Tuesday, June 28, 2011

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే ......


వెర్రోడి పెళ్ళాం ఊరందరికి వదిన అని సామెత. గవర్నమెంట్ వుద్యోగులు అంటే చాలు అందరూ తిట్టేస్తారు. కాని నిజానికి వాళ్ళకి చాలా పని వుంటుంది. నేను ఎక్కువగా చూసేది కలెక్టర్స్ ని, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, వివిధ డిపార్ట్ మెంట్ హెడ్స్ ని. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చాక అనిపించింది, ఎందుకని కలెక్టర్ల గురించి ఒక పోస్ట్ రాయకూడదు అని. అక్కడికి నాకేదో వందలమంది కలెక్టర్లు తెలుసని కాదు. కాని తెలిసిన వారిలో కొందరి మీద కొన్ని అభిప్రాయాలు వున్నాయి. అవి మీతో పంచుకోవాలని ఈ పోస్ట్.

నేను వుద్యోగం జాయిన్ అయిన కొత్తలో నాకు తెలిసిన మొట్టమొదటి కలెక్టర్ గారు జవహర్ రెడ్డి గారు. కలెక్టర్ అంటే నాకు మొదట గుర్తొచ్చేది అతనే. నన్ను ఇంటర్వ్యూ చేసిన బోర్డ్ లో అతను కూడా వున్నారు, ఇంత స్మార్ట్ గా వున్నారు కదా ఒక ప్రశ్న అయిన అడుగుతారేమో అని ఎదురు చూశా, అతను అలా చూస్తునే వున్నారు కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.పుట్టడమే కలెక్టర్ హోదాలో పుట్టారా అన్నట్లు వుంటారు. ఎంతో డిగ్నిఫైడ్ గా ఎక్కడా ఏమాటలో, భావంలో చూసినా ఒక డిగ్నిటీ కనిపిస్తుంది. అసలు అతను మాట్లాడుతుంటే అలాగే వినాలనిపించేది. నేనైతే అతన్ని అలా చూస్తూ నేను ఎందుకు కలెక్టర్ కాలేదా అని, అసలు ఐ.ఎ.ఎస్ అయితే అలాంటి డిగ్నిటీ వస్తుందేమో అనుకునేదాన్ని.

కాని ఆ అభిప్రాయం ఎక్కువ కాలం నిలబడలేదు. కొందరు ఐ.ఎ.ఎస్ లను చూసినతరువాత చదువు, పదవి, పొజిషన్ కాదు ఒక మనిషి ఏమి నేర్చుకున్నాడు అని కాదు నేర్చుకున్నదానిని ఎంత బాగా సంధర్భానికి అన్వయిస్తున్నాడు అనేదాన్ని బట్టి వుంటుంది. అందరు కలెక్టర్లు డైరెక్ట్ ఐ.ఎ.ఎస్ లు కాదు. కొందరు కర్ఫర్డ్. వాళ్ళల్లో కొందరికి వారు ఎక్కువకాలం పనిచేసిన డిపార్ట్మెంట్ వాసనలు ఎప్పటికి పోవు, కాని కొందరు అనుభవం తో వచ్చిన ఙ్ఞానం ఎలా అయినా గొప్పది అనిపించేలా వుంటారు.

జవహర్ రెడ్డి గారి తరువాత నాకు అంత బాగా నచ్చిన కలెక్టరు ప్రస్తుతం మా మెదక్ కలెక్టర్ సురేష్ కుమార్ గారు, తమిళాయన కాని ముద్దు ముద్దు గా అయినా చాల అనర్గళంగా తెలుగు మాట్లాడతారు. మాటల కంటే కూడా సమయం వేస్ట్ చెయ్యకుండా చాలా ఆర్గనైజ్డ్ గా పని చేస్తుంటారు. అసలు మెదక్ జిల్లా ఏదో అదృష్టం చేసుకుంది ప్రస్తుతం వున్న ఆఫీసర్లు అందరూ చాలా బాగా పనిచేస్తారు. మనం ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమీ పని చెయ్యరు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అనుకుంటాము. కాని ఎవరో కొందరు తప్ప అందరూ చాలా మంచి వాళ్ళు వుంటారు. (అటునుండి ఇటు కూడా అయ్యుండ వచ్చు) కాని ఎవరికైనా సరే వుదయం 6 నుండి రాత్రి కనీసం 10 వరకు తల తిప్పుకోడానికి వీలుకాని పని వుంటుంది. నేను ఎప్పుడైనా వుదయాన్నే 6, 7 కి కేంప్ ఆఫీస్ కి వెళ్ళినా, రాత్రి 10 కి అలా కలిసినా నాకు వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది. వాళ్ళకంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వారి పేషిలో పని చేసే వారి మీద చాలా జాలి. ( మా ఇంట్లో వాళ్ళు నన్ను అచ్చేసి వదిలేశారనుకోండి).నా తరువాత ఇంకా వాళ్ళకి చాలా మందితో మాట్లాడాల్సిన వాళ్ళుంటారు. అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, బుద్ధిగా రాసుకుంటారు, వింటారు, సలహాలిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్డర్స్ ఇస్తారు, ఇలా క్షణాలలో చాలా ప్రోసెస్ జరగాలి మెదడులో.

అసలు నాకు అందరికంటే ఇష్టం అయిన కలెక్టర్ ఎందరికో ఆదర్శం అయిన కలెక్టర్, ప్రస్తుతం ఎస్.ఇ.ఆర్.పి కి పి.డి అయిన రాజశేకర్ గారు. అతని పేరు చెప్తే తెలియని వాళ్ళు వుండరు. అంత మంచి పేరుంది. నేను అయితే అతనికి అదౄశ్య అభిమానిని. ఎందుకంటే ఎప్పుడు కలిసి పని చెయ్యలేదు, కనీసం చూడలేదు కాని అతనంటే చాలా చాలా ఇష్టం. నా దురదృస్టం నేను అతన్ని కనీసం చూడగలగటం ఎప్పుదు క్షణాల తేడాలో మిస్ అయిపోతాను. మొదట అతని గొప్పతనం విని పెద్ద అభిమాని అయిపోయాను. మొదటసారి 1999 లో అతన్ని కలిసే అవకాశం వచ్చింది నన్ను అనంతపూర్ ఎక్స్ పోజర్ కి పంపినప్పుడు ఆయన అక్కడ వెలుగు పి.డి. అక్కడ 3 రోజులున్నా అతని క్లాస్ కూడా వుంది మాకు కాని ఏదో అర్జెంట్ పని వుందని ఇంకో పెద్దాయనతో ఆ సెషన్ జరిపించారు. అయినా సరే అతన్ని చూడాల్సిందే అని నేను పట్టు బట్టి తరువాత రోజు వెళ్ళిపోయే ముందు ఆఫీస్ కి వెళ్ళాము. కాని మేము వెళ్ళేసరికి అతను లంచ్ కి వెళ్ళారంట (టైము సాయంత్రం 4) ఇక మాకు టైము లేకపోయింది. తరువాత మళ్ళీ అతన్ని కలిసే అవకాశం 2004 లో వచ్చింది, అప్పుడు అతను నెల్లూరు కలెక్టర్. సునామీ ప్రాజెక్ట్ లో నాకు నెల్లూరు పోస్టింగ్. మా కేర్ వాళ్ళందరు అతనితో కలిసి సర్వే కూడా చేశారు. ఇక నేను కలిసి పని చెయ్యబోతున్నా అనుకుని సంతోషించా. కాని నేను జాయిన్ అయిన రెండ్రోజులకి అతను రిలీవ్ అయిపోయారు. కనీసం చూడలేకపోయా. మొన్న పని కట్టుకొని హైదరబాదు లో ఎస్.ఇ.ఆర్.పి ఆఫీస్ కి అతన్ని కలవాలని వెళ్ళాను. వేరే పనులు కూడా వున్నాయిలెండి. ఆరోజు సార్ కేంప్ కి వెళ్ళారు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ విషయం తెలిసిన చాలా మంది నన్ను ఎగతాళి కూడా చేస్తుంటారు. నేను అడుగుపెడితే రాజశేకర్ గారికి ట్రాన్స్ఫర్ అని.జీవితంలో ఒకసారన్నా కలిసి........ఏమి చెప్పాలి? ఏమో నాకు ఒక ప్లాన్ అని ఏమీ లేదు. కొందరు ప్రమోషన్లు మీద మినిష్టర్స్ కి సెక్రటరీ గా వెళ్ళిపోతారు, వారికి ఇన్ ఫ్లుఎన్స్ వుంటుంది కాని పనిలో ఏమాత్రం సంతృప్తి వుంటుందని ఈ సారి అడిగి చూస్తా కన్నబాబు గారిని, అమరేంద్ర గారిని.

నేను చెప్పేది ఏంటి అంటే ఒక్క కలెక్టర్లే కాదు చాలా మంది ముఖ్యమైన పొజిషన్లో వున్న ఎందరో గొప్ప వ్యక్తులున్నారు. మా అదిలాబాద్ జె.సి స్యామ్యూల్ ఆనంద్ గారు, మొదట అతన్ని కలిసి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే అతను చేతులతో మొహం తుడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఆడుకుంటుంటూ వుంటారు.కోపం తో మనం బయటికి వచ్చిన తరువాత గేట్ దాటేలోపల మన పని మొదలయిపోతుంది. అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. మనిషిని చూసి అపార్ధం చేసుకోకూడదు అని అతని పని చూస్తే తెలుస్తుంది.ఇక విజయకుమార్ గారు, గిరిజా శంకర్ గారు వంటి వాళ్ళతో ఒకసారి పరిచయం వారి పని తీరు చూశాక ఆ జాబ్ వదిలేసినా, ఎక్కడికెళ్ళినా ఆ బంధం కొనసాగుతుంది. కొందరు కొత్త ఐ.ఎ.ఎస్. టాపర్స్ ముత్యాల రాజు లాంటి వారు వుంటారు వాళ్ళకి కొంత కాలం అయ్యే వరకు ఒక స్టైల్ అంటూ రాదు.కొంత డక్కాముక్కీలు తిన్నాక వారిదంటూ ఒక ప్రత్యేక స్టైల్ వస్తుంది,నేను మొదట్లో చూసిన సంజయ్ జాజు గారికీ ఇప్పటి కీ చాలా తేడా వచ్చింది.

నాకేమనిపిస్తుందంటే కాస్త యంగ్ గా వున్న ఆఫీసర్స్ ని వుంచాలి. కాస్త ఏజ్ అయిన తరువాత పెద్దగా నిర్ణయాలు స్పీడ్ అవసరం లేని పదవుల్లో వెయ్యాలి. 90% మందికి కొంత వయసొచ్చక స్పీడ్ తగ్గి పోతుంది, అది మెచ్యూరిటీ అనుకోవాలేమో!. కాని కొందరికి అసలు పనిలో ఎప్పటికీ వయసవ్వదేమో!!వుదాహరణకి ప్రస్తుతం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.(ఉపాది హామీ పధకం) డైరెక్టర్ మురళి గారు. అతను రోబో లాగా పని చేస్తుంటారు. నిజంగా అతని నడక, ఆఫీసులో లేదా మీటింగ్స్ లో అతని పని తీరు, మాట తీరు 10 సంవత్సరాలుగా కొంత కూడా స్పీడ్ తగ్గటం చూడలేదు. అసలు చాలా మంది పని తీరు ఎంత ఆర్గనైజ్డ్ గా వుంటుందో అసలు. నేను ఎవరిదగ్గరికైనా వెళ్ళే ముందు కొంత హోంవర్క్ చేస్తా, ఏమి విషయాలు మాట్లాడాలని పాయింట్స్ రాసుకోవటం, ఏది ముందు చెప్పాలి, ఏ విషయం కాస్త తరువాత చెప్పాలి వంటివి ముందే అనుకొని వెళ్తాను. కాని కొందరు నాకంటే బుద్ధిమంతులుంటారు. నాకున్న మతిమరుపుకి లేదా ఓవర్ కాంఫిడెన్స్ కి ఒక్కో సారి ఏదైనా మర్చిపోయానో అప్పుడే అది అడుగుతారు. చాలా వరకు మనతో మాట్లాడుతూ నోట్స్ రాసుకుంటారు, కొందరైతే పోయినసారి రాసుకున్న పేజ్ కరెక్ట్ గా తీసి ప్రస్తుతం స్టేటస్ గురించి ఆ సంబందించిన అఫీషియల్స్ ని అడుగుతారు. చాలా నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు.

అందరు మంచి వాళ్ళే అని పొగిడేస్తుంది...ఈమె మరీ ఓవర్ అనుకుంటున్నారా. అసలు వేరే రకం వాళ్ళని చూడలేదా ఆఫీసర్లలో అంటే చూశాను. కాని నాకు చెడు గుర్తుచేసుకోవటం కూడా ఇష్టం వుండదు. వ్యవస్థ లో లోపాలు అందరూ ఎలాగు చూస్తున్నారు. ఇలా కష్టపడి పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం వున్న వారి గురించి మాట్లాడుకుంటే మంచిది, వాళ్ళ దగ్గర్ నేర్చుకోడానికి వుంటుంది, వారితో పని చేస్తే ఎంతో తృప్తి వుంటుంది.

రెండో రకం కూడా వున్నారు. విపరీతమైన బ్యూరోక్రసీ, ఆధిపత్యం చూపించుకోవటం, వచ్చిన వారి తో మర్యాద లేకుండా ప్రవర్తించడం, ఫైల్స్ మొహం మీద విసిరి కొట్టడం, తన క్రింద స్థాయి వాల్ల మీద అరవటం, పర్సనల్ గా నిందించటం,వ్యవస్థని తిట్టుకోవటం, అన్ని విషయాలలో తప్పులు వెతకడం, అనవసరమైన విషయాల పై శ్రద్ధ అసలు పని పక్కన పెట్టి నాయకుల వెంట మంచి పేరు కోసం ప్రమోషన్ల కోసం తిరిగుతూ పని ఎగ్గొట్టే వాళ్ళు, ఉద్యోగంలో స్థాయి పెరిగినా మెచ్యూరిటీ రాని వాళ్ళు.....ఇలా చాల పెద్ద లిస్ట్ వుంది. కాని అది అనవసరం.అనవసరం అంటే వాళ్ళగురించి చాలా అందరికీ తెలుసు. కాని ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళని చూస్తే అసలు వీరి గురించి ఎవరూ మాట్లాడరేంటి అనిపిస్తుంది. తినడానికి, నిద్రకి, సెలవులకి మనకి ఎన్నో సదుపాయాలుంటాయి. కాని వీరికి జీవితంలో టైము అన్నదే వుండదు, చేసే వాళ్ళకి గవర్నమెంటు లో చాలా చాలా పని వుంది. మన అందరికంటే మన ప్రభుత్వం పని ఎక్కువ, ప్రభుత్వం యొక్క అవుట్ రీచ్ ఎక్కువ. ప్రభావం ఎక్కువ.......సమస్యలు కూడా ఎక్కువే. పని చెయ్యని వాల్లకు అవకాశాలు ఎక్కువ, పని చేసే వాళ్ళకి పని, అడ్డంకులు చాలా ఎక్కువ.

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే తప్పక అభినందించండి.నేను ఒక పోస్ట్ లో రాసినట్లు బాస్ హ్యాండ్సం అని వారి పని వల్లనే అనిపిస్తుంది. హార్డ్ వర్కర్స్, స్మార్ట్ వర్కర్స్ ఇలా ఎందరో మహానుభావులు.....అందరికీ వందనాలు. మీరు పడుతున్న శ్రమ వల్లనే మాకు ఎన్నో పనులు జరుగుతున్నాయి.జీవితంలో ఒక్క మనిషికైనా ఉపయోగపడగలిగే తృప్తి వర్ణించలేనిది అటువంటిది మీ వుద్యోగం మీకిచ్చిన అవకాశం. ధన్యం ఆ జీవితం.

Friday, June 24, 2011

ఎందుకిలా అవుతుంది? నాకేమైంది?




నాగార్జున సాగర్ చూశానోచ్. మన నెహ్రు గారి పుణ్యం, ఎందరో వ్యక్తుల శ్రమ, మన దేశానికే గర్వకారణం అయిన బహుళార్ద సార్ధక ప్రాజెక్టు చూశాను. ఈ మద్య రెండ్రోజులు మాకు అక్కడే మీటింగ్ అయింది. సరే అంత పెద్ద డ్యాం దగ్గర ఏమి చూశావు అని మాత్రం అడకండి ఎందుకంటే అందులో పెద్దగా నీళ్ళు లేవు. సో బహుళార్ధం సార్ధకం అంతా సగం సగం పని చేస్తుంది. కాకపోతే కృష్ణ అంటే నలుపు అని చెప్పినట్లు నల్లటి కృష్ణ లో కాసేపు జలకాలాడాము, నీటి ప్రవాహంలో నున్నగా మారిన రాళ్ళు ఏరుకొని ఇంటికి మోసుకొని వచ్చాను. ఇప్పుడవి ఏమి చెయ్యాలో తెలియక అలా వుంచాను. ఏదో ఒక రోజు మా ఇల్లు మ్యూజియం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కడెక్కడనుండో తెచిన గవ్వలు, ఆల్చిప్పలు, రాళ్ళు, రప్పలు వున్నాయి.

సరే ఇక అసలు విషయానికి వస్తాను, అసలేమి జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి....ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే...నేను బ్లాగ్ లోకాన్ని సందర్శించి చాలా నెలలైంది. టైము వుంది కాని, ఏంటో ఎందుకు రాయలేకపోతున్నానో అర్ధం కావటం లేదు. ఎందుకు రాయలేకపోతున్నాను అని చెప్తూ రాయడానికి కొన్ని సార్లు ప్రయత్నించాను. కుదరలేదు. మీరే చెప్పండి నేను ఎందుకు రాయలేకపోతున్నాను?

నా పరిస్థితి, ఇంతకు ముందు నా ప్రపంచం, ఇప్పుడు పరిస్థితి ఇవన్నీ చూసి చెప్పండి. నేను ఏమి చేస్తె రాయగలను? ఏ పరిస్థితులవల్ల రాయలేకపోతున్నాను అని.

లేదా ఏదైన టాపిక్ రాద్దాము అంటే ఏమి రాయాలి తెలియటం లేదు. పిచ్చి పిచ్చి పిచ్చిగా....పిచ్చెక్కినట్లుంది.

మీకు ఎప్పుడైన ఇలాంటి పరిస్థితి వచ్చిందా? వస్తే ఏమి చేశారు? అవును మరి నువ్వు రాయకపోతే లోకానికి కనీసం మాకేమైనా నష్టమా అని అడగకండి...నేను నాకోసమే రాస్తుంటాను. రాయటంలో మనసులో భావాలు బయటకి వచ్చి, భావాలు అక్షరాలుగా ఘల్లు ఘల్లు మని నాట్యం చేస్తున్నట్లు, మల్లెలుగా రాసులు పోగైనట్లు, ఒక చక్కని తృప్తి వస్తుంది. ఇప్పుడు ఆ తృప్తి లేదు. కీ బోర్డ్ మీద చెయ్యి అలా ఆగిపోతుంది. మనసు ఆలోచనలు, భావాలు రాక, రాయలేక బాధపడుతుంది. ఎందుకిలా అవుతుంది? నాకేమైంది? (నీకు పిచ్చి పట్టింది, నువ్వు ప్రేమలో పడ్డావు లాంటి ఆన్సర్స్ ఇవ్వొద్దు ప్లీస్)

మీకు నేను రాసిన పోస్ట్లు ఏవైనా నచ్చితే....నిజంగ చెప్పండి, నేను ఎందుకు రాయలేకపోతున్నాను, ఎటువంటి ఆలొచనలు చేస్తె రాయగలుగుతాను. హైదరాబాదు వచ్చి, కొత్త జాబ్ లో జాయిన్ అయిన నుండి రాయలేకపోతున్న. నేను ఏమి చెయ్యలి?(జాబ్ మానేయ్, హైదరబాద్ వదిలేయాలి అంతేనా? అది కాదు కాని ఇంకో మాట చెప్పండి) మనసులో సౌకుమార్యం, స్పందన లేనితనం నాకెందుకు వచ్చింది? నేను బండలా ఎందుకు మారిపోతున్నాను?అంటే రాయలేని వాళ్ళందరూ బండలా అని కాదు, ఎవరి భావ వ్యక్తీకరణ కొసం వాళ్ళు చేసే పని వాళ్ళు చెయ్యలేకపోవటం వాళ్ళలో ఆ సున్నితత్వం పోవటం వల్ల జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది అని నా ఫ్రశ్న?

తిండి,నిద్ర, పని షాపింఘ్ అన్నీ చెయ్యగలుగుతున్నాను. కాని మనసు లో సంతోషం లేదు. ఏ పని కూడా మనసుని తాకటం లేదు. నేను చేస్తున్న జాబ్ లో ప్రయాణాలు ఎక్కువ. మెదక్, మెహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాలు తిరుగుతున్నాను. అక్కడ పనిలో ప్రకృతిలో కూడా సంతోషం లేదు. జీవం లేనట్లున్న మైళ్ళు కొలది రహదారిపొడుగునా వున్న ప్రదేశాలు,తెల్లగా దుమ్ము తో ఎండ వేడితో తేమ లేని గాలి మనసు లో తడి కూడా ఆరిపోయేలా చేస్తుందా? కలిసిన ప్రతి కుటుంబంలో వున్న కన్నీరు కాని, ఏమీ మార్చలేని వారి జీవితాలాలో బాధ కూడా కరిగించలేని ఈ ఖటినత్వం నాకెందుకొస్తుంది? మనిషి సంతోషంలోనే రాయగలడా? బాధ కూడా రాస్తాము కదా.......కాని మనసు కి బాధ కలిగినా రాయాలేకపోతున్న ఈ పరిస్థితి కి కారణం ఏమై వుంటుంది? మీకు ఏమైన అర్ధం అవుతుందా? ఐతె చెప్పరూ..........