఎప్పుడూ పాలిస్తుంది మద్యలో ఒక నెల మాత్రం గ్యాప్ తో , కానీ కట్టించక పోవటం వల్ల,అది ఎదకొచ్చీ వచ్చీ ఇక విసుగొచ్చి ఎదకి రావతం మానేస్తుంది. అంతే కాదు ఒక వేల 4, 5 నెలల తరువాత కట్టించినా ఈలోగా పాలు ఆగిపోయి 4,5 నెలలు పాలివ్వకుండా సూడితో వుంటుంది. ఈలోగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన లోను కి
బకాయి పడిపోయి పశువుని అమ్మేస్తారు.

ఎంత చేసినా గేదె పాలు(+ నీళ్ళు), పేడ, ఎరువు అన్నీ కలిపినా ఖర్చులు పోను నెలకి 1500/- అంతే ఒక గేదె నుండి ఆదాయం రాదు. అదీ కొన్ని నెలలు ఎందిపోతుంది కాబట్టి 3,4 గేదెలు వుంటే కాని సరైన ఆదాయం రాదు.ఎక్కువయ్యే కొలది ఖర్చు కూడా. వ్యవసాయం వున్న వాళ్ళకే ఈ పశువులు లాభం.గడ్డి ఖర్చు వుండదు కాబట్టి. లేదంటే వ్యవసాయం లేనివాళ్ళు అప్పులపాలైపోతారు.


ఏంటో ఈ పశువులు, పేడా, పిడకలు అనుకుంటూ ఈ పోస్టు మరీ దూరదర్శన్ వారి పందుల పెంపకం ప్రోగ్రాములా వుందా?అయినా సరే చదివారుగా, అందుకు కృతజ్ఞతగా మీరెపుడైనా పశువులు పెంచాలనుకుంటే నన్నడగండి మీకో మంచి గేదెని సెలెక్ట్ చేసి పెడతాను. అంతే కాదు ఇంకా చాలా మెళుకువలు కూడా నేర్పిస్తాను. అయినా నాలాంటి పిచ్చి కోరికలు ఎవరికుంటాయి? నాకు మాత్రం చక్కగా ఒక 5 ఎకరాలా స్థలం లో అన్ని కాయాగూరలు, పండ్లు చెట్లు వేసి, 4 గేదెలు, 6 మేకలు పెంచుకుంటూ పంపుసెట్టు దగ్గర, కొబ్బరి చెట్ల నీడలో, రావి చెట్టు దగ్గరలో చల్లని తాటాకుల పాకవేసుకొని,ఊర్లో పిల్లలికి ట్యూషన్లు చెప్పుకుంటూ బతికితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.కానీ అది ఎప్పటికైన నిజమవుతుందో లేదో!! నేను కూడా ఇప్పుడు కాదు, ఈపని ఇక వద్దు అని అనిపించినప్పుడు.

(ఇప్పుడు సడన్ గా నాకు ఈ జంతు ప్రేమ ఎందుకొచ్చిందో తెలుసా, మేము చేసిన ప్రాజెక్టులకు ఎవాల్యూయేషన్, ఆడిట్ జరుగుతుంది కదా ఈ లోపల మళ్ళీ అన్ని ప్రాజెక్టులు చూసి వాటిని చెయ్యడంలో మా వుద్దేశ్యం నెరవేరిందా అని చూస్తున్నాము. వాటిలో భాగంగా ఈ నల్లని నిగనిగలాడే గేదలను చూస్తుంటే ఈ ఆలోచనలన్నీ వచ్చాయి సరే అని పోస్ట్ రాసి పడేసా..)

Friday, August 20, 2010

మీ కడుపున మళ్ళీ అమ్మాయిగా పుడతా

నాకు కొంచెం సహాయం చేస్తారా?

హైదరాబాదు అంటేనే నా గుండె దడ దడా అంటుంది. ఎందుకంటే ఈ మధ్య రెండుసార్లు వెళ్ళి ఆ ట్రాఫిక్ చూసి పిచ్చెక్కింది. ఇక అక్కడే వుండాల్సి వస్తుంది. ఏమైనా జిల్లాల్లో వుండే హాయి అయిన జీవితం సిటీలో వుండదు కదా! పిల్లల స్కూలు, మన ఆఫీసు, ఇల్లు ఇవన్నీ ఎక్కడ కుదురుతాయో చెప్పలేము. నా ఆఫీస్ పంజాగుట్ట, మా హబ్బీ ది ఉప్పల్, మా తమ్ముడు బోరబండ, నేను రోజూ మెదక్, మెహబూబ్ నగర్ వెళ్తుండాలి. ఇదీ టోటల్ గా మేము తిరగబోయే ప్రదేశాలు. తమ్ముడు ఆఫీస్ హైటెక్ సిటీ ఒక వేళ వాడు మాకోసం ఇల్లు మారినా వాడికీ మరీ కష్టం కాకుండా వుండేలా మేము ఇల్లు చూసుకోవాలి. ఇవన్నీ కలిసే ప్రదేశం ఒకటి చెప్పండి. అంతే కాదు అన్నిటికంటే ముఖ్యం మా లక్కీకి మంచి స్కూల్ వుండాలి అదే ప్రధానమైన విషయం. వాడు చదివేది 1 క్లాస్ కానీ ఇప్పటికి వందసార్లు స్కూల్ మారాడు ఇప్పుడైన ఒక మంచి స్కూల్ లో వేసి ఇక మార్చకుండా కనీసం ఒక 5 సంవత్సరాలు వుండేలా వుంచుదాము అనుకుంటున్న. పాపం వాడికి స్నేహితులే వుండటం లేదు. మరీ రుబ్బుడు స్కూల్స్ కాకుండా స్పోర్ట్స్, విలువలు కూడా నేర్పే మంచి స్కూల్ ఏదైన తెలియజేయండి. అలాంటి స్కూల్స్ అసలు మన ఇండియాలోనే లేవంటారా? ఒక వేళ వున్నా లక్షల్లో ఫీజులు గుంజుతారేమో! నన్ను అప్పుల పాలు చెయ్యనిది, లక్కెని కష్టాల పాలు చెయ్యనిది మంచి స్కూల్ ఏదైన తెలిస్తే సలహా ఇవ్వండి. మన బ్లాగర్స్ లో హైదరాబాదీయులు ఎక్కువగా వున్నరనిపిస్తుంది. కనుక నాకు ఒక అనుకూలమైన ఏరియా మరియు స్కూల్ విషయం గురించి సమాచారం ఇచ్చి పుణ్యం కట్టుకోండి. వచ్చే జన్మలో మీ కడుపున మళ్ళీ అమ్మయిగా పుడతా. అస్సలు అల్లరే చెయ్యను.

Wednesday, August 18, 2010

మార్పు కావాలనిపించటంలేదా మీకు?

హాయ్ ఆల్, ఈరోజు నాకు సంతోషించాలో బాధపడాలో తెలియటం లేదు. మా చెల్లి అమెరికాలో వుంటుంది తను కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కుంటూ చాలా కష్టమైన పరిస్థితి లో ఇండియా వస్తుంది. ఆ గొడవలతోనే రోజు మొదలయ్యింది.ఇంకా అవే ఫోన్లతో రోజు గడుస్తుంది. అసలు అమెరికా అని ఆస్త్రేలియా అని అంత దూరం ఎందుకు ఇస్తారో ఆడపిల్లల్ని, తల్లి దండ్రులు తోబుట్టువులకి అందరికీ దూరంగా , ఏ కష్టమొచ్చినా పరిగెత్తుకు రావడానికి ఎవరికీ వీలు కాదు. కష్టాలే కాదు సంతోషం అయినా సరే. ఈ గొడవల్లో నా మనసెంత విరిగిపోయిందంటే, ఎంత భయం వేస్తుంది అంటే అసలెందుకు పెళ్ళిళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు, అమ్మ నాన్న తో హాయిగా వుండిపోవచ్చుకదా అనిపిస్తుంది. నాకు ఈ సందేహం ఎప్పటి నుండో వుంది. ప్రస్తుతం వున్న వివాహ వ్యవస్థ ఎప్పుడో మనువు రాసిన రూల్స్ మీద నడుస్తుంది. అప్పటి సామాజిక పరిస్థితి, స్త్రీ పురుషుల మద్య డిఫరెన్సెస్, జీవన విధానం,ఆర్ధిక కార్యకలాపాలు, సామాజిక కార్యకలాపాలు అన్నీ ప్రతీది చాలా వేరుగా వుండేది. అప్పటి కుటుంబం నిర్వహించే విధులు, స్త్రీ పురుషులు నిర్వహించే పనులు, వారి అవగాహన, విద్య, ఎక్స్ పోజర్, చట్టం, న్యాయం అన్నీ ఇప్పుడు మారిపోయాయి. అప్పట్లో పెళ్ళి ఒక మతపరమైన నియమాలకు లోబడి కుటుంబాలు నడిచేవి కాబట్టి అటువంటి రూల్స్ తో జరిగేది. ఇప్పుడు మతాలకి, కుటుంబానికి, జీవన విదానానికి సంబంధం లేకుండా వుంది. కానీ ఇప్పటికి కూడా పెళ్ళి నుండి మనం మనువు చెప్పిన, లేదా మధ్యలో మార్చబడి ఎలాగో వచ్చిన పాత పద్ధతులనే ఆశిస్తూ పెళ్ళి నుండి ఒక పాత కాలపు, బార్యని లేదా భర్తని కోరుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఇవన్నీ ఎదో ఆధారం లేకుండా అనుకోవటంలేదు. 100 జంటల్లో 90 జంటలు సమస్యలతో వున్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఒకవేళ వున్నా కొన్నాళ్ళే. మనం మన రాజ్యాంగాన్ని రాసుకున్నాము, న్యాయశాస్త్రాన్ని రాసుకున్నాము, చట్టాలు చేసుకున్నాము. వీటన్నిటికి ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నాము. అవి కూడా ఎదో మహా గొప్పగా వున్నాయి అందరు వాటితో సంతృప్తి గా వున్నారని చెప్పటం లేదు. సమాజం అంటే క్రిమినల్స్, లాయర్లు, రోడ్లు, భవనాలు, ఆస్తులు, రాజకీయాలు ఇవేనా. కానీ వీటన్నిటికంటే సమాజం అనేది కొన్ని కుటుంబాల సమూహం కదా! అటువంటి కుటుంబ వ్యవస్థ ఎటువైపు వెల్తుంది? మన కుటుంబ వ్యవస్థ అందరికి సెక్యూరిటీని ఇస్తుంది, బార్యా భర్తలకి, పిల్లలకి, ముసలి వారికి, అనారొగ్యం తో వున్న కుటుంబ సభ్యులకి ఇలా అందరికీ మన కుటుంబం ఒక మర్రిచెట్టులా ఆశ్రయం కల్పిస్తుంది. కానీ కొన్ని పాత పద్దతులు, ఎక్స్ పెక్టేషన్స్ వల్ల, కొన్ని అసమానతల వల్ల, స్త్రీ నుండి ఇంకా అప్పటి స్త్రీ లనుండి ఆశించే పద్దతులు, ప్రవర్తన, పనులు ఆశించటం వల్ల సమస్యలు వస్తున్నాయి. చట్టాలు కుటుంబం లో ఎంతవరకు జోక్యంచేసుకోగలవు? వేరే మార్గం లేదా?? ఈ అవసరం వుంది అనేదీ బహుసా చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ అంత ఆవశ్యకత వచ్చేవరకు, పూర్తిగా వ్యవస్థ నాశనం అయ్యేవరకు ఈ సంధి రోజుల్లో పుట్టిన మనమంతా ఈ బాధలు పడాలేమో. ఒక్క స్త్రీలే కాదు ఎందరో పురుషులు కూడా కుటుంబ బారం అంతా మొయ్యాల్సి రావటం వంటి నియమాలతో బాధపడుతున్నారు.కానీ మనది పిత్రుస్వామిక వ్యవస్థ కాబట్టి అప్పటి పద్ధతుల్లో(ఇప్పటికి కూడా) చాలా వరకు పురుషులకు అనుకూలంగా వున్నాయి. సమస్య జటిలం అయిన రోజున ఇద్దరు మార్పు కోరుకుంటారు అనిపిస్తుంది.

ఇదిలా వుంటే ఆఫీస్ కి వచ్చేసరికి ఒక శుభవార్త, నాకు బాలసహయోగ లో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ పొజిషన్ కన్ ఫర్మ్ అయిందని, హైదరాబాదు పోస్టింగ్ అని చెప్పారు. నా హస్బెండ్ కూడా హైదరాబాదు వస్తున్నారు ట్రాన్స్ ఫర్ మీద, నా తమ్ముడు అక్కడే వున్నాడు. సో ఇక నేను లక్కీ ఒంటరి వాళ్ళం కాదు. నాకు సిటీ లైఫ్ అంటే ఇష్టం లేక పోయినా అందరు వుంటారు, లక్కీ చదువు బాగుంటుంది అని వెళ్తున్నా. అదీ కాక ఈరోజు నా పుట్టిన రోజు. ఈ రోజు గడిచేలోగా ఎన్ని ఆలోచనలొస్తాయో, ఎన్ని అనుభూతులకు లోనుకావాలో. ఏంటో నా పుట్టినరోజు ప్రతీ సంవత్సరం ఇలాగే విపరీతమైన ఫీలింగ్స్ తో గడపాల్సి వస్తుంది.

Thursday, August 5, 2010

నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనిపిస్తుంది

ఫ్రెండ్ అంటే ఆడ అయినా, మగ అయినా ఒకటే కానీ..నాకేమో రంగురంగుల సీతాకోక చిలుకల్లా, గలగల సవ్వడిచేసే సెలయేటి లా, పైనుండి దూకే జలపాతంలా, సునామీ కెరటం లా,చిరుజల్లుతో తడిపేసే జడివానలా, పాలలా, తేనెలా, పువ్వులా, పసిపాప నవ్వులా, అమ్మ ఒడిలా, నాన్న చేతిలా, అమ్మమ్మ చెప్పే కధలా,తాతయ్య చెప్పే వింతలా, బాలీవుడ్ గాసిప్ లా, టాలీవుడ్ సినిమాలా, హాలీవుడ్ అద్భుతంలా, టీ.వి .సీరియల్ సస్పెన్స్ లా, సాయంకాలం లో కలిగే చెప్పలేని వేధనలా, ఉదయాన్నే కలిగే ఉత్సాహంలా, గెలుపులోని గర్వంలా, అలుపులోని నిద్రలా..... ప్రతి క్షణం కొత్త అనుభవం లా అనిపించే అమ్మాయిలన్నా,వారి స్నేహమన్నా చాలా ఇష్టం. ఉన్న స్నేహితులకి నాకు సమయం కుదరదు,దూరం. మళ్ళీ నాకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అనే కోరిక రోజు రోజు కీ పెరిగిపోతుంది. అసలు పేరుతోనే మొదలైపోతుంది అమ్మాయిల స్నేహంలో విభిన్నత. లత, కవిత, ,చిత్ర, మధు, మీర, సత్య, భామ, ,సువర్ణ, లేఖ, రాధ, నవీన, మిత్ర, బృంద, సునంద, పూర్ణ,శాంతి, వేద, ఇలా ఏ పేరు తీసుకున్నా ఒక కావ్యంలా వుంటుంది, ఒక స్నేహితురాలితో ప్రతిరోజూ కూడా ఒక పండగలా వుంటుంది.

అసలు అమ్మాయిల మధ్య  స్నేహం ఎంత బాగుంటుందో! నాకు ఇంటర్ వరకు చాల మంది అమ్మాయిలు ఫ్రెండ్స్ వున్నారు. ఆతరువాత డిగ్రీ నుండి ఎందుకో ఎప్పుడూ ఒంటిపిల్లి రాకాసి లా ఒక ఫ్రెండే దొరికేది. అవికూడా ఇక తప్పక చేసిన స్నెహాలో, కలిసి వెళ్ళడానికి రావడానికో అన్నట్లుండేవి. డిగ్రీ లో కవిత, నేను పి.జి గురించి కలలు కంటుంటే తను మ్యారేజీ కలలు కనేది. నేను జాబ్ ఎలా చెయ్యాలని మాట్లాడితే తను మొగుడిని ఎలా కంట్రొల్ లో పెట్టాలో మాట్లాడేది.కానీ అది కూడా బాగుండేది. పి.జి కొచ్చాక హాస్టల్లో రూం మేట్ శాంతి కాస్త నా టేస్ట్ కి తగిన అమ్మాయి. మేమిద్దరం కాస్త బాగానే ఎంజాయ్ చేశాము. కానీ తను ఎక్కువగా టీచర్ అవ్వాలని కష్టపడి చదువుతూ వుండేది. నేను కూడా విపరీతం గా చదివేదాన్ని కానీ ఒక గమ్యం లేకుండా ఏరోజు ఏది నచ్చితే, లైబ్రరీ లో ఆ సెక్షన్ కి వెళ్ళి చదివేదాన్ని. అలాంటి పిచ్చి పనులు నచ్చని గుడ్ గర్ల్ శాంతి. కేంపస్ లో మా క్లాస్ లో రోజూ వచ్చేవాళ్ళలో ఇద్దరే అమ్మాయిలు. నేను, ఇంకో బెంగాలీ అమ్మాయి రాఖీ ఘోష్. రాఖీ ఒక్కతే నాకు తెలిసిన బెంగాలీ అమ్మాయి. ఆమెకి కూడా పెళ్ళి కి ప్రెపేర్ అవ్వటమే జీవితం, పెళ్ళి తరువాత కి అవసరమైన వంటలు, ఇంటి పని, నగలు అంటూ ఎప్పుడూ అదే మాట్లాడేది. కానీ కవితకి, రాఖీ కి ఒక పెద్ద తేడా వుండేది.కవిత ఒక వ్యాపరస్థుడికో, సాధారణ ఉద్యోగస్థుడికో కావలసిన భార్యకి కావలసిన ప్రిపరేషన్ లో వుంటే, రాఖీ ఒక పెద్ద ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ లేదా పెద్ద పొజిషన్లో వుండే భర్త కోసం తగిన లక్షణాలు అంటే గెస్ట్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పార్టీస్ కి ఎలా రెడీ కావాలి ఇలా..అందరు బెంగాలీ అమ్మాయిలు ఇలాగే వుంటారా అని నాకు అనుమానం వచ్చేది. కానీ పి.జి లో డిగ్రీ లో ఎక్కువ బాయ్ ఫ్రెండ్సే వుండేవాళ్ళు(వేరే అర్ధం లో కాదు) ఎందుకంటే కాలేజిల్లో ఎక్కువగా వాళ్ళే వుండేవాళ్ళు మరి. ఆతరువాత అరుకులో పనిచేసేప్పుడు సరిత అని ఒక అకౌంట్స్ అమ్మాయి నేను మాత్రమే ఆఫీస్ లో . మిగిలిన టైం అంతా ఫీల్డ్ లో అరుకు లో ఒంటరిజీవితం, లేదంటే మా తమ్ముడు, వాడి ఫ్రెండ్సే నా ఫ్రెండ్సు. వాడు అప్పటికి ఇంకా ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి అమ్మాయిలంటే కాస్త దూరంగా వుండేవాడు. సో నో గర్ల్ ఫ్రెండ్స్.

ఇక వెలుగులోకి వచ్చాక దొరికారు గుంపులు గుంపులుగా అమ్మాయిలు. ట్రైనింగ్ టైములో, మీటింగ్స్ లో సందడే సందడి. అందులో మొదట చెప్పాల్సింది మాత్రం మాధురి గురించే.మొదటి రోజు టెస్ట్, ఇంటర్యూ అప్పుడు పరిచయం అయింది. గలగలా మాట్లాడేస్తుంది. నా ఫ్రెండ్ శ్రీను తను ఐ.టి.డి.ఎ లో పనిచేశారు కనుక శ్రీను పరిచయం చేశాడు. తరువాత మాధురి నాకు వరుసగా షాకులిచ్చింది.ట్రైనింగ్ లో మొదటిరోజు తనే నాకు ఎక్కువమందిని పరిచయం చేసింది. వీడు రాజా, మీవూరే,వీడు బసవరాజు ఒట్టి తింగరోడు, వీడు,వాడు, ఇది ,అది అని మధు చాలా మర్యాదగా మాట్లాడుతుంటే నేను నోరు వెళ్ళబెట్టుకొని వినేదాన్ని. అంతే కాదు మధు అందరిని వరసలు పెట్టి పిలిచేది. వరసలంటే అక్క, అన్న మాత్రం కాదు. అబ్బాయిలందరినీ "బావా" " మామ",అని పిలిచేది.అమ్మాయిల్ని కొందరిని వదిలేసినా కొందరిని భయంకరంగా "వదినా, మరదలా,పిన్నీ " అని పిలిచేది. నాకు మొదట్లో ఆశ్చర్యం వేసేది. అందరూ చేసేదానికి వ్యతిరేకంగా చెయ్యాలనో ఏమో మరి. అబ్బాయిలందరు హడలిపోయేవాళ్ళు. ఒరే బావా, ఏంటిరా నేను కనిపిస్తున్నా పలకరించకుండా వెల్ళ్ళిపోతున్నావు అని దొంగలా తప్పించుకోవాలని చూసిన వాళ్ళని కూడా పట్టుకొని మరీ పలకరించేది. మాట రౌడీ లా వున్నా మధు అంత మంచి మనసు ఎక్కడా దొరకదు. అందరిని నిజంగా తన మనుషులు అన్నంత ప్రేమ గా చూస్తుంది. పిలుపులోనే కాదు ఆ దగ్గరతనం. చూడడానికి ఒక అస్థిపంజరానికి డ్రెస్స్ వేసినట్లుండే మధు "బావా" అని పిలుస్తుంటే మా టీం అబ్బాయిలందరూ "మధు నువ్వు అలా పిలవకే బాబు, నేను ఆత్మ హత్య చేసుకుంటా" అని బెదిరిపోయేవాళ్ళు. ఒకరోజు మధు ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. అంతకు ముందు 2,3 సార్లు తనని చూశాను. ఒసే శిరి, వీడు రవి, నేను పెళ్ళిచేసుకోబోయేవాడు అని చెప్పింది. నేను తికమక గా చూసేంతలోనే "ఒరేయ్ రవి, ఇదిగో రా శిరీషా, శిరీషా అని కలవరిస్తున్నావు కదా పరిచయం చేసేసాను, ఇక మీరూ మీరూ చూసుకోండి" అని చెప్పింది. నాకు పై ప్రాణలు పైనే పోయాయి. ఏం చెప్తుంది ఈ అమ్మాయి? తన లవర్ అని చెప్తూ నన్ను కలవరిస్తున్నాడని చెప్తుందేంటి? అని పిచ్చిదానిలా చూస్తున్నా. పాపం నా పరిస్థితి అర్ధం అయినట్లుంది రవి కి(తరువాత మా స్నేహితుడైపోయాడు) "మీరేమీ ఖంగారు పడకండి, మధు అలాగే మాట్లాడుతుంది. మధు ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుండి నేను కూడ అప్పుడప్పుడు వచ్చి చూస్తున్న, మీరు తెలుగు, ఇంగ్లీష్ లలో బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు, మంచి అనాలసిస్ చేస్తున్నారు, అందరితో స్నేహం గా వుంటున్నారు, ముఖ్యంగా మధుకి పిచ్చగా నచ్చేశారు, మీ గురించె ఏక్కువగా చెప్తుంది, అందుకే పరిచయం చెయ్యమని 2,3 సార్లు అడిగాను అందుకే ఇలా చెప్తుంది"  అని వివరించాడు. హమ్మయ్య అనుకున్నాను. రవి, మధు ల పెళ్ళి మేమే చేశాము. వాళ్ళ ఇళ్ళల్లో ఒప్పుకోకపోవటం వల్ల. ఇప్పటికీ నాకున్న మంచి స్నేహితులు వాళ్ళిద్దరు(ఇప్పుడు ముగ్గురయ్యారు). మధు, నేను  కలిసి ఎవరినైనా ఎదిరించేవాళ్ళం. (ముఖ్యం గా మా పి.డి గారినే) మొట్ట మొదట మాకు ఒక యూనియన్ అవసరమని మేమిద్దరం మా వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టి మొదలు పెట్టాము. అది ఇప్పుడు చాలా పెద్దది అయింది. కానీ మేమిద్దరం అక్కడ లేము.మధు శ్రికాకుళం దగ్గరలో రణస్థలం మండలం లో చేసేది, నాకు చాలా దూరం. మానసికంగా చాలా దగ్గర.

వెలుగు ప్రాజెక్ట్ మొదటి సారిగా సామాజిక అభివృద్ధి అనేది కూడ ఒక ప్రొఫెషన్ చేసి అందరికీ పరిచయం చేశారు. అప్పటివరకు టి.ఐ.ఎస్.ఎస్ (టిస్)వంటి కొన్ని పెద్ద విద్యాసంస్థలు ఇలాంటి ప్రొఫెషనల్స్ ని తయారు చేస్తున్నా కూడా వారెక్కడ వున్నారో, ఏమి పనిచేస్తున్నారో కూడా తెలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్  అన్ని రాస్ట్రాల కంటే అభివృద్ధి కార్యక్రమాలలో బాగుందని మన ప్రాజెక్టు లు చూసి చెప్పొచ్చు. ఎన్నో రాస్ట్రాల నుండి ఇప్పుడు ఇక్కడికి నేర్చుకోడానికి వస్తున్నారు.వెలుగు మొదలైనప్పుడు మా ట్రైనింగ్ కొ-ఆర్డినేటర్ షీబ కూడ టిస్ ప్రొడక్ట్ కావటం వల్ల,మేమంతా లోకల్ కావటం వల్ల కొందరు టిస్ లో చదువుకున్న సోషల్ వర్క్ ప్రొఫెషనల్స్ ని మాతో పాటు తీసుకుంటే వారి నుండి కూడ మేము నేర్చుకోవచ్చనే వుద్ధేశ్యంతో మా పి.డి గారు కూడ కేంపస్ ఇంటర్యూలు చేసి టిస్ నుండి,ఐ.ఆర్.ఎం.ఎ(ఇర్మా) నుండి, అగ్రికల్చర్ కాలేజీలనుండి, ఇంజనీరింగ్ కాలేజీలనుండి మొత్తానికి ఒక 20 మంది ని 2 వ బ్యాచ్ లో తీసుకున్నారు. అందులో వచ్చిన వాళ్ళలో టిస్ వాళ్ళు కొన్నాళ్ళు వున్నారు. మిగిలిన వాళ్ళు చాలా కారణాల వల్ల 90% మంది వెళ్ళిపోయారు.

వచ్చిన వాళ్ళల్లో ఈ టిస్ వాళ్ళు వింతగా కనిపించేవాళ్ళు. మా దేశవాళీ ఆవుల మందలో జెర్సీ ఆవుల్లా అన్నమాట. ఇక అప్పటితో నాకు ఎక్స్ ట్రా డ్యూటీ పడింది. వాళ్ళకి ట్రైనింగ్ లో వాళ్ళకోసం మా వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ లో తిరిగి చెప్పటం. ఇలా వచ్చిన 20 మంది లో ముఖ్యంగా చెప్పుకో వలసిన వాళ్ళు 4 మందే. వాళ్ళే కొంత ప్రభావం చూపి వెళ్ళిపోయారు. వారిలో చిత్ర రామస్వామి, శోభా రాఘవన్, సిసీలియా, ఇకో అబ్బాయి(నాకు పేరు గుర్తులేదు). ఆ అబ్బాయి చాల తక్కువ రోజులు వున్నాడు. తను ఒక విజువల్ ఇంపైర్డ్(కళ్ళు కనబడవు చిన్నప్పటినుండి).నేను మొదటి సారి అటువంటి వ్యక్తితో మాట్లాడటం. తను చాలా తెలివైన వాడు. కళ్లు లేకపోవటం వల్ల అనుకుంటా మిగిలిన విషయాలలో చాలా షార్ప్ గా వుడేవాడు. మా శబ్ధం, వాసన పసిగట్టి చెప్పేవాడు ఎవరు వచ్చింది అని. కానీ 2 వారాలు కూడా వుండలేకపోయాడు.

ఇక శోభ, విపరీతమైన మొండి ఘటం. తను నమ్మేదానికోసం ఎవరితో అయినా పోట్లాడేది. సీతంపేట ఏజెన్సీ లో ఎవరూ తిరగనన్ని గ్రామాలు ఒంటరిగా తిరిగింది. తిండి, నిద్ర,స్నానం లాంటి అవసరాలు కూడా పట్టించుకోకుండా పనిచేయగలిగే ప్రొఫెషనలిజం. కానీ సర్దుకుకుని పోవటం, పెద్ద ప్రాజెక్టులో పనిచేసేప్పుడు ఎక్కువమంది ప్రయోజనం కోసం కొందరిని విస్మరించాల్సి రావటం తను సర్దుకోలేకపోయింది. అందుకని ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. తనని జాబ్ లోనుండి తీసేసారు. కానీ తను వస్తాను అని చెప్పిన గ్రామాలన్నీ,చేస్తాను అన్న పనులన్నీ పూర్తి అయిన వరకు జీతం రాకపోయిన, ప్రాజెక్టులో వెలివేసినా పని పూర్తి చేసి వెళ్ళింది.తనని చూసి ఎందరో అబ్బాయిలు ఫీల్డు కి వెళ్ళటం నేర్చుకున్నారు. చెప్పిన మాట పై నిలబడటం...నాకెంతో నచ్చింది.మా టీంలో వున్న రెడ్డీ, శోభా ని కొన్నాళ్ళు సీతంపేట వేశారు. రెడ్డీ తో పాటు మాదగ్గరకి తన ఫ్రెండ్ చిత్రకోసం ఎక్కువగా వస్తుండేది.అలా శోభ కూడా నాకు ఫ్రెండ్ అయ్యింది.సీతంపేట ఐ.టి.డి.ఎ శోభ అంటే అందరికి ఒక వింత, కొందరికి అద్భుతం, కొందరికి భయం.

మా వజ్రపుకొత్తూరు టీం లో నేను ఒక్కదానినే అమ్మాయిని, ఒక సంవత్సరం పాటు అబ్బాయిలతో స్నేహాం బోర్ కొట్టేసిన సమయంలో చిత్ర వచ్చింది. సన్నగా పొడుగ్గా టిస్ టీం లో కాస్త అమ్మాయిలా అనిపించే ఫిగర్(మా టీం అబ్బాయిల మాటల్లో చెప్పాలంటే).చిత్రకి వాళ్ళ అమ్మా నాన్న కంటే శోభ అంటే ప్రాణం. శోభని జాబ్ లోనుండి తీసేస్తె చిత్ర కూడా వెళ్ళిపోయింది. నాకు ఎంతో లోటు చేసి వెళ్ళిపోయింది. చెప్పాలంటే మేమిద్దరం పెద్ద గొప్ప స్నేహితులమా అంటే కాదు.కానీ మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా వున్నాము. తను కేరళ అమ్మాయి. వచ్చీ రాని తెలుగుతో, అబ్బాయిలాంటి గొంతుతో, విపరీతమైన ఎనర్జీతో వుండేది. చిత్ర అప్పుడప్పుడు కొబ్బరినూనె తో వాళ్ళ వంటలు చేసేది. తన ఎదురుగా తిని పక్కకెళ్ళి ఊసేసేవాళ్ళం. చిత్ర కి ప్రతీ విషయంలో చాలా క్లారిటీ వుండేది.అలా అని మొండి కాదు. చాలా ఓపెన్ మైండ్. అందరి ఆలోచనలు అభిప్రాయాలు విని ఎంకరేజ్ చేసేది.నాకు మాత్రం ఎన్నాళ్ళ లోటో తీర్చడానికే చిత్ర వచ్చినట్లనిపించింది.నేను తనకోసం ఇంగ్లీష్ మాట్లాడినా మొదటి రోజే చెప్పేసింది తెలుగు లోనే మాట్లాడు, నేను నేర్చుకోవాలి అని. కొన్ని రోజులకే బాగా నేర్చేసుకుంది. తనతో వచ్చిన వాళ్ళెవరికీ రాలేదు కానీ చిత్రకి వచ్చేసింది.అప్పటివరకు నేను చాల విషయాల్లో ఎవరో ఏదో చెప్పిన వాటినే నిజమని అభిప్రాయాలు ఏర్పర్చుకునే దాన్ని. కానీ చిత్ర స్వంతంగా తెలుసుకునే వరకు ఏ అభిప్రాయం చెప్పేది కాదు. తన అభిప్రాయం అందరికీ నచ్చనిది అయినా చెప్పేది. ఏ పనికి కూడా ఎవరి మీదా ఆధార పడేది కాదు. నేను ఒక బకెట్ నీళ్ళు మొయ్యాలంటే, పెద్ద బరువు మొయ్యాలంటే, దూరం వెళ్ళాలంటే అబ్బాయిల మీద ఆధారపడేదాన్ని. చిత్రకి కూడా ఆపనులు కష్టమే అయినా వేరే విధంగా చెయ్యాలని చూసేది కాని ఎవరి మీదా ఆధార పడేది కాదు. పూర్తిగా బకెట్ మొయ్యలేకపోతే నాలుగుసార్లు కొంచెం కొంచెం మోసేది. భాష రాకపోయినా ఒక్కతీ ఎంత దూరమైనా వెళ్ళేది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేసేప్పుడు నేను టాయిలెట్ కి వెళ్ళాల్సిన అవసరం వున్నా కంట్రోల్ చేసుకొని బాధపడుతుండేదాన్ని. చిత్ర సిగ్గు పడకుండా అందరికీ చెప్పి మరీ వెళ్ళేది. ఇలా ఎన్నో. ఎన్నో భయాలు, సిగ్గులు, మొహమాటాలు, కన్ ఫ్యూజన్ పోగొట్టింది మా అందరిలో. తనకి బైక్ నడపటం వచ్చినా, నాకు రాదని తెలిసినా నా బైక్ మీద ధైర్యంగా వెనక కూర్చొని వచ్చేది. ఎప్పుడూ కూడా నేను నడుపుతా అని నన్ను కించపరిచేది కాదు. (చాలా మంది అబ్బాయిలు మాత్రం ఇది తప్పక చేస్తారు - రకరకాల కారణాలతో). మేమిద్దరం అక్కడి నిర్మానుష్యంగా వుండే సముద్రపు ఒడ్డు చూసుకొని వెళ్ళేవాళ్ళం. వజ్రపుకొత్తూరు మండలంలో కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుండేవి. వాటి మీదనుండి కిందకి దొర్లుతూ ఇసుక పోసుకుని అల్లరి చేసేవాళ్ళం. జాలరి వాళ్ళు "ఐల వల"లాగుతుంటే(చాలా పెద్ద వల , చిన్న చిన్న రంధ్రాలతో మొత్తం సముద్రంలో చేప గుడ్లతో సహా వచ్చేస్తాయి అందుకే గవర్నమెంట్ దానిని బ్యాన్ చేసింది. కానీ ఐల వల ఊరికి ఒకటి వుంటే ఆ ఊరికే గొప్ప గా భావిస్తారు, ఐల వల ఉదయం గాని, అర్ధరాత్రి కానీ కొందరు వెళ్ళి వేసి వచ్చేస్తారు. తరువాత వేకువన లేదా మధ్యానానికి ఊర్లో వున్న ఆడ,మగ, పిల్ల ముసలీ అందరూ కలిపి ఆ వలని లాగుతారు), నేను చిత్ర కూడా వాళ్ళతో పాటు వల లాగే వాళ్ళం.ఉదయాన్నే చెంబు పట్టుకొని జీడితోటలోకి వెళ్ళటంతో మొదలుపెట్టే వాళ్ళం కబుర్లు, ఫీల్డ్ కెల్తూ, తిరిగివస్తూ, దారిలో ఎదో ఒక తోటలో ఆగిపోయి, రాత్రి డాబా మీదకెళ్ళి, నిద్రపోతూ కూడా ముగిసేవి కాదు. చిత్ర డిగ్రీ షూ(పాదరక్షలు) మేకింగ్ కోర్స్ చేసింది, ఇంటర్  బిట్స్ పిలానీ, పి.జి సోషల్ వర్క్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా చదివింది(నాలాగే).కేరళ లో పుట్టి పెరిగి,ముంబైలో చదివి వచ్చిన చిత్ర జీవితం నాకు వింతగా వుంటే, చిన్న టౌన్లో పుట్టి, ఏదో చదివి, ఏదో చేస్తున్న నా జీవితం చిత్రకి వింత.తను వున్నన్ని రోజులూ ఎప్పుడూ ఉత్సాహంగా పరిగెత్తే వాళ్ళం.గట్టిగా నవ్వే వాళ్ళం, కోడి ని వెంటపడి పరిగెత్తి పట్టుకుని తెచ్చి గూట్లో పెట్టే వాళ్ళం, అదిపెట్టిన గుడ్లన్నీ పొదిగించి పిల్లలు అయితే మురిసిపోయాము, పొదుగుతున్న పెట్టని మహరాణిలా చూసుకున్నాము,కోడిపిల్ల చనిపోతే కూర్చొని ఏద్చాము...మా ఇద్దరికీ ఆరోజులు మాళ్ళీ వస్తాయా?

ఆ తరువాత నాకు మళ్లీ ఇంతవరకు స్నేహితులే లేరు. తరువాత ఏలూరు లో మేనేజీరియల్ పొజిషన్ కి వచ్చేసా.ఇక ఆ స్తేజ్ కి వచ్చాక స్నేహితులు దొరకటం కష్టమేమో!ఎక్కువగా ఈ పొజిషన్స్ లో మగవారుంటారు. ఒక వేళ ఆదవాళ్లున్న పెళ్లి అయి పిల్లలు, ఇల్లు ,ఆఫీసు పని తో సతమతమవుతుంటారు. నోరు తెరిస్తే మా ఆయన, మా అత్తగారు, మా తోడికోడలు, మా పాప, మా బాబు ఇవే మాట్లాడతాము. నేను కూడా అంతే. స్నేహానికి సమయం, మనసు, ఓపిక వుండదు. మగవారితో స్నేహాలు కుదిరే అవకాశం వుంటుంది కానీ ఏమో ఎందుకో కుదరదు.కొంత వ్యక్తిత్వం ఏర్పడిపోయాక అనుబంధాలు,బంధాలు అంత సులభంగా ఏర్పడవు అనిపిస్తుంది నాకు.ఏలూరులో హాస్టల్లో వుండేదాన్ని, ఆ హాస్టల్లో నేను ముగ్గురం జాబ్ హోల్డర్స్ మిగిలినవారంతా కాలేజీ అమ్మాయిలు.అక్కడ కూడా పెద్దగా స్నేహం కుదరలేదు. ఆతరువాత మళ్ళీ కేర్ లో జాయిన అయ్యాను.ఇక్కడ మా నెల్లూరు ఆఫీసులో నేనొక్కదాన్నే మిగిలిన స్టాఫ్ అందరు మగవాళ్ళే.ఎప్పుడైన స్టేట్ ఆఫీసుకి వెళ్తే అప్పుడు మాత్రం మీరా, సత్యభామ కాస్త మాట్లాడే అవకాసం, హొటెల్ రూములో కలిసి గడిపే అవకాశం వుంటుంది.నాకు ఒక అనుమానం స్నేహం అంటే మనం అనుకుని చేస్తామా? లేక అదే అవుతుందా? పువ్వుతో పాటు పరిమమళం లా, జాబిలితో పాటు వెన్నెల లా, సహచర్యంతో పాటు వచ్చేదే స్నేహం అని నా అభిప్రాయం. మనం వున్నంత కాలం ఆ స్నెహ పరిమళం, చల్లని వెన్నెల లా మనకి సేద తీరుస్తుంది.

"అందరికి స్నేహితులరోజు శుభాకాంక్షలు" (నా స్నేహితులు పంపిన ఎస్.ఎం.స్.లు లేట్ గా చూస్తూ వారందరిని గుర్తుచేసుకొని ఈ పోస్ట్ వ్రాస్తున్నా,ఇది నా స్నేహితులందరికీ అంకితం)

Friday, July 30, 2010

అది ఒప్పా( ఉప్పా)తప్పా ???

హాయ్ ... ఇప్పుడు టైము 9.25 రాత్రి. ఇంకా ఆఫీస్ లో వున్నాను. ఇప్పుడే కాస్త ఈరోజు పని అయింది కానీ వెల్దామంటే వర్షం పడుతుంది. ఇంటికెళ్ళాలని ఇక అనిపించటం లేదు. లక్కీ ఆల్రెడీ ఇంటికొచ్చి అమ్మా ఎప్పుడొస్తున్నావు అని 6 సార్లు ఫోన్ చేసీ చేసీ నిద్రపోయాడు. ఇప్పుడే చిన్నమ్మ( మా ఇంట్లో వుంటుంది మాకు తోడుగా) ఫోన్ చేసి చెప్పింది లక్కీ నిద్రపోయాడు అని. ఇంకా ఎన్ని రోజులు ఇలా బిజీ గా వుంటానో అర్ధం కావటం లేదు. సునామీ వచ్చిన తరువాత ప్రాజెక్ట్ మొదలు పెట్టిన మొదట్లో ఇలాగే వుండేది. ఆ తరువాత ప్రతీ తుఫాను సమయంలో వరదల సమయంలో, ఆడిట్ సమయం లో, ముఖ్యమైన మీటింగ్స్ కి బిజీ గా వున్నా మరీ ఇన్ని రోజులు కాదు.

సరే ప్రపంచం లో అందరూ బిజీ నే, నీ గొప్పేంటి అనుకుంటున్నారా! ఏమీ లేదు. నా బ్లాగు కాబట్టి నా సోదే కదా రాసేది.

ఇంతవరకు ఇన్స్యూరెన్సు కంపెనీ వాళ్ళతో మీటింగు అయ్యింది. మనసంతా చికాకైపోయింది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఉప్పు రైతుల కోసం ఒక ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ ఫెసిలిటేట్ చేసి పైలట్ చేసాము. అది ఒప్పా తప్పా అని అర్ధం కావటం లేదు. లైలా వచ్చి ఉప్పు రైతులు చాలా నష్టపోయారు. కానీ ఇన్స్యూరెన్స్ వాళ్ళు కనీసం ప్రీమియం కట్టిన దానికంటే కూడా తక్కువ క్లెయిం ఇస్తున్నారు. అదేమి అంటే మేము పలానా క్లాజు ప్రకారం  ఇలాగే అని చెప్తున్నారు. ఈ ఇన్స్యూరెన్సు, అందులో మైక్రో ఇన్స్యూరెన్సు ఏమీ  అర్ధం కాదు, కేవలం కంపెనీ వాళ్ళకే ఎప్పుడూ అనుకూలంగా వుంటాయి. ఇక రైతుల వైపు చూస్తే పోయిన సారి వేసవి కాలం ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ ఉత్పత్తి వచ్చేసి రేటు పడిపోయిందని పోయిన ఏడాది  సరుకు కూడా ఇంకా స్టాకు పెట్టారు. దాని వల్ల పెట్టుబడికి డబ్బులేక ఈసారి ఎక్కువ అప్పుచేసారు, తీరా లైలా కరెక్ట్ టైములో వచ్చి స్టాండింగ్ క్రాప్ తో పాటు రెండు సంవత్సరాల నిల్వ ఉప్పు కూడా తీసుకు పోయింది. ఉప్పు రైతు సరుకు లేక, పండించాలంటే ఎండలేక, అప్పులతో మిగిలిపోయాడు.

వ్యవసాయం చేసే వాళ్ళకి గవర్నమెంటు ఎన్నో సబ్సిడీలనీ, ఋణాలనీ చాలా చేస్తుంది. కానీ తెల్లారి లేస్తే ఎందులో ఉప్పులేక పోయినా బతకలేని మనకి అసలు ఆ ఉప్పు పండించే ఒక రైతు వుంటాడనీ కూడా గుర్తులేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు "ఉప్పు పండిస్తారా, టాటా వాళ్ళు ఫేక్టరీ లో కదా తయారు చేస్తారు" అని అడిగారంటే ఉప్పు రైతుల పరిస్తితి ఎంత దారుణమో ఊహించండి. ఉప్పు వ్యవసాయం కిందకి రాదు, పరిశ్రమల విభాగం కింద వస్తుంది అంటే మామూలు రైతుకి కరెంటు కి సబ్సిడీ రేటైతే ఉప్పు రైతుకి పరిశ్రమల రేటు, అదీకాక వుప్పు పండించే భూములన్నీ  సెంట్రల్ గవర్నమెంటు ఆధీనంలో వున్నాయి వాళ్ళు ఎవరో పెద్ద కౌలుదారులకి ఆ భూమి వందల ఎకరాల్లో కౌలుకి ఇచ్చారు, ఇంకా ఆ లీజు వందల సంవత్సరాలుగా వాళ్ళకే వంశపారంపర్యంగా వస్తుంది. కానీ నిజానికి వాళ్ళెవరికి కనీసం ఉప్పు పంట ఎలా వుంటుందో కూడా తెలీదు. వాళ్ళు చిన్న చిన్న ఉప్పు రైతులకి తిరిగి ప్రతీ సంవత్సరం లీజుకి ఇస్తున్నారు. ఇలా తరాలుగా జరుగుతుంది కానీ ఏ ఉప్పు రైతు కూడా భూస్వామి కాలేకపోతున్నాడు.

కేవలం వేసవి కాలంలో ఉప్పు పండుతుంది, కళ్ళు మిరిమిట్లు గొలిపే మండుటెండలో ఉప్పు పండించాలి. కను చూపు మేరలో ఎక్కడా చిన్న నీడ కూడా వుండదు. చూట్టూ నీరున్న ఎక్కడా తాగడానికి మంచి నీరు దొరకదు.ఊరికి దూరంగా వుంటాయి ఉప్పు పొలాలు. ఆ ఉప్పు నీరు, అధిక వేడీ...కోసుకునే ఉప్పు, చర్మం, కళ్ళు దెబ్బతింటున్న కేవలం కొద్ది కాలమే పండే పంట కనుకా, ఆ తరువాత ఇక ఆ భూమి ఎందుకూ పనికి రాదు కనుక కుటుంబం అందరూ పిల్లా పెద్ద ఆడా మగా ఆ 4 నెలలు అదే పని చేస్తారు. ఇంత చేసినా కూడా ధర ఎలా వుంటుందో తెలీదు, వాన ఎప్పుడొచ్చి ముంచేస్తుందో తెలీదు, సూర్యుడు అలిగి మేఘాల మాటున దాగున్న కూడా సరైన సెలినిటీ రాక ఉప్పు పండదు, కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు భూమి లో నుండి నీరు మోటర్ల ద్వారా పైకి తీస్తారు, ఆ మోటరు ఎప్పుడు పాడైపోతుందో, గుజరాత్ లో ఎక్కువ పండేస్తే ఇక్కడ రేటు పడిపోతుందో....ఇలా ఎన్నో సమస్యలు అన్నీ చెప్పలంటే నాకు 5 సంవత్సరాలు సరిపోదు ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలుగా వింటున్నాను, చూస్తున్నాను ఎంత చేసినా తరగని పని వుంది కానీ అందుకు సరిపడా నిధులు, టెక్నాలజీ, అధికార సహకారం, పాలసీలు ఏవీ లేవు. వెళ్ళిపోయే ముందు వాళ్ళకి లైలా మిగిల్చిన విషాదం లో వదిలి వెళ్ళిపోతున్నము అని బాధగా వుంది.ఉప్పు కోసం ప్రత్యేకంగా ఎవరైనా పనిచేస్తే బాగుండు అనిపిస్తుంది.వర్షం పడుతుంటే చూసి ఆనందించాలో ఉప్పు రైతులు గుర్తొచ్చి బాధపడాలో తెలియదు.

ఇక నా పర్సనల్ విషయాలకి వస్తే ఒకే ఒక ఇంటర్యూకి వెళ్ళగలిగాను,టైము కుదరక. అది కూడా బాలసహయోగ ప్రాజెక్ట్, కేర్-ఇండియా ప్రాజెక్టే.హెచ్.ఐ.వి కుటుంబాలకు అందులో ముఖ్యంగా పిల్లలకు ఆదాయ మార్గాలు చూపించే ప్రోగ్రాము. ఇంటర్యూ బాగానే చేసాననిపించింది. ఒక వారంలో చెప్తాము అన్నారు. అది కూడా హైదరాబాదా, కడపా అనేది తెలీదు. 1975 మోడల్ మహీంద్రా జీపు ఇస్తారు కానీ డ్రైవర్ ఇవ్వరంట ఒక వేళ ఆ జాబ్ వస్తే ఇప్పుడు అర్జెంటుగా జీపు తోలడం(?) నేర్చుకోవాలి కాబోలు. ఎందుకైనా మంచిది పనిలో పని బస్సు, ట్రైను, విమానం ఇవన్నీ తోలడం కూడా నేర్చేసుకుంటే ఒక పనైపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైతే అది వాడేసుకోవచ్చు ఏమంటారు??? సరే ఏదో ఒకటి అనండి నేను మాత్రం ఇంటికెళ్ళాలి, వర్షం తగ్గింది ఇంకా ఆకలేస్తుంది. మళ్ళీ కలుస్తా త్వరలో ఏదో ఒక వార్త తో. బై బై.

Friday, July 23, 2010

బిజీ బిజీ బిజీ....

బిజీ బిజీ బిజీ, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు ఊడిపోయే ఉద్యోగానికి పనెక్కువయ్యింది. మా సునామీ ప్రాజెక్టు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సెప్టెంబర్ తో ప్రాజెక్ట్ క్లోజ్ చెయ్యాలి. అందుకని ఫార్మాలిటీస్ ఇవాల్యుఏషన్లు అని రకరకాల పనులతో బిజీగా తిరుగుతున్న, పోస్ట్ రాసే మూడ్ కూడా లేదు.5 ఏళ్ళ క్రితం వచ్చాను ఈ నెల్లూరికి. ఇంకో 3 నెలల్లో వెళ్ళిపోతాను. తరువాతి మజిలీ ఎక్కడికో తెలీదు.

రాత్రి 9, అయి వుంటుంది. చెన్నై లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి నేను, షాహిద్, సుద్దర్శన్ ఇంక సుధర్శన్ ఫామిలీ కలిసి బొలెరో లో వచ్చాము.రావటమే డి.ఆర్.ఉత్తమ హొటెల్ కి వెళ్ళాము. ఇక్కడ వున్న స్టార్ హొటెల్. నేను మొదటిసారి హొటెల్ లో ఒక్కదాన్నే వుండాల్సిన పరిస్థితి. ఎప్పుడైన మా ఫ్యామిలీ తో వెల్తే వైజాగ్ లో అందరం కలిసి ఒకే రూం లో వుండేవాళ్ళం. నాకు భయం అనిపించింది అందుకని సుదర్శన్ గారికి(నేను రిపోర్ట్ చేసేది అతనికే) నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వుంటానండి అని చెప్పి వెళ్ళి నా వెలుగు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వుంటే వెళ్ళాను. ఎన్నో గ్రామాలలో కనీస సదుపాయాలు కూడా లేని ఇంట్లో వుండగలిగాను కానీ ఈ నెల్లూరు వేడికి వాళ్ళ ఇంట్లో పడుకోవటం నా వల్ల కాలేదు. హాయిగా ఎ.సి రూం ఇస్తుంటే నేను ఇక్కడ నిద్రలేని రాత్రులు గడపలా?అని ఆలోచించి మరుసటిరోజు బుద్ధ్హిగా హొటెల్ కి షిఫ్ట్ అయిపొయా. నెల్లూరు వేడి ఆ మజాకా? అప్పటినుండి ఇప్పటి వరకు నెల్లూరు శిరీష అయిపోయాను. ఎందుకంటే వెలుగు శిరీష ని కాదు కదా.అంతే కాదు లక్కీ పుట్టడం నేను ఇక్కడికి రావటం. వాడిని ఎవరైన మీది ఏ వూరు అంటే నెల్లూరు అని చెప్తాడు. అలాంటి నెల్లూరు వదిలి వెళ్ళిపోవాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెద్ద మెట్రొ సిటీ రేంజి లో వున్నా, ఇంటి అద్దెలు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా వున్నా, సంవత్సరం పొడుగునా వేసవికాలం, వేడి, చెమటలు తో విసుగొచ్చినా...నెల్లూరు అలవాటైపోయింది. అందుకే వదిలి వెళ్ళాలంటే కాస్తా దిగులొస్తుంది.

కేర్ ఇండియా లో కూడా కొన్ని పొజిషన్స్ తీస్తున్నారు. ఊటీ లో టీ ప్లేంటేషన్ వర్కర్స్ కోసం పనిచేసే ప్రాజెక్టు, ఒరిస్సా లో హెల్త్ ప్రాజెక్టు, బీహార్ లో కూడా హెల్త్ ప్రాజెక్టు ఇలా ఎక్కడెక్కడో వున్నాయి. నాకు మాత్రం హెచ్.ఐ.వి. ఐడ్స్ తో బాధపడుతున్నవారికోసం పనిచెయ్యాలని వుంది. అంత ఈజీ కాదు కదా లక్కీ ని తీసుకొని తెలియని బాష ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వుండటం. లక్కీ వాళ్ళ డాడీ వచ్చినా ఇక అంత దూరం అంటే చుట్టం లా వచ్చి వెళ్ళాల్సిందే.నా వుద్యోగం ఏమైన స్కూల్ టీచరా హాయిగా 10-4 చేసి ఇంటికి వచ్చేయడానికి. కేంపులు వుంటాయి అక్కడ లక్కీ ని చూసుకోవడానికి తెలుగు తెలిసిన మనిషి దొరికినా కూడా ప్రాక్టికల్ గా ఎన్నో సమస్యలుంటాయి. పిల్లలే అన్ని పరిస్థితులకు త్వరగా సర్దుకుపోతారు అంటున్నారు. కానీ నా భయాలు నాకుంటాయి కదా. ఈ భయాలతో నన్ను నేను చూసుకుంటుంటే అసలు నేను ముందు శిరీష నా కాదా అని అనుమానం వస్తుంది. నా భయాలన్నీ అపోహలేనేమో!అన్ని పరిస్థితుల్లో చక్కగా సర్దుకుపోగలమేమో? ఈ అనుమానాలతో, విపరీతంగా తిరగటం వల్ల నాకు నిద్ర ఎక్కువగా పట్టేస్తుంది. ఏంటి ఆశ్చర్యంగా వుందా! నాకు అంతే ఎప్పుడైన టెన్షన్, దిగులు, బాధ ఇలాంటివి ఏమైన వుంటే విపరీతంగా నిద్రపోతుంటాను. అసలు జీవితంలో 24 గంటల్లో 20 గంటలు నిద్రపోతుంటే ఎంత హాయిగా వుంటుందో కదా. ఇక మిగిలిన 4 గంటలు స్నానం చేసి, ఇల్లు క్లీన్ చేసుకొని, ఊరికే బాగా ఎండా గాలి పీల్చుకుంటే సరిపోయేలా ఎందుకు పెట్టలేదో దేవుడు. అసలు ఆకలి అనేదే లేకపోతే, పొట్ట భాగం లేకపోతే,అన్నం, పప్పు, కూర, సాంబార్ అని ఇన్ని రకాలు తినాల్సిన పని లేకపోతే ఎలా వుండేవాళ్ళం. ఎవరికీ ఉద్యోగాలు అక్ఖర్లేదు, పని కూడా అవసరం లేదు. ఏడ్చినట్లుంది అలా వుంటే లోకం అసలు బాగుండదు. నీ బోడి వుద్యోగం కోసం ఇంత అందమైన లోకం తీరు మార్చేస్తావా అని తిడుతున్నరా? నిజమే ఆకలి వుండాలి, పని వుండాలి, పరుగులుండాలి, తపన వుండాలి, అసంతృప్తి వుండాలి, దానికోసం మనిషి ఎప్పుడూ ఏదో అన్వేషిస్తూ వుండాలి, అప్పుడే జీవం వున్నట్లుంటుంది.

సో, నాలో జీవం వున్నవరకు నేనూ పరిగెడతా, నేనూ ఏదో ఒక పని చేస్తా, జీవన ప్రవాహం లో అడ్డంకులు, ఆటు పోట్లు తప్పవు అవి వుంటేనే అందం కద. అంత పెద్ద డైలాగులు అవసరం లేదు కానీ ఈ హడావిడిలో, అలోచనలలో బ్లాగులు రాసే మూడ్ రావటం లేదు. మళ్ళీ ఎప్పుడు రాయగలనో తెలీదు. అంతవరకు నా పెద్ద పెద్ద పోస్ట్లు అప్పుడప్పుడు చదవి నన్ను గుర్తు పెట్టుకోండి సరేనా?

Monday, July 12, 2010

రావణ్ (విలన్) - ఇది సినిమా కాదు(2 వ భాగం)

(నేను చేసిన పని చాలా మందికి నా మీద మంచి అభిప్రాయం కలిగించకపోవచ్చు, కానీ నేను పెద్ద ఆశయాలు లేని ఎన్నో భయాలు,స్వార్ధాలు వున్న మామూలు మనిషిని అని అర్ధం చేసుకొని చదవగలరు)

..............................................................

అతను నన్ను చూస్తున్నారు రెప్ప వేయకుండా, అతని వయసు ఇంత అని చెప్పడానికి కష్టం, శరీరం చాలా బక్కగా వుంది.కాళ్ళు చేతులూ మరీ మొద్దుబారినట్లున్నాయి,ఇక నేనే ఏదో మాట్లాడాలని "యాదమ్మా..అని మొదలుపెట్టాను.అతను "ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అని అడిగారు నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది, కానీ అతను మళ్ళీ అదే ప్రశ్న వేశారు. నేను ఏదో చేసుకుపోతున్నాను కాని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని ఎవరైనా సడన్ గా అడిగితే ఏమి చెప్పాలి. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అన్నాను. ఇతనేదో చాలా సీరియస్ ప్రశ్నలు వెయ్యాలనే డిసైడ్ అయ్యాడని అర్ధం అయింది. మమ్మల్ని ఎందరో మా ఉద్యోగం గురించి, మా గురించి ప్రశ్నలు వేస్తారు. కొత్త గ్రామం వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా అడుగుతారు. అందులోను ఒక అబ్బాయి అమ్మాయి గనుక వెళ్ళామంటే అతను నీకేమవుతాడు?, ఈమె నీకేమవుతుంది అని కూడా అడుగుతారు, ఈ జాబ్ కి ఎంత లంచం ఇచ్చారు? గవర్నమెంట్ జాబేనా?ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు. అలాగే ఇది కూడా అనుకున్నాను. ఇప్పటికీ అతను మాట్లాడిన ప్రతీ మాటా గుర్తుంది అతని గొంతులో తీక్షణత్వం, మాటల్లో తెలివి,సమాచారం ఇలాంటివి అంతకు ముందెప్పుడూ నాకు ఎదురుకాని ఒక ప్రత్యేకత ఏదో!!(కానీ నిజంగా కొన్ని మాటలు అర్ధం కాలేదు,అందుకే అర్ధం అయిన మాటలు రాస్తున్నాను)

అతను: నచ్చిందా, ఏంటి నచ్చింది?రాత్రి పూట ఒంటరిగా చీకటిలో వెళ్ళి రావటం నచ్చిందా?
నేను: మీకు నేను తెలుసా?నేను రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నానని ఎలా తెలుసు?
అతను: నీకేమి నచ్చింది?కష్టంగా లేదా?ఇది అంత మంచి ఏరియా కాదు
నేను:భయపెడుతున్నారా? నాకు ఇంతవరకు ఇక్కడ భయపడాల్సిన ఎటువంటి సమస్యా రాలేదు. ఏమో వస్తే అప్పుడు మానేస్తానేమో
అతను: గవర్నమెంట్ జాబే కదా రిపోర్ట్ రాస్తే సరిపోదా మీటింగ్ కి వెళ్ళాను అని ఎందుకని నిజంగా వెళ్ళటం?
నేను: నాకు అలా నచ్చదు, రిపోర్ట్ రాయగలను కానీ నా మనసే ఒప్పుకోదు. అయినా గవర్నమెంట్ లో ఎవరూ పని చెయ్యరని చెప్పలేము కదా.
అతను: ఏమి చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ కి చిత్త శుద్ధి లేదు. ఎవరికీ ఏమీ చెయ్యలేదు.మీ ప్రాజెక్ట్ అయినా అంతే.
నేను:(నాకు చాలా కోపం వచ్చేసింది) అందరూ ఎందుకు గవర్నమెంట్, గవర్నమెంట్ అని ఎవరినో తిట్టడం, ముందు మనకోసం మనం ఏమి చేసుకుంటున్నాము? వెలుగు ప్రాజెక్ట్ తాలూక ముఖ్యమైన వుద్ధేశ్యం కూడా ప్రజలు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ వుండకుండా అందరు కలిసి వారి కోసం వారు ఏమి చెయ్యగలరో ముందు చేసుకునేలా చెయ్యటమే. ఇంత మంచి ప్రాజెక్టు, ఆలోచన గవర్నమెంటుదే కదా! ఎన్.జి.ఓ లు, లేదా వేరే ఎవరైనా సరే గవర్నమెంట్ చెయ్యగలిగేంత మందికి, అన్ని రకాల పనులు చెయ్యగలరా, ఏమీ చెయ్యకుండానే మనందరం ఇలా వున్నామా?
అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో వున్న నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు.
నేను:సముద్రం ఏంటి,చెంబేంటి? అర్ధం అయినట్లు చెప్పండి
అతను: మరి గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే ఎందుకు కొందరే బాగుపడుతున్నారు? ఎందుకు కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం ఎప్పుడూ ఆ అన్యాయం పేదలికి, కొన్ని జాతులకే జరుగుతుంది?
నేను: చూడండీ, మీ ప్రశ్నలన్నీ కరక్టే కానీ ఒక ఇద్దరు మనుషులున్న ఒక కుటుంబంలో కలిసి ఉన్నప్పుడే ఎన్నో సమస్యలొస్తాయి, ఒక తల్లి పిల్లలే అమ్మ నాకంటే ఇంకొకరిని బాగా చూస్తుంది అని బాధపడతూ ఉంటారు, అలాంటిది ఇన్ని వైవిధ్యాలు, ఇంత జనాబా ఉన్న మన దేశమే కాదు ఎక్కడైనా ఎవరికీ అన్నీ సవ్యంగా 100% జరగాలని ఆశించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మనమెంతో సాధించాము,ఇప్పటికే మీరు చెప్పిన వెనుకబడిన జాతుల్లో ఎంతో మార్పు అభివృద్ధి వచ్చింది. ఇక ముందు ఇంకా వస్తుంది. వారి వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, తోటి వారిగా సమాజాంలో వున్న మన అందరికీ బాధ్యత వుంది కదా?ఒక్క గవర్న్మెంట్ నే తప్పు పడుతూ పోతే ఎలా? మనకి బాధ్యత లేదా?

అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో నీళ్ళగురించి మాట్లాడుతున్నవు అని చెప్పాను కదా. బాధ్యత తీసుకోవాలని చెప్పటం కాదు నిజంగా తీసుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ వున్న వెనుకబడ్డ వారికి బాద్యత తీసుకొని ఎందరో నిలబడ్డారు, కుటుంబాలు వదిలేసి, ఎంతో డబ్బు, పేరు తెచ్చిపెట్టే చదువు, జాబులు వదిలేసి కొండల్లో, అడవుల్లో తిండిలేక,వారికి వీరికీ ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, అది బాద్యత కాదా?నువ్వు చెప్పేది ఇంతకంటే గొప్ప బాధ్యత నా?నేను చెప్పేది ఎవరి గురించో అర్ధం అయిందా?

నేను: అర్ధం అయింది, అన్నల గురించి.నాకు వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటల్లో చూసినా, వాళ్ళకి అడవుల్లో తిరగటం, ప్రాణాలు కాపాడుకోవటం తోనే టైము అయిపోతుంది.ఇక వాళ్ళకి సమాజ జీవితంలో వున్న కష్టాలేమి తెలుస్తాయి? వేరే వారికోసం ఆలోచించడానికి వీలెక్కడ వుంటుంది. అదరినుండి దూరంగా పారిపోయి బతుకుతున్నారు.కనీసం వాళ్ళ కుటుంబానికైన ఉపయోగపడలేరు.ఇక సమాజానికి తుపాకీ పట్టుకొని వాళ్ళేమి మంచి చెయ్యగలరు.(ఇవి నిజంగా సినిమా డైలాగ్స్ లా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ నేను వాగాను అతనితో)

అతను: (చాలా సేపు మౌనంగా వుండిపోయారు)నేనెవరో తెలుసా? లాయర్ ప్రాక్టీస్ చేసుకొని బాగా సంపాదించుకోగలను, కానీ పొలీసులు చేసిన కూంబింగ్లో వెన్నెముకకి దెబ్బతగిలి ఏపనీ చేసుకోలేను ఇప్పుడు? అయినా నా బాధ్యత నా ప్రాణాలున్నవరకు నెరవేరుస్తాను.ఇప్పుడు నేను మేజర్ పనికి కొంత దూరంగా వున్నా, నిర్ణయాలలో, ప్లానింగ్ లో ఇంకా పనిచేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సముద్రంలో బతుకుతూ కూడా చెంబులో ఉన్న నీళ్ళ గురించే మాట్లాడతారు. నువ్వు భయపడకుండా, బాధ్యతగా పనిచేసేది చూసి నీకు సమాజం మీద నిజమైన బాధ్యత వుందనుకున్నాను. మీకందరికీ జీవితం సుఖంగా వుండాలి,నీకు నిజంగా బాద్యత ఉంటే మాలో చేరు అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో,ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు,లాయర్లు ఎన్నో గొప్ప చదువులు చదివిన వాళ్ళు, నిజంగా సమాజానికి కావలసింది ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు.నువ్వుకూడా తెలుసుకో,సరిగా ఆలోచించు.

(నిజంగా షాక్ అయ్యాను,నేను మాట్లాడేది ఎవరితో అని తెలిశాక, అతను అడుగుతున్నది ఏంటో తెలిశాక...ఎక్కువ టైం పట్టలేదు జవాబు చెప్పడానికి, ఎందుకంటే నాకు తెలుసు నేనేది నమ్ముతానో)

నేను: నాకు ఎలా చెప్పాలో తెలియటంలేదు. కానీ నేను మీలా వుండలేను.నాకు మా మమ్మీ కావాలి,డాడీ కావాలి,నా చెల్లి తమ్ముడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు నా ఫ్రెండ్స్ కావాలి, నా జీవితం నాకు ఎలా దొరికిందో అలా కావాలి.అలా వున్న జీవితం లో నేను నా వాళ్ళకీ, నాకు చేతనైనంత లో నా సమాజానికి చెయ్యగలిగితే చాలు.అంతే కానీ నా జీవితాన్ని, నా వాళ్ళని వదిలేసుకొని ఏదో వస్తుంది అని ఆశ తో బతకలేను.ఒకవేళ అలా బతికినా మీరు చెప్పే పూర్తి సమానత్వం, ఫుల్ గ్రీన్ సమాజం వస్తుందో రాదో నాకు తెలీదు కానీ నా జీవితం అంతకు ముందే అయిపోతుంది. ఈ జీవితం అలా అందరికీ దూరంగా ...నా వల్ల కాదు. నేను గొప్ప భావాలున్న మనిషిని కాదు. చాలా ఆశలు, కోరికలు,భయాలు వున్న మామూలు మనిషిని.(నేను అలాంటి మనిషిని అని నాకు కూడా అప్పుడే తెలిసింది)

ఇలా ఆవేశంగా ఏదో చెప్పేశాను.ఇంకా చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా మీ జీవితం వృధా చేసుకోకండి అని, ఇంకా అడగాలనిపించింది మీకు మీ జీవితం నష్టపోయాను అని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. కానీ ఎన్నో ఆలోచనలు నా మైండ్ నిండా. ఇటువంటి మాటలు చెప్తే అతనికి ఎలా అనిపిస్తుంది..కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయిన మనిషికి తను నష్టపోయాననే బాధ కలుగుతుందా, నాలాంటి స్వార్ధం కోసం ఆలోచించేవాళ్ళున్న ఈ సమాజం కోసమా మేమంతా కష్టపడేది అనిపిస్తుందా...ఇలా నా ఆలోచనలో నేను మౌనంగా ఉండిపోయాను.అతను ఏమీ మాట్లాడలేదు.అతను కూడా ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నేను ఒక ట్రాన్స్ లో వచ్చినట్లు బయటకి వచ్చేసాను.ఎలా ఇంటికెళ్ళానో నాకే తెలీదు.

అదే ట్రాన్స్ లో వున్నాను ఆరోజంతా. మధ్యానం మా టీం లో వాళ్ళకి జరిగింది చెప్పాను. అంతా విని ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. ధర్మా-"హ్మ్ ఎందుకైనా మంచిది నువ్వొక్కదానివే రాత్రిళ్ళు తిరగకు కొన్ని రోజులు, ఆ ఊరు ఇప్పట్లో మనమెవ్వరూ వెళ్ళొద్దు" అనేసి వెళ్ళిపోయాడు. చిత్ర తెలుగు మాట్లాడటం రాకపోయినా, అర్ధం అయ్యేది - "ఎదుకు వెలొదు? షి షుడ్ గో అండ్ వర్క్ ఏజ్ యుజుయల్, ఐ విల్ గో విత్ హెర్,షి ఈజ్ బ్రేవ్,డోంట్ ఫ్రైటెన్ హెర్,శిరీష, యు హేవ్ డన్ గుడ్,డోంట్ వర్రీ, వి ఆర్ విత్ యు". రెడ్డీ- "హబ్బా, ఏంటి నక్సలైటా,నిన్ను జాయిన్ అవ్వమన్నారా?ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా?" లేకపోతే నీ వర్క్ చూసి , నీ ప్రతాపం చూసి వాళ్ళు మురిసిపోయారా?,అన్నీ తిక్క మాటలు, పద రేపు నేనొస్తా నాకు చూపియ్ వాడేవన్నాడో నీకేమర్ధమయ్యిందో తేల్చేస్తాను". అన్నాడు. నాకు కూడా ఇదంతా నిజం కాకపోతే బాగుణ్ణు అనిపించింది.బహుశా నేను అతని మాటల్ని అతిగా ఊహించుకున్నానా? కలగన్నానా?

మనిషి కి షాక్ అనిపించిన సంఘటనలు అసలు జరగలేదని, బహుశా తప్పుగా ఊహించామని అనుకంటాడనుంటా. నేనూ అలా అనుకోవడమే బాగుంది అని అనుకున్నాను.ఇంకా అనుకుంటున్నాను.

శ్రీను(అప్పుడేమీ అనలేదు,కానీ ఆరోజు రాత్రి నేను ఒక్కదాన్నే డాబా మీదకి వెళ్ళినప్పుడు వచ్చి ఇలా చెప్పాడు-" శిరి, వాళ్ళ కళ్ళళ్ళో నువ్వు పడడం నీ అదృష్టం రా, నీకున్న గొప్ప గుణాలు నీకు తెలియలేదు, వాళ్ళకి కనిపించాయి,నీ జీవితం నీ ఇష్టం అనుకో, నేను ఈ సాహిత్యం అంతా ఈ మధ్య చదివాను రా, నాకు వాళ్ళని కలవాలనీ, వాళ్ళతో కలవాలనీ వుందిరా, నన్ను ఒకసారి వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళరా" అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఉదయం తగిలిన షాక్ కంటే పెద్ద షాక్ ఇది. శ్రీను ఎంతో సరదా మనిషి.కానీ తన జీవితం ఎంతో విషాదం. అందువల్ల తను మానసికంగా చాలా బలహీనం అని నాకు పి.జి లో తనతో కొన్ని రోజుల స్నేహంలోనే అర్ధం అయింది. అప్పటికి చూసిన సినిమా, కలిసిన మనిషి, చదివిన పుస్తకం, తెలుసుకున్న విషయం ఏదైన తనమీద కొంత కాలం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజుల పాటు అదే పని గా ఆ ఒక్క ఆలోచన చేసి అంతకంటే వెరేదీ లేదు అన్నట్లు, అదే తన జీవితం అన్నట్లు లీనం అయిపోతాడు. జీవితంలో తనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించేది నాకు. వీలైనంతవరకు తనకి దగ్గరగా వుండగలిగే జాబ్ దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఒకసారి పాటలు సంగీతం మీద పడి నెలలు గడిపేశాడు, ఇంకోసారి ఆద్యాత్మికం చదివి ఏదో ఆశ్రమం లో చేరాలని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు, ఇప్పుడు ఇలా.నాకు అప్పుడు వేసింది భయం. తిరుగుబాటుదారులు, నక్సల్స్, రావణులు తయారవ్వటానికి ఆ రోజు అతను చెప్పిన కారణాలు, నేను అనుకున్న కారణాలు, సినిమాల్లో చూపించే కారణాలు మాత్రమే కాదు శ్రీను లాగా ఏ కారణం లేకుండా ప్రభావితం అవ్వటం కూడా ఒక కారణం కావొచ్చు అనిపించింది. కారణాలేవైనా, నక్సలిజం మంచిదైనా, కాకపోయినా నా దారి మాత్రం కాదు. నా స్నేహితులని కూడా వెళ్ళేలా ప్రోత్సహించను. ఎందుకంటే నేను సాధారణ మనిషిని, నా వాళ్ళందరు నాతో పాటు వుండాలనీ, వారి వారి జీవితాలు సంతోషంగా గడపాలనీ,నా సుఖ ధుఖాలలో వాళ్ళు, వారి సుఖ ధుఖాలలో నేను తోడుగా వుండగలిగే సామాన్య పరిస్థితుల్లో మేమంతా వుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. సమ సమాజ స్థాపన వంటి పెద్దకలలు కనేంత గొప్ప దానిని కాదు మరి. అందుకే నా ఆలోచనలను పక్కన పెట్టేసి శ్రీను మూడ్ డైవర్ట్ చేసే పనిలో పడ్డాము నేనూ చిత్రా.

Sunday, July 11, 2010

రావణ్(విలన్)- ఇది సినిమా కాదు[పార్ట్-2]

(నేను చేసిన పని చాలా మందికి నా మీద మంచి అభిప్రాయం కలిగించకపోవచ్చు, కానీ నేను పెద్ద ఆశయాలు లేని ఎన్నో భయాలు,స్వార్ధాలు వున్న మామూలు మనిషిని అని అర్ధం చేసుకొని చదవగలరు)

..............................................................

అతను నన్ను చూస్తున్నారు రెప్ప వేయకుండా, అతని వయసు ఇంత అని చెప్పడానికి కష్టం, శరీరం చాలా బక్కగా వుంది.కాళ్ళు చేతులూ మరీ మొద్దుబారినట్లున్నాయి,ఇక నేనే ఏదో మాట్లాడాలని "యాదమ్మా..అని మొదలుపెట్టాను.అతను "ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు?" అని అడిగారు నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది, కానీ అతను మళ్ళీ అదే ప్రశ్న వేశారు. నేను ఏదో చేసుకుపోతున్నాను కాని ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని ఎవరైనా సడన్ గా అడిగితే ఏమి చెప్పాలి. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అన్నాను. ఇతనేదో చాలా సీరియస్ ప్రశ్నలు వెయ్యాలనే డిసైడ్ అయ్యాడని అర్ధం అయింది. మమ్మల్ని ఎందరో మా ఉద్యోగం గురించి, మా గురించి ప్రశ్నలు వేస్తారు. కొత్త గ్రామం వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా అడుగుతారు. అందులోను ఒక అబ్బాయి అమ్మాయి గనుక వెళ్ళామంటే అతను నీకేమవుతాడు?, ఈమె నీకేమవుతుంది అని కూడా అడుగుతారు, ఈ జాబ్ కి ఎంత లంచం ఇచ్చారు? గవర్నమెంట్ జాబేనా?ఒకటి కాదు ఎన్నో ప్రశ్నలు. అలాగే ఇది కూడా అనుకున్నాను. ఇప్పటికీ అతను మాట్లాడిన  ప్రతీ మాటా గుర్తుంది అతని గొంతులో తీక్షణత్వం, మాటల్లో తెలివి,సమాచారం ఇలాంటివి అంతకు ముందెప్పుడూ నాకు ఎదురుకాని ఒక ప్రత్యేకత ఏదో!!(కానీ నిజంగా కొన్ని మాటలు అర్ధం కాలేదు,అందుకే అర్ధం అయిన మాటలు రాస్తున్నాను)

అతను: నచ్చిందా, ఏంటి నచ్చింది?రాత్రి పూట ఒంటరిగా చీకటిలో వెళ్ళి రావటం నచ్చిందా?
నేను: మీకు నేను తెలుసా?నేను రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నానని ఎలా తెలుసు?
అతను: నీకేమి నచ్చింది?కష్టంగా లేదా?ఇది అంత మంచి ఏరియా కాదు
నేను:భయపెడుతున్నారా? నాకు ఇంతవరకు ఇక్కడ భయపడాల్సిన ఎటువంటి సమస్యా రాలేదు. ఏమో వస్తే అప్పుడు మానేస్తానేమో
అతను: గవర్నమెంట్ జాబే కదా రిపోర్ట్ రాస్తే సరిపోదా మీటింగ్ కి వెళ్ళాను అని ఎందుకని నిజంగా వెళ్ళటం?
నేను: నాకు అలా నచ్చదు, రిపోర్ట్ రాయగలను కానీ నా మనసే ఒప్పుకోదు. అయినా గవర్నమెంట్ లో ఎవరూ పని చెయ్యరని చెప్పలేము కదా.
అతను: ఏమి చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ కి చిత్త శుద్ధి లేదు. ఎవరికీ ఏమీ చెయ్యలేదు.మీ ప్రాజెక్ట్ అయినా అంతే.
నేను:(నాకు చాలా కోపం వచ్చేసింది) అందరూ ఎందుకు గవర్నమెంట్, గవర్నమెంట్ అని ఎవరినో తిట్టడం, ముందు మనకోసం మనం ఏమి చేసుకుంటున్నాము? వెలుగు ప్రాజెక్ట్ తాలూక ముఖ్యమైన వుద్ధేశ్యం కూడా ప్రజలు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ వుండకుండా అందరు కలిసి వారి కోసం వారు ఏమి చెయ్యగలరో ముందు చేసుకునేలా చెయ్యటమే. ఇంత మంచి ప్రాజెక్టు, ఆలోచన గవర్నమెంటుదే కదా! ఎన్.జి.ఓ లు, లేదా వేరే ఎవరైనా సరే గవర్నమెంట్ చెయ్యగలిగేంత మందికి, అన్ని రకాల పనులు చెయ్యగలరా, ఏమీ చెయ్యకుండానే మనందరం ఇలా వున్నామా?
అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో వున్న నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు.
నేను:సముద్రం ఏంటి,చెంబేంటి? అర్ధం అయినట్లు చెప్పండి
అతను: మరి గవర్నమెంట్ అన్నీ చేస్తుంటే ఎందుకు కొందరే బాగుపడుతున్నారు? ఎందుకు కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంది? ఎందుకు అన్యాయం ఎప్పుడూ ఆ అన్యాయం పేదలికి, కొన్ని జాతులకే జరుగుతుంది?
నేను: చూడండీ, మీ ప్రశ్నలన్నీ కరక్టే కానీ ఒక ఇద్దరు మనుషులున్న ఒక కుటుంబంలో కలిసి ఉన్నప్పుడే ఎన్నో సమస్యలొస్తాయి, ఒక తల్లి పిల్లలే అమ్మ నాకంటే ఇంకొకరిని బాగా చూస్తుంది అని బాధపడతూ ఉంటారు, అలాంటిది ఇన్ని వైవిధ్యాలు, ఇంత జనాబా ఉన్న మన దేశమే కాదు ఎక్కడైనా ఎవరికీ అన్నీ సవ్యంగా 100% జరగాలని ఆశించటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మనమెంతో సాధించాము,ఇప్పటికే మీరు చెప్పిన వెనుకబడిన జాతుల్లో ఎంతో మార్పు అభివృద్ధి వచ్చింది. ఇక ముందు ఇంకా వస్తుంది. వారి వంతు ప్రయత్నం కూడా వాళ్ళు చెయ్యాలి, తోటి వారిగా సమాజాంలో వున్న మన అందరికీ బాధ్యత వుంది కదా?ఒక్క గవర్న్మెంట్ నే తప్పు పడుతూ పోతే ఎలా? మనకి బాధ్యత లేదా?

అతను: నువ్వు సముద్రంలో వుంటూ చెంబులో నీళ్ళగురించి మాట్లాడుతున్నవు అని చెప్పాను కదా. బాధ్యత తీసుకోవాలని చెప్పటం కాదు నిజంగా తీసుకోవాలి. అది చెప్పినంత సులభం కాదు. ఇక్కడ వున్న వెనుకబడ్డ వారికి బాద్యత తీసుకొని ఎందరో నిలబడ్డారు, కుటుంబాలు వదిలేసి, ఎంతో డబ్బు, పేరు తెచ్చిపెట్టే చదువు, జాబులు వదిలేసి కొండల్లో, అడవుల్లో తిండిలేక,వారికి వీరికీ ఏ సంబంధం లేకపోయినా ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, అది బాద్యత కాదా?నువ్వు చెప్పేది ఇంతకంటే గొప్ప బాధ్యత నా?నేను చెప్పేది ఎవరి గురించో అర్ధం అయిందా?

నేను: అర్ధం అయింది, అన్నల గురించి.నాకు వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పిన మాటల్లో చూసినా, వాళ్ళకి అడవుల్లో తిరగటం, ప్రాణాలు కాపాడుకోవటం తోనే టైము అయిపోతుంది.ఇక వాళ్ళకి సమాజ జీవితంలో వున్న కష్టాలేమి తెలుస్తాయి? వేరే వారికోసం ఆలోచించడానికి వీలెక్కడ వుంటుంది. అదరినుండి దూరంగా పారిపోయి బతుకుతున్నారు.కనీసం వాళ్ళ కుటుంబానికైన ఉపయోగపడలేరు.ఇక సమాజానికి తుపాకీ పట్టుకొని వాళ్ళేమి మంచి చెయ్యగలరు.(ఇవి నిజంగా సినిమా డైలాగ్స్ లా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ నేను వాగాను అతనితో)

అతను: (చాలా సేపు మౌనంగా వుండిపోయారు)నేనెవరో తెలుసా? లాయర్ ప్రాక్టీస్ చేసుకొని బాగా సంపాదించుకోగలను, కానీ పొలీసులు చేసిన కూంబింగ్లో వెన్నెముకకి దెబ్బతగిలి ఏపనీ చేసుకోలేను ఇప్పుడు? అయినా నా బాధ్యత నా ప్రాణాలున్నవరకు నెరవేరుస్తాను.ఇప్పుడు నేను మేజర్ పనికి కొంత దూరంగా వున్నా, నిర్ణయాలలో, ప్లానింగ్ లో ఇంకా పనిచేస్తున్నాను. నీలాంటి వాళ్ళు సముద్రంలో బతుకుతూ కూడా చెంబులో ఉన్న నీళ్ళ గురించే మాట్లాడతారు. నువ్వు భయపడకుండా, బాధ్యతగా పనిచేసేది చూసి నీకు సమాజం మీద నిజమైన బాధ్యత వుందనుకున్నాను. మీకందరికీ జీవితం సుఖంగా వుండాలి,నీకు నిజంగా బాద్యత ఉంటే మాలో చేరు అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏంటో,ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు,లాయర్లు ఎన్నో గొప్ప చదువులు చదివిన వాళ్ళు, నిజంగా సమాజానికి కావలసింది ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు.నువ్వుకూడా తెలుసుకో,సరిగా ఆలోచించు.

(నిజంగా షాక్ అయ్యాను,నేను మాట్లాడేది ఎవరితో అని తెలిశాక, అతను అడుగుతున్నది ఏంటో తెలిశాక...ఎక్కువ టైం పట్టలేదు జవాబు చెప్పడానికి, ఎందుకంటే నాకు తెలుసు  నేనేది నమ్ముతానో)

నేను: నాకు ఎలా చెప్పాలో తెలియటంలేదు. కానీ నేను మీలా వుండలేను.నాకు మా మమ్మీ కావాలి,డాడీ కావాలి,నా చెల్లి తమ్ముడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వాళ్ళకి ఉపయోగపడాలి, నాకు నా ఫ్రెండ్స్ కావాలి, నా జీవితం నాకు ఎలా దొరికిందో అలా కావాలి.అలా వున్న జీవితం లో నేను నా వాళ్ళకీ, నాకు చేతనైనంత లో నా సమాజానికి చెయ్యగలిగితే చాలు.అంతే కానీ నా జీవితాన్ని, నా వాళ్ళని వదిలేసుకొని ఏదో వస్తుంది అని ఆశ తో బతకలేను.ఒకవేళ అలా బతికినా మీరు చెప్పే పూర్తి సమానత్వం, ఫుల్ గ్రీన్ సమాజం వస్తుందో రాదో నాకు తెలీదు కానీ నా జీవితం అంతకు ముందే అయిపోతుంది. ఈ జీవితం అలా అందరికీ దూరంగా ...నా వల్ల కాదు. నేను గొప్ప భావాలున్న మనిషిని కాదు. చాలా ఆశలు, కోరికలు,భయాలు వున్న మామూలు మనిషిని.(నేను అలాంటి మనిషిని అని నాకు కూడా అప్పుడే తెలిసింది)

ఇలా ఆవేశంగా ఏదో చెప్పేశాను.ఇంకా చెప్పాలనిపించింది మీరు కూడా ఇలా మీ జీవితం వృధా చేసుకోకండి అని, ఇంకా అడగాలనిపించింది మీకు మీ జీవితం నష్టపోయాను అని ఒక్కసారి కూడా అనిపించలేదా అని. కానీ ఎన్నో ఆలోచనలు నా మైండ్ నిండా. ఇటువంటి మాటలు చెప్తే అతనికి ఎలా అనిపిస్తుంది..కాళ్ళూ చేతులు చచ్చుబడిపోయిన మనిషికి తను నష్టపోయాననే బాధ కలుగుతుందా, నాలాంటి స్వార్ధం కోసం ఆలోచించేవాళ్ళున్న ఈ సమాజం కోసమా మేమంతా కష్టపడేది అనిపిస్తుందా...ఇలా నా ఆలోచనలో నేను మౌనంగా ఉండిపోయాను.అతను ఏమీ మాట్లాడలేదు.అతను కూడా ఏదో ఆలోచిస్తున్నట్లనిపించింది. నేను ఒక ట్రాన్స్ లో వచ్చినట్లు బయటకి వచ్చేసాను.ఎలా ఇంటికెళ్ళానో నాకే తెలీదు.

అదే ట్రాన్స్ లో వున్నాను ఆరోజంతా. మధ్యానం మా టీం లో వాళ్ళకి జరిగింది చెప్పాను. అంతా విని ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అయ్యారు.
 ధర్మా-"హ్మ్ ఎందుకైనా మంచిది నువ్వొక్కదానివే రాత్రిళ్ళు తిరగకు కొన్ని రోజులు, ఆ ఊరు ఇప్పట్లో మనమెవ్వరూ వెళ్ళొద్దు" అనేసి వెళ్ళిపోయాడు.
చిత్ర తెలుగు మాట్లాడటం రాకపోయినా, అర్ధం అయ్యేది - "ఎదుకు వెలొదు? షి షుడ్ గో అండ్  వర్క్ ఏజ్ యుజుయల్, ఐ విల్ గో విత్ హెర్,షి ఈజ్ బ్రేవ్,డోంట్ ఫ్రైటెన్ హెర్,శిరీష, యు హేవ్ డన్ గుడ్,డోంట్ వర్రీ, వి ఆర్ విత్ యు".
రెడ్డీ- "హబ్బా, ఏంటి నక్సలైటా,నిన్ను జాయిన్ అవ్వమన్నారా?ఎవరో ఏదో మాట్లాడితే నువ్వు భయపడి మమ్మల్ని భయపెడుతున్నావా?" లేకపోతే నీ వర్క్ చూసి , నీ ప్రతాపం చూసి వాళ్ళు మురిసిపోయారా?,అన్నీ తిక్క మాటలు, పద రేపు నేనొస్తా నాకు చూపియ్ వాడేవన్నాడో నీకేమర్ధమయ్యిందో తేల్చేస్తాను". అన్నాడు.
నాకు కూడా ఇదంతా నిజం కాకపోతే బాగుణ్ణు అనిపించింది.బహుశా నేను అతని మాటల్ని అతిగా ఊహించుకున్నానా? కలగన్నానా?

మనిషి కి షాక్ అనిపించిన సంఘటనలు అసలు జరగలేదని, బహుశా తప్పుగా ఊహించామని అనుకంటాడనుంటా. నేనూ అలా అనుకోవడమే బాగుంది అని అనుకున్నాను.ఇంకా అనుకుంటున్నాను.

శ్రీను(అప్పుడేమీ అనలేదు,కానీ ఆరోజు రాత్రి నేను ఒక్కదాన్నే డాబా మీదకి వెళ్ళినప్పుడు వచ్చి ఇలా చెప్పాడు-" శిరి, వాళ్ళ కళ్ళళ్ళో నువ్వు పడడం నీ అదృష్టం రా, నీకున్న గొప్ప గుణాలు నీకు తెలియలేదు, వాళ్ళకి కనిపించాయి,నీ జీవితం నీ ఇష్టం అనుకో, నేను ఈ సాహిత్యం అంతా ఈ మధ్య చదివాను రా, నాకు వాళ్ళని కలవాలనీ, వాళ్ళతో కలవాలనీ వుందిరా, నన్ను ఒకసారి వాళ్ళదగ్గరికి తీసుకెళ్ళరా" అన్నాడు. నాకు బుర్ర తిరిగిపోయింది, ఉదయం తగిలిన షాక్ కంటే పెద్ద షాక్ ఇది. శ్రీను ఎంతో సరదా మనిషి.కానీ తన జీవితం ఎంతో విషాదం. అందువల్ల తను మానసికంగా చాలా బలహీనం అని నాకు పి.జి లో తనతో కొన్ని రోజుల స్నేహంలోనే అర్ధం అయింది. అప్పటికి చూసిన సినిమా, కలిసిన మనిషి, చదివిన పుస్తకం, తెలుసుకున్న విషయం ఏదైన తనమీద కొంత కాలం విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కొన్ని రోజుల పాటు అదే పని గా ఆ ఒక్క ఆలోచన చేసి అంతకంటే వెరేదీ లేదు అన్నట్లు, అదే తన జీవితం అన్నట్లు లీనం అయిపోతాడు. జీవితంలో తనకి ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అవసరం అనిపించేది నాకు. వీలైనంతవరకు తనకి దగ్గరగా వుండగలిగే జాబ్ దొరికినప్పుడు సంతోషం కలిగింది. ఒకసారి పాటలు సంగీతం మీద పడి నెలలు గడిపేశాడు, ఇంకోసారి ఆద్యాత్మికం చదివి ఏదో ఆశ్రమం లో చేరాలని అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పాడు, ఇప్పుడు ఇలా.నాకు అప్పుడు వేసింది భయం. తిరుగుబాటుదారులు, నక్సల్స్, రావణులు తయారవ్వటానికి ఆ రోజు అతను చెప్పిన కారణాలు, నేను అనుకున్న కారణాలు, సినిమాల్లో చూపించే కారణాలు మాత్రమే కాదు శ్రీను లాగా ఏ కారణం లేకుండా ప్రభావితం అవ్వటం కూడా ఒక కారణం కావొచ్చు అనిపించింది. కారణాలేవైనా, నక్సలిజం మంచిదైనా, కాకపోయినా నా దారి మాత్రం కాదు. నా స్నేహితులని కూడా వెళ్ళేలా ప్రోత్సహించను. ఎందుకంటే నేను సాధారణ మనిషిని, నా వాళ్ళందరు నాతో పాటు వుండాలనీ, వారి వారి జీవితాలు సంతోషంగా గడపాలనీ,నా సుఖ ధుఖాలలో వాళ్ళు, వారి సుఖ ధుఖాలలో నేను తోడుగా వుండగలిగే సామాన్య పరిస్థితుల్లో మేమంతా వుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. సమ సమాజ స్థాపన వంటి పెద్దకలలు కనేంత గొప్ప దానిని కాదు మరి. అందుకే నా ఆలోచనలను పక్కన పెట్టేసి శ్రీను మూడ్ డైవర్ట్ చేసే పనిలో పడ్డాము నేనూ చిత్రా.

Monday, July 5, 2010

రావణ్ (విలన్)-ఇది సినిమా కాదు

మొన్న శనివారం రావణ్ (విలన్) సినిమా చూశాను. నాకు మామూలుగా అయితే అభిషేక్ ఇష్టం, కాని విక్రం బాగా చేస్తాడని కూడా ఒప్పుకుంటాను. హిందీ వెర్షన్ చూస్తే కానీ తెలీదు ఎవరు బాగా చేశారని.ఐశ్వర్య ని చూస్తే బాగాలేదనిపించింది(ఐశ్వర్య అభిమానులు వింటే నన్ను ఉరి తీశేస్తారేమో)ఇక అసలు విషయం ఏంటి అంటే ఇంతకీ సినిమాలో ఏమి చెప్పాలనుకున్నారు? మళ్ళీ రామాయణం చూసినట్లే అయింది.రావణుడు ఎందుకు అలా అయ్యాడని చెప్పాలనుకున్నరేమో!నిజం చెప్తున్నాను నాకు చాలా విషయాలు అర్ధం కావు. కానీ నోరు మూసుకొని వుండను ఏదో ఒకటి వాగుతుంటాను.అలాగే రావణ్ కూడా నాకు నిజంగా అర్ధం కాలేదు కానీ ఏదో వాగుతున్నా, నాకు అర్ధం అయిన వరకు. రావణ్ విలన్ గా ఎందుకయ్యాడు అని చెప్పాలని చూశారనిపించింది.

నిజంగా మన సమాజంలో నక్సలైట్లు ఎందుకు తయారవుతున్నారు అని చెప్పిన రీజన్స్  అన్నీ ఇంచుమించు ఇలాగే వుంటాయా? నిజానికి నక్సలైట్లు,విప్లవకారులు తయారయ్యేది కేవలం వారికేదో అన్యాయం జరిగిందనేనా? కాదేమో! నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకునేదాన్ని నాకు నిజంగా నక్సలైట్లు తో మాట్లాడిన సంధర్భం ఎదురైన వరకు. అసలిప్పటికీ అది నిజంగా జరిగిందా అని నమ్మలేకపోతున్నాను.ఒకరకంగా నాకున్న ఈ అలవాటు( అర్ధం అయి కాకపోయినట్లుండడం, కొన్ని విషయాలు నిజంగా జరిగినా జరగనట్లు అనిపించడం) నన్ను ప్రశాంతంగా వుండనిచ్చాయనుకుంటా.(నేను చెప్పే కధలన్నీ పెద్దగా వుంటాయి మరి, ఓపిక వుందా?)

నేను వజ్రపుకొత్తూరు మండలం లో పని చెయ్యటం మొదలయ్యాక ఇక అక్కడే మా స్థావరం ఏర్పాటు చేసుకున్నాము.మొదట్లో నేను, శ్రీను, రెడ్డీ మాత్రమే వున్నా తరువాత టీం లో చిత్ర, ధర్మా చేరారు.మేము వజ్రపుకొత్తూరు మండలం రాజ్యాన్ని మొత్తం పంచేసుకున్నాము.నా సామ్రాజ్యం పలాస నుండి బెండిగేటు మద్య ప్రాంతం. మెయిన్ లైను గ్రామాలతో పాటు లోపల ఇంటీరియర్ గ్రామాలు అన్నీ నావే. మొదట్లో నడిచి, బస్సుల్లో తిరిగే వాళ్ళం,కొన్నిరోజులకు అమ్మాయిలకి కైనటిక్ హోండాలు, అబ్బాయిలకు సుజికి సమురాయ్ లు ఇచ్చారు. దాని తో పని కాస్త సులభం అయింది.అలాగే గ్రామాలలో రాత్రిపూట వుండిపోవటం తగ్గిపోయింది. పని ముగించుకొని వీలైనంతవరకు తిరిగి వచ్చేసే వాళ్ళం.కానీ మా పని దొంగల్లాగా సాయంత్రం మొదలవుతుంది. పగలు గ్రామస్థులు అందరు పనులకు వెళ్ళిపోతారు సో, మనం వెళ్ళి పొదుపు చెయ్యండి, గ్రూపులు కట్టండి, మీ గ్రామంలో సమస్యలేంటి, ఊరి చెరువు ఎండిపోయింది అందరం కలిసి శ్రమదానం చేసి పూడిక తీద్దాము,పిల్లల్ని బడి కి పంపండి పనులకు వద్దు అని క్లాస్ పీకితే ఆ సమయంలో వినరు సరికదా మనల్ని నాలుగు పీకుతారు. అందుకని చక్కగా పక్షులన్నీ గూటికి తిరిగొచ్చే వేళ, పశువులన్నీ లేగ దూడలకి పాలు ఇవ్వాలని పరిగెడుతూ ఇంటికొచ్చే వేళ, పగలంత మండుటెండలో చెమటలు కక్కుతూ కూలి పని చేసినా ఇంటికెళ్తూ ఒకరిపై ఒకరు హాస్యాలాడుకుంటూ హుషారుగా వెళ్తున్న ఆడవాళ్ళను చూస్తూ మేము మా బండి స్టార్ట్ చేసుకొని ఊరిమీద పడతాము. మేము వస్తాము అని చెప్పిన గ్రామానికి వాళ్ళు ఇచ్చిన టైముకి మాత్రం వెళ్ళే వాళ్ళం ఎందుకంటే వాళ్ళకున్న పనులు,అలసట వల్ల జనాలకి తీరికే వుండదు(ముఖ్యంగా ఇంట్రస్ట్ వుండదు) అందుకని ఇచ్చిన అవకాశం మేమెలా వదులుతాము. అలా వెళ్ళి ఎక్కువగా మహిళలతో గ్రూపులు కట్టించటం, పొదుపులు చేయించటం చేసే ముందు గ్రామంలో సమస్యలని ఏదో ఒకటి పరిష్కరిస్తూ ఆ గ్రామంలో ఎంటర్ అయ్యేవాళ్ళం. కొత్తగా గ్రూపు చెయ్యాలన్నా, గ్రూప్ మీటింగులు అయినా, గ్రామస్తులతో మీటింగ్ అయినా అన్నీ అయ్యే సరికి ఎలా కాదన్నా 8-9 అయ్యేది. అప్పుడు ఒక్కోసారి వాళ్ళు బోజనం కూడా అంటే ఇంకా ఎక్కువ టైమయ్యేది. ఆ టైములో తిరిగి వెళ్ళే వాళ్ళం. మొదట్లో ధర్మా, శ్రీను, రెడ్డీ ఎవరు ఫీల్డ్ కి వెళ్తుంటే వాళ్ళతో నేను, చిత్ర ఎవరో ఒకరి బైక్ పై వెళ్ళే వాళ్ళం. మా ఏరియా లు డివిజన్ ప్రకారం నా గ్రామాలు, రెడ్డీవి కలిసేవి, చిత్ర గ్రామాలు, ధర్మా వి కలిశాయి.ఒకే బండి లో వెళ్ళి రెండు గ్రామాలు చూసి వచ్చే వాళ్ళం. కాని ఒకసారి రెడ్డీ నన్ను "నేనేమైనా నీ డ్రైవర్ అనుకున్నావా, ఎన్నాళ్ళు నా మీద డిపెండ్ అవుతావు" అన్నాడు. నాకు చాలా అవమానం అనిపించింది, నేను జీవితంలో సైకిల్ కూడా సరిగా నేర్చుకోలేదు, అలాంటిది ఒక్కదాన్నే ఖైనటిక్ తీసుకొని ఫీల్డ్ కి వెళ్ళిపోయా (ఆ తరువాత ధర్మా నన్ను వెతుక్కొని వచ్చాడనుకోండి).కాని ఆ ఉక్రోషంలో నాకు డ్రైవింగ్ వచ్చేసింది. అందుకు ఎందరో సహకరించారు.నేను బండి తీసుకొని బయటకెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళే ప్రతీ వాళ్ళు కాసేపు వాళ్ళపని ఆపేసి పక్కకి జరిగి ఆగిపోయేవారు.బస్సు డ్రైవర్ బస్సుని వీలైనంత పక్కకి తీసి ఆపేసే వాళ్ళు. ఆఖరికి చిన్నపిల్లలు, వీధి కుక్కలు కూడా  దారి ఇచ్చేసే వాళ్ళు.(అందరికీ నేనంటే అంత మర్యాద). ఒక్క కోడి జాతి మాత్రం నాకు నిజమైన సవాళ్ళుగా నిలిచాయి. ఎక్కడో దూరంగా ఇంటి వెనుక  మేస్తుండేవి నా బండి వస్తుందనగానే ఎగురుకుంటా వచ్చి నా బండి కింద పడేవి.పల్లెలో "తమ్ముడు తమ్ముడే,పేకాట పేకాటే " ఎంత మేడం అయినా కోడి ని గుద్దిస్తే 200/- ఇవ్వాల్సిందే.(బహుశా నా బండి కిందే అన్నీ కాస్ట్లీ కోళ్ళే పడేవేమో!ధర్మా కి ఎప్పుడూ 20/-మాత్రమే ఖర్చు అయ్యేది,మాకు కోడి కూర కూడా వచ్చేది).

ఇలా మొత్తానికి డ్రైవింగ్ వచ్చేసాక ఒక్కదాన్నేఅ ఆ నిర్మానుష్యమైన రోడ్లమీద ఝూమ్మని వెళ్తుంటే వావ్ ఎంత బాగుండేదో!!అప్పట్లో ఆ పల్లెల్లో బైక్ మీద తిరిగే అమ్మాయిగా పేరు గాంచాను. చిత్ర కి ముందే డ్రైవింగ్ వచ్చు కానీ చిత్రకి తెలుగు రాదు, తెలుగు మాట్లాడాలని చూసి బూతులు మాట్లాడేసేది.అందుకని ఎలాగూ తను ఎవరో ఒకరితో వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువగా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఎడారిలో బతుకుతున్న వాళ్ళకి పెద్ద వాటర్ ఫాల్ దొరికినట్లైంది నా జీవితంలో చిత్ర రావటం.ఒక సంవత్సరంగా ఇద్దరబ్బాయిలతో తిరిగటం, మాట్లాడటం, 24 గంటలు నా ఎదురుగా అబ్బాయిలే. ఎంతైనా అమ్మాయిలకి అమ్మాయిల స్నేహం గొప్ప, అలాగే అబ్బాయిలకి కూడా. చిత్ర నన్నెంత ప్రభావితం చేసిందనే విషయం గురించి ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.ఇక నేను నా పని ఎవరిమీదా ఆధారపడకుండా చాలా పనులు చెయ్యగలగటం వీలయ్యింది డ్రైవింగ్ వచ్చాక. ఆ స్వతంత్రం ఎంత ఆనందమో అనుభవిస్తేనే తెలుస్తుంది. బైక్ మీద వెనక కూర్చొని వెళ్ళడానికి, బైక్ మనమే డ్రైవ్ చెయ్యడానికి పెద్ద తేడా ఏముంది అనుకుంటాము.కానీ బహుశా అమ్మాయిలకి అర్ధం అవుతుందేమో! నాన్నో, అన్నయ్యో, ఆయనో , తమ్ముడో తీసుకెళ్తే కానీ చాలా పనులు చేసుకోలేకపోవటం, వెళ్తున్న దారిలో అందమైన గడ్డిపూలు కనిపిస్తే, చిన్న కుక్కపిల్ల కనిపిస్తే, చల్లని జీడితోటలో కాసేపు కూర్చోవాలనిపిస్తే ఆగలేకపోవటం,  తలమీద చేపల బుట్ట బరువుతో ఎండలో ఒంటరిగా వెళ్తున్న ముసలామెని బైక్ ఎక్కించుకోవటం, పలాసకి కాలేజి కెళ్ళి గుంపులుగా వస్తున్న అమ్మాయిలని పలకరిస్తు పిచ్చాపాటి చెప్పటం ఇవన్నీ కుదురుతాయా మనకి. ఇలాంటివెన్నో వందల వేల అనుభవాలు, ఆ ప్రయాణాలలో.బహుశా ఇలాంటి పిచ్చి కోరికలన్నీ అమ్మాయిలకే వుంటాయేమో, చిత్ర కూడా నాలాంటిదే. కానీ రాత్రి మీటింగ్ అయ్యాక తిరిగి రావటం మాత్రం.....కాస్త భయంగా వుండేది. అది అసలే జీడితోటలు, చీకటి.

చాలా సార్లు ఆ తోటల్లో వస్తుంటే కొందరు నా బండి ఆపి నేనెవరు ఏంటని అడిగే వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు అక్కడేమి చేస్తున్నారని అడగాలనిపించినా అడగలేదు, వాళ్ళ తోటలు వాళ్ళిష్టం.ఒకసారి మా ఇంట్లో వాళ్ళు నాకోసం ఏదో పంపిస్తే ఇవ్వడానికని మా తమ్ముడి ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు.మా ఇంట్లో మా అందరి స్నేహితులు మాతో పాటు మా ఇంటిమనుషులైపోతారు.నాతో పాటు ఒకరోజు ఫీల్డ్ కి వచ్చాడు.మీటింగ్ త్వరగానే ముగించి బైక్ మీద వస్తున్నాము. జీడితోటల్లో అలా చీకటిలో వస్తుంటే సుధాకర్ పైప్రాణాలు పైనే పోయినట్లున్నాయి.తను కాస్త భయస్థుడు, దారిపొడుగునా చీకట్లో ఎటువంటి భయాలు పడొచ్చో అన్నీ చెప్తున్నాడు, దూరంగా ఏవో మంటలు కనిపించాయి"బాబీ అవి ఏంటి ఆ మంటలు అని అడిగాడు, అసలే చీకటిలో డబల్స్ డ్రైవింగ్లో బిజీగా వుండి పరధ్యానంగా ఏదో శవం అయివుంటుందిలే సుధా అని చెప్పేశాను" ఇక సుధాకర్ నా ప్రాణాలు తీసేశాడు.బాబీ త్వరగా పోనీ, జాగ్రత్తగా పోనీ అంటూ, దెయ్యాలలో రకాలు, ఏ దెయ్యం కి ఏమి ఇష్టం అని చెప్తూ  భయపడుతూ నన్ను భయపెట్టసాగాడు. కానీ ఇంతలో మా బైక్ ని ఎవరో ఆపారు.

30-40 వయసులో వుంటారు, ఆ చీకటిలో నుండి ఎలా వచ్చారో తెలీదు. అందులో ఒకతను ఇంతకు ముందుకూడా ఒకసారి నా బండి ఆపాడు.అతను కోపంగా"నీకెన్నిసార్లు చెప్పాలమ్మా రాత్రిపూట ఇలా బండేసుకుని తిరగొద్దని, పోలీసులనుకోవచ్చు, ఏదైన జరగొచ్చు, అయినా అమ్మాయివి కదా రాత్రిపూట మీటింగులేంటి పగలు పెట్టుకో..."అని అరుస్తున్నాడు.నేను కూడా నా జాబ్ ఇది మీకేంటి అని చెప్పాలని చూశాను కానీ ఇంతలో రెండో అతను ఈయన్ని ఆపి, ఏమ్మా రాత్రి పూట ఇలా తిరగకమ్మ, ఇది మంచి ఏరియా కాదు, అన్నలుంటారు, పోలీసులు కూంబింగ్ చేస్తుంటారు,జాగ్రత్త. అని సుధాకర్ వైపు చూసి నువ్వెవరు అని అడిగారు.సుధాకర్ అప్పటికే గడ గడా వణుకుతున్నాడు.మా తమ్ముడు అని చెప్పాను నేను.వాళ్లు అనుమానంగా చూసి సరే మేడం మీరు పలానా గ్రామలో ఎస్.సి. వాళ్ళకి గ్రూపులు చెయ్యరా అని అడిగారు.ఎందుకు చెయ్యను ఆ గ్రామంలో వాళ్ళు అసలు నా మాట వినడంలేదు అని చెప్పాను. రేపు ఉదయాన్నే 8గంటలకి ఆ గ్రామంకి రండి, అక్కడ యాదమ్మ అని వుంటుంది ఆవిడని కలవండి, ఆమె మీకు సహాయం చేస్తుంది అని చెప్పాడు. సరే అని ఇక వెళ్తాను అని బయలుదేరాను.సుధాకర్ ఇంటికెళ్ళేవరకు ఇంకొక్క మాట మాట్లాడలేదు. ఉదయాన్నే బస్సెక్కిస్తే వెళ్ళిపోయాడు.వెళ్ళేముందు "బాబీ నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలా డేంజర్ గా వుంది, నీకు చెప్పేంతవాడిని కాదు,నువ్వు నీకు నచ్చినపనే చేస్తావు అని తెలుసు,కానీ జాగ్రత్తగా వుండు బాబీ."అని సెంటిమెంట్ డైలాగులు చెప్పేసి వెళ్ళాడు.ఇక అప్పుడు బయలుదేరి ముందురోజు రాత్రి అతను చెప్పిన గ్రామానికి వెళ్ళాను.అప్పటికీ నాకు తెలీదు నేను ఒక సీక్రెట్ మీటింగ్ లో పాల్గొనబోతున్నానని, ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నానని.

ఆ ఊరు అప్పటికి 4 సార్లు వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా నన్నేదో చిన్నపిల్లని కదా చూసినట్లు చూసి పెద్దగా పట్టించుకోరు. నేను చెప్పేది మాత్రం పూర్తిగా వినేవాళ్ళు ఆహా ఎంత బాగా వింటున్నారు అనుకునే లోపే సరే మేడం వుంటాము, అని ఇన్ డైరెక్ట్ గా నన్ను వెళ్ళిపొమ్మనేవాళ్ళు.బాగా పొడుగ్గా వున్నాడుకదా రెడ్డే మాట వింటారేమొ అనుకుని తను కూడా ట్రై చేశాడు. అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టాము, ఆ ఊర్లో ఏ  పప్పూ ఉడకలేదు. సరే ఇప్పుడెవరో వాళ్ళే పిలిచి సహాయం చేస్తాము అని చెప్పారు కదా, ఇక ఎటువంటి ప్రాబ్లెం లేదు అనుకున్నాను. ఆ యాదమ్మ ఎవరో కాని వెతకాలి అనుకుంటుండగా ఒకామే నా దగ్గరకి వచ్చింది.ఇంతకు ముందు మీటింగులకి వచ్చిన ఆమె కాబట్టి పలకరించాను. ఆమెని అడిగాను యాదమ్మ ఎవరు అని. ఆమే యాదమ్మ ఇంటికి తీసుకుపోతా రా మేడం అని తీసుకెళ్ళింది. ఆ ఊర్లో సందులన్నీ తిప్పింది. బయటనుండి చూస్తే చిన్న ఊరిలా వుంది కాని పెద్దదే, ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెనక్కి వెళ్ళలాంటే ఊర్లో ఎక్కడికొచ్చానో అర్ధం కాకుండా చుట్టు చుట్టు తిప్పింది ఆవిడ. చివరిగా ఒక తాళం వేసి వున్న ఇంటికి తీసుకెళ్ళింది. అయ్యో ఇంత దూరం వచ్చాక ఆవిడ లేదే అని అనుకున్నాను. కానీ నాతో వచ్చిన ఆవిడ విచిత్రంగా ఆ ఇంటి బయట గ్రిల్స్ తలుపుకి వున్న తాళం తీసింది. అదేంటి ఇది మీ ఇల్లా? అని అడిగాను. కాదు యాదమ్మ ది అని చెప్పింది, అంటే మీరే యాదమ్మ నా? అని అడిగాను, కాదు తాళం నాకు ఇచ్చింది అని చెప్పింది. ఇదేంటో యాదమ్మకి నేనొస్తున్నానని తెలుసా?లెక ఎప్పుడూ తాళం మీకే ఇస్తుందా అని అడిగాను. ఆవిడ ఒక చూపు చూసి( నీ ప్రశ్నలతో చంపకే బాబూ అన్నట్లు) ఇక్కడే కూర్చో మేడం ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ధుమ్ముపట్టిన ఒక చెక్క కుర్చీ, కొన్ని ధాన్యం బస్తాలు వున్నాయి. ఇంకేమీ లేవు. ఇల్లంటా ధుమ్ము పట్టి వుంది. ఆ ఇంట్లో ఎవరూ కాపురం వుంటున్న సూచనలు లేవు. బయట వరండా ఇలా ధుమ్ము పేరుకొని వున్న ఇళ్ళు, అదీ పల్లెల్లో అసాధ్యం.అంతే కాదు ఈఒక్క గది కాదు తరువాత తలుపుకూడా తాళం వేసి వుంది. పల్లెల్లో ఎవరైన కాపురం వున్న ఇంటికి ఇన్ని తాళాళు పెట్టి పనికి వెళ్ళరు. సో ఈ ఇంట్లో ఎవరూ వుండటంలేదు అని నా మైండ్లో అంతా ఆలోచిస్తూ వున్నాను. అరగంటయింది ఎవరూ రాలేదు. యాదమ్మా రాలేదు, నన్ను అక్కడికి తెచ్చినమ్మా రాలేదు.అసలా వీధిలో ఎవరితో అయినా మాట్లాడదామంటే అక్కడ ఇళ్ళు ఎక్కువగా లేవు, వున్న ఇళ్ళల్లో ఎవరూ లేరు.అందరు పనికి వెళ్ళే టైము కదా నాకు ఇంకా అక్కడే ఎదురు చూడాలా వద్దా అర్ధం కాలేదు. ఈలోగా తాళం వేసి వున్న ఆ లోపల గదిలో ఎవో కొన్ని శబ్దాలు వినిపించాయి. నాకెందుకో ఆ లోపల ఎవరో వున్నారనిపించింది. ఆ శబ్దాలలో ఇందాక నాతో వచ్చిన ఆవిడ వున్నట్లనిపించింది.బహుశా వెనక తలుపు నుండి వచ్చారేమో అని ఇంకాసేపు ఎదురు చూశాను.ఎవరూ బయటికి రాలేదు. ఇంతలో ఒక 8-9 సంవత్సరాల అబ్బాయి అక్కడికి వచ్చి ఎదురింటి దగ్గర కూర్చున్నాడు. మనుషులెవరైనా కనిపిస్తే చాలని ఎదురుచూస్తున్నానేమో వెంటనే బయటకెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళాను, ఆ పిల్లాడు నేను పిలుస్తుంటే సిగ్గు పడుతూ వెనక్కి పరిగెత్తటం మొదలు పెట్టాడు. నేను కూడా వాడి వెనక కాసేపు వెళ్ళాను. ఇక వాడు నాకు దొరకడని నాకు అర్ధం అయి మళ్ళీ వెనక్కొచ్చాను. కానీ ఈసారి ఆ ఇంట్లో ఒక మనిషి కూర్చొని వున్నాడు, ఆ తాళం వేసి వున్న తలుపు తాళం తీసి వుంది, అతను చాలా సన్నగా ఎదో తేడా గా వున్నాడు. ఇందాక లేని ఇంకో కుర్చీ ఎక్కడనుండి వచ్చిందో, ఇతనెక్కడినుండి వచ్చాడో నాకు అర్ధం కాలేదు. నేను లోపలికి వెళ్ళాలో లేక వెళ్ళిపోవాలో కూడా అర్ధం కాలేదు. వెళ్ళిపోతే చెప్పకుండా వెళ్ళినట్లుంటుందని లోపలికి వెళ్ళి అతనితో "ఏవండీ యాదమ్మ ని కలవాలని వచ్చాను...నా పేరు..." అని చెప్పబోయేంతలో అతను "తెలుసు, రా లోపలికి వచ్చి కూర్చో" అన్నాడు. నా పేరు తెలుశా లేక నేను వచ్చిన కారణం తెలుసా అని ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను.

(కాస్త టెన్షన్ పడండి ఒక వారం...అప్పటివరకు విరామం!!)