Friday, March 25, 2011

మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?


హాండ్సం బాస్ వుండటం ఎంతవరకు వుపయోగమో నాకు తెలీదు కానీ, నేను గమనించలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు వున్న బాస్ లలో ముగ్గురు తప్ప అందరు హండ్సం బాస్ లే. నేను వాళ్ళ పనినే చూశాను కాని వాళ్ళు హాండ్సం గా వున్నారా అని పాపం అసలు పట్టించుకోలేదు. కాని మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయాక షాపింగ్ వెల్దామని అక్కడే వుంటున్న నా కాలేజి ఫ్రెండ్ ని హొటెల్ దగ్గరికి వచ్చి పిక్ అప్ చేసుకోమని చెప్పాను. తన పేరు రాధిక.

విజయవాడ లో మా ఆఫీసు వాళ్ళు ఏదో ఒక పనికిమాలిన మీటింగ్ పెట్టారు రెండ్రోజులు. పగలంతా వాయించేశారు. ఇక సరే హాయిగా సాయంత్రం రిలాక్స్ అవుదామంటే మా బాస్ ఎక్కడ మళ్ళీ ఇంటర్నల్ టీం మీటింగ్ అంటాడో అని అతనేదో పనిలో బిజీ గా వున్నప్పుడు చూసి, ప్రీతం నేను సాయంత్రం బయటకి వెళ్తున్నా మనకేమీ వేరే మీటింగ్ లేదు కదా అని అడిగాను. "హ హా నో శిరీష  యు కెన్ గో అబ్సు ల్యూట్లేఅ నో ప్రాబ్లెం" అని హామీ ఇచ్చేశాడు. హమ్మయ్య అని నా ఫ్రెండ్ కి అర్జెంట్ గా కార్ తీసుకొని వచ్చెయ్ అని చెప్పేసా. తను కూడా మళ్ళీ నా మనసెక్కడ మారిపోతుందో అని( పాపం పూర్వానుభవం) వెంటనే వచ్చేసి రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ కూర్చుంది. నేను మీటింగ్ అవ్వగానే, స్కూల్ పిల్లలు బడి గంట కొట్టగానే పరిగెత్తినట్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే మా ఇతర జిల్లాల స్టాఫ్,  కొలీగ్స్ ఓయ్ ఎక్కడికి పారిపోతున్నవ్ చాలా రోజులకు కలిశావు పద మన బాసులని తిట్టుకుందాం ప్రశాంతం గా నీ రూం లో అన్నారు. వాళ్ళకి నచ్చజెప్పి, షాపింగ్ అయ్యాక డిన్నర్ చేసి బలంగా తిట్టుకుందాం అని బరోసా ఇచ్చి రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రాధ ఎదురుచూస్తు కూర్చుని వుంది. తన దగ్గరకి వచ్చెలోపల నా టీం మెంబర్ దగ్గర నుండి కాల్ వచ్చింది ప్రీతం అర్జెంట్ గా ఇంటర్నల్ మీటింగ్ పెట్టాలన్నారు, మీ రూం లో పెడదామా, నా రూం లోనా అని. ఇదేంటి సడన్ గా అని నేను హోటల్ వదిలి చాలా టైం అయింది, నేను లేను, నా రూము లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసా. కానీ తీరా చూస్తే ఎదురుగా ప్రీతం వస్తూ కనిపిస్తున్నాడు. నన్ను చూస్తే మళ్ళీ దొరికిపోతా అని నా ఫ్రెండ్ కి చిన్న సైగ చేసి పక్కకి తప్పుకున్నా. రాధ నా సైగలు చూసి ఎవరి దగ్గర దాక్కుంటున్నానా అని చూసి ప్రీతం ని చూసింది.

తరువాత ఇద్దరం బయటకొచ్చేసాము. తన కార్ లో కూర్చున్నాక అడిగింది ఎందుకు దాక్కున్నావు అని. నేనేమి దాక్కోలేదు. మా బాస్ మళ్ళీ సడన్ గా మీటింగ్ అన్నారు, నేను హొటెల్ లో లేనని నీకోసం అబద్దం చెప్పాను కాని బాస్ ఎదురుగ వస్తుంటే, నన్ను చూస్తే నేను మీటింగ్ వెళ్ళిపోవాలి, పాపం నువ్వు బాధపడతావని అలా మానేజ్ చేసా అని చెప్పాను. అవునా ఐతే ఓ.కె. అని బయలుదేరాము. కాసేపాగి మీ బాస్ భలే హ్యాండ్సం గా వున్నాడు, యంగ్ షారుఖ్ ఖాన్ లాగా అని చెప్పింది. అదిగో అప్పటి నుండి ఆలోచిస్తున్నా. నాకు ప్రీతం లో షారుఖ్ ఖాన్ కనిపించలేదేంటబ్బా అని. అసలు ప్రీతం హ్యాండ్సం ఆ? ప్రీతం కంటే కూడా హ్యాండ్సం బాస్ లు ఇంతకు ముందు కూడా వున్నారు,కానీ నాకెప్పుడు ఎందుకు బాస్ హ్యాండ్సం గా అనిపించడు అని. అసలు బాసు లు ఎక్కడైనా హ్యాండ్సం గా వుంటారా? ఈ రాధ కి ఏమీ తెలీదు పిచ్చి ముఖం ది.

బాస్ అంటే ఎప్పుడు కనిపించేది ఒక్కటే పని రాక్షషుడా, టార్గెట్ రాక్షషుడా, టైము రాక్షషుడా, డిసిప్లిన్ రాక్షషుడా ఇలా ఆలోచనలే వస్తాయి. అసలు నాకు తెలిసి బాసులు రెండు రకాలు. మంచి బాసు, చెడ్డ బాసు. అది ఆడ అయినా మగ అయినా. నాకు ఇంతవరకు ఆడ బాసు రాలేదు. ఒకసారి వున్నా నేను తనకి డైరెక్ట్ రిపోర్టింగ్ కాదు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరికి. ఇక మిగిలిన వాళ్ళందరు గవర్నమెంట్ లో వున్నంత కాలం పి.డి లు, ఐ.ఎ.ఎస్ లు. వాళ్ళెప్పుడు హడావిడి గా టెన్షన్ గా వుంటారు. ఏ మినిస్టర్ కో, ఏ కలక్టర్ కో వీళ్ళతో పడదు సో నేను కూడా నా బాసు శత్రువులని నా శత్రువుగా భావించి వాళ్ళు పెట్టే సమస్యలని తప్పించుకోవటం ఎలా, టార్గెట్లు రీచ్ అవ్వటం ఎలా, ప్రొగ్రాం లో ఏ మాట పడకుండా మేమంతా బయట పడటం ఎలా అని సతమతం అవుతుండటం తో సరిపోయేది. ఈ గొడవలో బాస్ హ్యాండ్సం అవునా కాదా ఎవరికి పడుతుంది. మంచి వాడా కాదా, ఇతను చేసే పనులు ప్రజలకి వుపయోగమా కాదా అని ఆలోచన వస్తుంది.పని ఎప్పటికీ తెమలదు. అంత పని వుంటుంది.

ఇక ఎన్.జి.ఓ లో ఇక్కడ పని కంటే పద్ధతులు, ప్రొసీజర్ లు ఎక్కువ. చేసే పని టార్గెట్లు తక్కువే కాని లోతెక్కువ.అందరికి స్వేచ్చ ఎక్కువ కాబట్టి ఒక పని చెయ్యలంటే వంద మంది వంద రకాల తప్పులు చూపిస్తారు,వంద ఆలోచనలు వంద దారులు చూపిస్తారు. ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో అసలు చెయ్యాలో వద్దో అని సతమతం అవుతుంటాము. ప్రతీ ఒక్కరు చెప్పే దానిలో ఒక అర్ధం వుంటుంది. ఎంతో లెర్నింగ్ వుంటుంది. తక్కువ డబ్బు ని ఎంత బాగా ఎక్కువమందికి తక్కువ క్రిటిసిజం తో వుపయోగించాలో అని తల పగలగొట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో బాస్ హ్యాండ్సం అయితే ఎంత కాకపోతే ఎంత. విపరీతమైన టూరింగ్, ఇంటికి వస్తే బ్యాగు లో మాసిన బట్టలు తీసి మంచి బట్టలు పెట్టుకునే టైము మాత్రమే వుంటుంటే, మొగుడు, పిల్లలు, ఇల్లు, కాయగూరలు, పప్పు వుప్పు, పనమ్మాయి, పిల్లాడి పరీక్షలు వీటికే సమయం దొరకట్లేదు ఇక బాస్ హ్యాండ్సం గా ఎలా కనిపిస్తాడు. అతని ఫోన్ వస్తుంటే హమ్మో ఇంకేమి కొత్త పని వచ్చిందో లేక సమస్య వచ్చిందో అనే ఆలోచన మాత్రమే వస్తుంది.

ఇవి కాక మా పని లో ఎంతో స్త్రగుల్. కొన్ని కుటుంబాలలో జీవితాలలో కొంతైన సమస్యలు తీర్చగలిగితే చాలు అనిపించె వుద్యోగాలు. కాని ప్రొసీజర్లు పద్దతులు బ్యూరోక్రసీ మన మనసులో సున్నితత్వాన్ని నలిపేస్తుంటాయి. ఆ సమయంలో ప్రజల ప్రయోజనం కోసం పోరాడే బాసే హ్యండ్సం గా కనిపిస్తాడు. అది కూడా.. ఆ పని, ఆ ప్రజలు మన వాళ్ళు అని ఫీల్ అవుతున్న కొలదీ, బాసు, వుద్యోగులు కలిసి ఆ పని మనది అనుకున్నప్పుడు ఒక రకమైన "మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక అందం ఒక అంశమే కాదు" మన అమ్మ, నాన్న మనకి అందం గా కనిపించరా? అలాగే మన టీం అనుకుంటే వారిలో బలం, బలహీనత మనదే, వారి అందం మన పనికి, విజయానికి, అపజయానికి ఎటువంటి వుపయోగం లేదు, అవసరం లేదు.

నాకు తెలిసి వుద్యోగం లో, పనిలో విపరీతమైన ఒత్తిడిలో ఏదో చెయ్యలనే తపనలో నలిగి పోతున్న వాళ్ళందరికీ మన పనిలో పరిచయాలు కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమె కనిపిస్తాయి అనుకుంటా. నాకు తెలిసి ఎవరైన  నా బాసుల గురించి చెప్పమంటే మొదటి బాసు...గిరిజనుల కోసం వారి ప్రాచీన సంస్కృతి కోసం తపన పడే పెద్దాయన గౌతం శంకర్, నేను ఎప్పటికైన అతని లా ఒక కాజ్ కోసం జీవితం అంకితం చెయ్యగలనా అనిపిస్తుంది. రెండవ బాస్ గిరిజా శంకర్....నడుస్తున్న ఆరాటం, తన పరిధిలో తనకి వీలయ్యేంత మార్పు తీసుకురావాలనుకునే తపన తో బొంగరంలా పరిగెడుతుండే మనిషి. ఇక ఆ తరువాత కూడా కొందరు మంచి బాసులు, ఏదో లే టైము గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, వున్న పదవిని దుర్వినియోగం చేసిన వాళ్ళు, విపరీతంగా పని చేసే వాళ్ళు, రాత్రి పగలు మరిచి పని చేస్తున్నా పక్క వారి గురించి పట్టించుకునే వాళ్ళు, ఆఫీస్ అటెండర్ ఇంట్లో అవసరాలని కూడా కనిపెట్టి కనుక్కునే వాళ్ళు, తను టెన్షన్ పడుతూ అందరిని టెన్షన్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళు, ఎంత పెద్ద సమస్య అయినా, టెన్షన్ అయినా తనే తీసుకొని మనకి మార్గం చూపించి పని జరిపించే వాళ్ళు, తన టీం మీద విపరీతమైన మమకారం వున్న వాళ్ళు, తన టీం ని బయపెట్టి పని జరిగేలా చేసుకొని పదోన్నతి పొందటమే జీవితాశయం అయిన వాళ్ళు, ప్రజల కి, తన టీం కి అండగా నిలబడి వారి మీద నమ్మకమే తన మేనేజ్మెంట్ తరహా గా చూపించే వాళ్ళు


ఇలా ఎంతో మంది బాసులు. విపరీతమైన మంచి చూశాను, విపరీతమైన చెడు చూశాను. కానీ ఎవరూ కూడా (జీవితంలో ఏ మనిషి కూడా) అన్ని విషయాలలో చెడు కాదు, అన్నివిషయాలలో మంచి కాదు. అందరికీ మంచి వారు కాదు, అలా అని అందరికి చెడ్డవారు కాదు. ఎన్నో రకాల అందాలు, వికారాలు చూసాను. యె బాస్ హ్యాండ్సం అంటే ఏమి చెప్పాలి. ఒక్కో బాస్ లో ఒక్కో అందం. ప్రతీ బాసు కి ఇంకో అందమైనా లేద వికారమైన బాసు వుంటారు.

అసలు విషయం మరిచిపోయా...బాసులని తిట్టుకోవటం అనేది మన జన్మ హక్కు. అంతే కాని ప్రీతం మంచివాడని తిట్టుకోవటం మాత్రం మానేయం. మరి మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?

Monday, November 29, 2010

తూ.గో.జి. వారికి ఒక విఙ్ఞప్తి

తూర్పు గోదావరి జిల్లా బ్లాగర్స్ కి ఒక విఙ్ఞప్తి, నేను ఒక క్విజ్ కార్యక్రమం చేయబోతున్నాను. అందులో తూర్పు గోదావరి కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలి. నాకంటే మీ జిల్లాకి సంబంధించిన సమాచారం మీ అందరి దగ్గర బాగా వుంటుంది. కాబట్టి దయచేసి తూర్పు గోదావరి జిల్లాకి సంబందించి ఏవైనా ప్రశ్నలు వుంటే రేపు ఎల్లుండిలోపల నాకు పంపండి. మరీ కష్టమైనవి కాకుండా మరీ అందరికీ తెలిసేవి కాకుండా వుంటే బాగుంటాయి.

మీ సహాయానికి కృతఙ్ఞతలు.

Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.

Monday, November 8, 2010

మిస్ యు ఆల్.

హలో,


గుర్తున్నానా?? అంతర్జాలాన్ని చాలా మిస్ అవుతున్నాను. మొత్తానికి హైదరాబాదులో వచ్చి పడ్డాను. ఇక్కడి ట్రాఫిక్, పొల్యూషన్, హడావుడి, సిటీ బస్సులకు, ఆటో మీటరుకి ఇంకా అలవాటు పడలేదు. ఐనా ఇంత చలేంటండీ బాబు. మా నెల్లూరులో 5 యేళ్ళూ ఎప్పుడు కనీసం దుప్పటి కూడా కప్పుకోలేదు. ఇక్కడ పగలు కూడా ఫుల్ గా ముసుగే. మా బాబు కి స్కూల్ వెతికేసరికి నాకు మొత్తం మన విద్యా వ్యవస్థ మీద విరక్తి వచ్చేసింది.

ఏంటీ అన్నీ నెగెటివే చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేమీ లేదు. ఇక్కడ చాలా మంది బంధువులు, స్నేహితులు నాకు దగ్గరలో వున్నారు. అన్నిటికంటే ముఖ్యం ఇంట్లో ఎక్కువ టైము గడుపుతున్నాను. అంతే కాదండోయ్ మంచి కలర్ వచ్చేస్తున్నాను. (బాగా వండుకొని తింటున్నా కదా మరి).


ఇలా మంచి చెడ్డలు, కష్టసుఖాల తో బాగానే వున్నను. ఇంట్లోనే ఆఫీసు. కానీ ఇంక సెట్ కావాలి. ఇంటెర్నెట్ కనెక్షన్ ఇంకా పెట్టలేదు. వరుసగా పండగలు, వర్షాలు తో సెలవులు కదా!అందుకే మీరంతా బతికిపోయారు. అలా అని ఇలాగే సుఖంగా వుంటాము అనుకోవద్దు. నేను త్వరలో ఒక పెద్ద టపా తో వచ్చేస్తున్నా...కాసుకోండి.

బట్ ఐ మిస్ ద బ్లాగ్ వర్ల్డ్. మిస్ యు ఆల్.

Monday, September 27, 2010

సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా?

ధర్మం, ఈ మాట ఒక్కోసారి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా! ఇది మంచి ఇది చెడు అని అసలు ఎవరు నిర్ణయించారు.ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చెప్పినవే ఇప్పటికీ ధర్మాలా/నీతులా? ధర్మమ ఎప్పటికీ మారదా?మరి మన పురాణాలలో ఎప్పుడు ఎవరికి ఎలా కావలిస్తే అలా మార్చేసుకొని అదే ధర్మం అని చెప్పుకుంటూ వచ్చారే! అమ్మా తల్లీ నీకెందుకీ ధర్మ సందేహాలు మాకెందుకీ నీతి బోధలు అనుకుంటున్నారా? ఏమో బాబు నాకు అప్పుడప్పుడు ఇలాంటి ధర్మ సందేహాలు వస్తూ వుంటాయి. ఎవరిని అడగాలో అర్ధం కాదు. నాకు తెలిసిన విధంగా నాకు నేనే నా సందేహాలకు సమాధానాలు చెప్పేసుకుంటుంటాను. అలాగే ఒకానొక సమయంలో నాకు ఒక ధర్మ సందేహం కలిగింది. ఒకటేమిటీ చాలానే కలిగాయి ఆ విషయంలో. ఫ్యాక్షనిస్టుని పెళ్ళిచేసుకోవచ్చా? అనీ.పోనీ పెళ్లి చేసుకోకపోతేనేమి ప్రేమించ వచ్చా అనీ, ప్రేమిస్తే పెళ్ళిచేసుకోవాలా అనీ, అసలు ప్రేమించిన వానితో పోలిస్తే జీవితంలో మిగిలిన కష్టాలన్నీ చిన్నవి కాదా అనీ. అసలు ఇది ఒక ధర్మ సందేహమా, కొన్ని పేజీల ధర్మ సందేహాలా అని మీకు కూడా ధర్మ సందేహం వచ్చి వుండాలే ఈ పాటికి . వచ్చిన రాకపోయినా మీ ధర్మ సందేహం తీర్చడం ఒక బాద్యత కల భారత బ్లాగర్ గా నా ధర్మం....ఇక చదివి మీ ధర్మ సందేహాలు తీర్చుకోండి....


పని లేని మంగలి పిల్లి తల గొరిగాడంట, ఆ సామెత విన్నప్పుడంతా మరీ అంత పిచ్చి పని ఎవరైనా చేస్తారా అనుకున్నాను. కానీ నేను అదే చేసాను కొన్నాళ్ళ క్రితం. పెద్దగా పనిలేక టి.వి లో అదేదో బాలకృష్ణ సినిమాలు, చిరంజీవి సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఇస్తే చూశాను. కంటిచూపుతో చంపేయటాలు, ట్రైన్ ని ఆపేయడాలు, ఎవరెవరో వచ్చి అన్నా అని కాళ్ళకు దండాలు పెట్టేయడాలు చూస్తుంటే విపరీతమగా ఫీలయిపోయాను.నా జీవితం తో ఆడుకున్న సినిమాలు అవి. అదెలాగో తెలియాలంటే నాతో పాటు మీరు 1999 వ సంవత్సరం కి రావాలి.

అప్పట్లో శిరీష ఒక పసికందు(మానసికంగా పసిపిల్ల అని చెప్పడానికి అలా చెప్పా)ఎప్పుడు చూసినా ఫ్రెండ్సు, సినిమాలు, షికార్లు,జోకులు ఇవే తెలుసు. కుటుంబం అంటే అందరు కలిసి బోజనాలు చేస్తారని,పండగలు చేసుకుంటారని, టూర్లకి వెళ్తారని మాత్రమే తెలుసిన రోజులు. అటువంటి నాకు ఒక కొత్త ప్రపంచం చూపించాడు ది గ్రేట్ వెంకటేశ్వర రెడ్డి, అప్పటి నా కొలీగ్. కుటుంబం లో వాళ్ళు కలిసి మర్డర్ ప్లానింగ్ చెయ్యడం, ఊర్లో వాళ్ళు దానికి సహాయపడటం, ఒక వైపు మనిషి చనిపోతే ఊర్లో అందరు తమ ఇంట్లో మనిషి చనిపోయినట్లు ఆవేశపడటం, అవతలి వైపు వారి ఇళ్ళల్లో వాళ్ళని లాక్కొని వచ్చి చంపేయటం, ఇళ్ళకు, పండిన పత్తి కి నిప్పు అంటించెయ్యటం, మగవాళ్ళందరు ఊరొదిలి పారిపోయి అడవుల్లో దాక్కోవటం, ఆడవాళ్ళు కూడా ఊరొదిలి బంధువుల ఇళ్ళకి పోవటం, పోలీసులు సంవత్సరాలు తరబడి ఊర్లో కర్ఫ్యూ పెట్టడం,వున్న ఒకటి, రెండు ఇళ్ళ వాళ్ళని పోలీసులు కష్టాలు పెట్టడం.....ఈ మద్యలో కొన్ని ప్రేమ జంటల జీవితాలు, కుదిరిన పెళ్ళిళ్ళు, చదువుతున్న చదువులు అన్ని ఆగిపోయి జీవితాలు తలక్రిందులైపోవటం అనే కధలు చెప్పాడు. ఇదంతా వెంకటేశ్వర రెడ్డీ వాళ్ళ ఊరు చిందుకూరు (నంద్యాల దగ్గర) కధ. ఈ కధ అంతా నా ఒక్క దానికే కాదు మా టీం లో అందరికీ చెప్పాడు రెడ్డి. అందరూ  ఆశ్చర్యపోతూ, భయపడుతూ వింటుంటే నేను మాత్రం రెడ్డీ ని ఆరాధనగా చూస్తూ వినేదాన్ని. మాతో పాటు సామాన్యమైన మనిషిలా తిరుగుతూ, బోజనం చేస్తూ, ఆడుతూ పాడుతూ ఉన్న ఈ రెడ్డీ నిజానికి ఒక సమర సింహా రెడ్డి అయివుంటాడని, అఙ్ఞాతంలో వున్న ఇంద్రసేనా రెడ్డి అయివుంటాడని అనుకునేదాన్ని. ఒంటి చేత్తో ట్రైను ఆపేసే శక్తిమంతుడయి వుంటాడని, కంటి చూపుతో ప్రాణాలు తీసేసే పవర్ ఫుల్ మనిషి అయి వుంటాడని అనుకునేదాన్ని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తనికెళ్ళ భరణి లా మా ఆఫీసు కి వచ్చి అన్నా, రెడ్డన్నా అని మా రెడ్డి కాళ్ళ మీద పడిపోతాడనీ, ఎక్కడో ఏదో ఒక గుడిలో అనుకోకుండా ఒక జంట ఒక పసిపిల్లాడితో వచ్చి రెడ్డన్నా..ఏమై పోయావన్నా, అని కన్నీరు పెట్టుకొని ఆ పసిబిడ్డని రెడ్డి కాళ్ళమీద పెట్టేసి అన్నా ఈ బిడ్డ నీ దయవల్ల కలిగాడు(డబల్ మీనింగ్ ఏమీలేదు) వీడికి నీ పేరే పెట్టాము, నీ చేత్తో ఒక బంగారు గొలుసు ఇయ్యన్నా అంటారని ఆశపడి రెడ్డి ఎక్కడికెళ్ళినా వెనకే తిరిగేదాన్ని అలాంటి సీన్ మిస్ అయిపోకూడదని. ఏదో ఒక బస్ స్టాండులో సడన్ గా రెడ్డి మీద ఎవరైనా విలన్స్ అటాక్ చేస్తారేమో అని చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించేదాన్ని.

అంత జాగ్రత్తగా, అపూర్వంగా రెడ్దిని చూసుకుంటున్న రోజుల్లో ఇంకా అధ్భుతమైన విషయం చెప్పాడు. ఈ ఫాక్షన్ కధలో మరుగున పడిపోయిన ఒక విషాదభరితమైన ప్రేమ కధ. అది ఎవరిదో కాదు, మీరు మరీను అసలు సినిమాల్లో ప్రేమ కధలు,ఫ్లాష్ బ్యాక్ లు ఎవరికి వుంటాయి ఆ మాత్రం తెలుసుకోలేరా? ఆ... అదే హీరో కే.అంటే సమర సింహారెడ్డికే, ఇంద్రసేనా రెడ్డికే. అంటే వెంకటేశ్వర రెడ్డికే. అది కూడా పసివాడుగా వున్న సమరసింహా రెడ్డి గుణగణాలను ముందే ఊహించి అతనికోసమె ఆడపిల్లని కన్నారు ఆ ఊరి ఫాక్షన్ పార్టీ ఒక వైపు పెద్ద గారు. మన హీరో కూడా చిన్నప్పటి నుండే ఆమెతో మొగుడు పెళ్ళాలాట ఆడటం మొదలు పెట్టాడు.(నిజంగా పూర్తి ఆట ఆడితే తోలు తీస్తారు అక్కడ అందుకని కనిపించిన వాళ్ళందరికి ఆమె నా పెళ్ళాం అని చెప్పుకోవడం, ఆమె కాలేజి కెళ్ళినా,గుడికెళ్ళినా కాపల కాయడం లాంటి బాధ్యత గల పనులు మాత్రం చేసేవాడు) ఇలా పిల్లలు ముదురు వేషాలేస్తున్న సమయంలో జరిగింది ఆ ఊర్లో మొదటి ఫాక్షన్ హత్య. ఆ అమ్మాయి వాళ్ళ చిన్నాన్న ని అటువైపు వాళ్ళు ప్లాన్ వేసి పక్క ఊరికి పనిమీద పూజారి గారింటికెళ్తే వారితో కుమ్మక్కై కత్తులు కొడవళ్ళతో ముక్కలు గా నరికేశారు.అది జరిగిన అరగంటలో ఊరు అల్లకల్లోలం అయిపోయింది.ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎవరిని చంపుతున్నారో,ఎవరిళ్ళు తగలబెడుతున్నారో తెలీకుండా ప్రవర్తించారు.పోలీసులకి తెలిసి వచ్చే లోపల మగవాళ్ళు అందరూ పారిపోయారు.అడవులు పట్టుకొని తిరిగారు.అక్కడితో అయిపోలేదు. చనిపోయినతని భార్య శపదం పట్టింది నా భర్త కి ఆపోజిట్ మనిషి తాలూక వాడి రక్తంతో బొట్టుపెట్టి తరువాతే భర్తకి పిండం పెడతా అని. అలాగే ప్లాన్ చేసి బాంబు పెట్టి అతను వెళ్తున్న కారు పేల్చి అతన్ని ఇంట్కి లాక్కొచ్చి నరికించింది ఒక సంవత్సరంలో. కానీ ఈలోగా అవతలి వాళ్ళు కూడా ఊరుకోలేదు. మన హీరోయిన్ ఇంట్లో దొరికిన వాళ్ళని బంధువులని కూడా చంపారు. హీరోయిన్ అక్క భర్త పాపం ఎక్కడో కర్నూలు లో లాయర్ అయితే ఏసంబంధం లేని అతన్ని కూడా చంపేసారు. ఊర్లో అందరిమీదా పోలీసు కేసులు పెట్టారు.ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున అందరిని జైల్లో పెట్టరు. ఇటువంటి సమయంలో వెంకటేశ్వర రెడ్డీ తల్లిదండ్రులు ఆ సంబంధం చేసుకుని కొడుకుని బలి ఇవ్వలేము అని రెడ్డిని ఊరొదిలి ఎక్కడో దూరంగా వుండు అని పంపేసారు. ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళి అయిపోయింది. అలా అజ్ఞాతవాసం చేస్తూ వచ్చాడు రెడ్డి శ్రికాకుళానికి.

ఈ కధ విని బుర్ర వున్న అడ్డగాడిద ఎవరైనా సరే చచ్చినా ఆ ఊరితో కానీ, ఆ మనిషి తో కాని సంభంధం వద్దురా అని దూరం పారిపోతారు.మరి నేను బుర్ర లేని అడ్డగాడిదని కదా అందుకని రెడ్డిని ఇంకా ఇంకా ఆరాధన చూపులు చూడటం మొదలుపెట్టాను. ఫ్లాష్ బ్యాక్ లో పల్లెటూరి హీరోయిన్ అడ్డంకూడా తొలగిపోయింది కాబట్టి,నేనే ఇక ఈ కధలో నవ హీరోఇన్ అనుకుని ఫిక్స్ అయిపోయా, ఈ సమర సింహా రెడ్డి నాకే సొంతం అని డ్యూయెట్లు వేసేసుకున్నా. అసలు మా కుటుంబం లో ఎవరూ ఇంతవరకు కనీసం మర్డర్ స్పెల్లింగ్ కూడా సరిగా రాయలేరు, కానీ రెడ్డిని ఎన్ని మర్డర్లో చూసిన అనుభవం వుంది. మా వాళ్ళు ఎవరైన గట్టిగా మాట్లాడితే భయపడిపోతారు కానీ రెడ్డి వందమందితో అయినా డిషుం డిషుం అని ఫైటింగ్ చేసేస్తాడు, మా డాడీ మహా అయితే నాకు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తెస్తారు, వాడితో నేను అమెరికా వెళ్ళి అంట్లు తోమాలి అందరిలా కాకుండా మెషిన్లో తోమాలి అంతే తేడా.అదే ఈ ఫాక్షన్ హీరో ని చేసుకుంటే ...."నేను ఒక పెద్ద కుంకుమ బొట్టు తో, కాస్త కష్టమైన రోజూ ఇంట్లో కూడా కంచిపట్టు చీర కట్టుకొని, రెడ్డి ఏమో వైట్ అండ్ వైట్ పంచెకట్టు తో మేమిద్దరం పేదలకి బట్టలు పంచుతూ, పిల్లలికి పుస్తకాలు పంచుతూ.."అలాంటి డ్రీంస్ వేసుకున్నా. ఒక్క సారి ఊహించండి సమర సిం హా రెడ్డీ నో, ఇంద్రసేనా రెడ్డీ నో పెళ్ళిచేసుకుంటే ఎలా వుంటుందో!! (ఒక అమ్మాయి ఏంగిల్ నుండి ఆలోచించండి) నేను కూడా అలాంటి కలలే కన్నాను. టాటా సుమోలు, కడప బాంబులు, తొడకొట్టడాలు, కంటిచూపుతోనే రౌడీలను చంపేసేంత ధైర్యవంతుడు లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత ధైర్యంగా వుంటుంది కదా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఎవరితో చిన్న గొడవైతే వాళ్ళ కొంపలేదో మునిగిపోతాయి అన్నట్లు భయపడుతూ బతుకుతుంటారు, సో నాకు కూడా పెద్దగా ధైర్యం లేదు. కానీ రెడ్డీ మాత్రం ఆర్.టి.సి కండక్టర్ చిల్లర ఇవ్వకపోయినా వాడిని దబాయించేవాడు, చిన్న చిన్న అన్యాయాలు ఎదిరిస్తుండే వాడు. అదిచూసి నేను తనలో నిజమైన ఇంద్రసేనా రెడ్డిని చూసాను.ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరైనా తాగి మాట్లాడినా,చీకటై ఒక్కదానిని భయపడినా తోడుండేవాడు. ఎన్ని సార్లు నేనూ తనతో ఒంటరిగా వున్నా ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడు. ఇవన్నీ చూసి కూడా లవ్ చెయ్యకపోవడానికి నాకేమైనా మెంటలా?అలాంటి సీన్లలో రెడ్డి అచ్చం హీరో అనిపించేవాడు.(ప్రేమ గుడ్డిది కదా,ఒక్కసారి కూడా నేను తనకి నచ్చలేదేమో అని ఆలోచించలేని గర్వం నా అందం మీద నాకు)

అంతవరకు పెళ్ళే చేసుకోను అనుకుని తీవ్రమైన నిర్ణయం తీసుకున్న నేను సరేలే ఈ ఒక్కసారికి ఈ సమరసింహారెడ్డిని చేసుకుందాం అనుకొని మా ఇంట్లో చెప్పేశా. వాళ్ళు కూడా సగం నా లాంటి ఊహలతో, ఇంకో సగం ఈ దెయ్యం (అంటే నేనే)ఎవర్నో ఒకరిని  చేసుకుంటే చాలు అనుకుని మొత్తానికి మా పెళ్ళి కానిచ్చేసారు.

అప్పుడు మొదలయింది అసలు కధ. అసలు పెళ్ళి చేసుకోవాలంటే ముందు ఇంట్లో చెప్పాలన్నప్పుడే మా సమరసింహా రెడ్డి భయపడుతుంటే తన అసలు ధైర్యం బయటపడింది, కానీ నేను సరేలే పెద్దలంటే గౌరవం ఏమో అనుకున్నా( అక్కడికి నాకు అది లేనట్లు) పెళ్ళయ్యాక మా అత్తగారు అసలు కధ చెప్పారు. ఊరందరి ఇంట్లో ఒకరు జైల్లో వున్నారు మరి మన ఇంట్లో ఎవరూ జైల్లో లేరేంటండీ అని అడిగాను. ఆవిడ అప్పుడు చెప్పారు "మీ వాయన కూడా వెళ్ళే వాడే గొడవల్లోకి, ఊర్లో అందరితో పాటు వెళ్తానని అంటే నేనే తిట్టి పంపించేసా కర్నూలు మా తమ్ముని ఇంటికి ఆతరువాత శ్రికాకుళం కి, వాడొక్కడే కొడుకు కదా వాడికేమైనా ఐతే మేము ఇక బతకలేము" అని చెప్పారు. నాకు ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. ఆ తరువాత రెడ్డీ ని అడిగా "నువ్వు ఒక్కరిని కూడా నరకలేదా? ఒక్కసారి కూడా బాంబు వెయ్యలేదా? కనీసం తొడ కొట్టడం ఐనా వచ్చా అని" అవేవీ రావని ఆ తరువాత చాలా సంధర్భాలలో చెప్పకనే అర్ధం అయిపోయింది.నా కలలన్నీ కల్లలైపోయాయి. అరివీర భయంకర శూరుడనుకొని పెళ్ళాడానే,కనీసం మామూలు శూరుడు కూడా కాదు కదా!

ఇప్పుడు చెప్పండి నాకు అన్యాయం చేసింది ఎవరు సమరసింహా రెడ్డా కాదా?నేనే మోస పోయానా? బాంబులతో , కొడవళ్ళతో ఫైటింగులు చేసే గొప్ప వీరుడని పొరబడ్డాను. అయినా తనంటే ఇష్టమే కలుగుతుంది. ఇది ధర్మమా???

(కానీ ఫ్యాక్షన్ తాలూక నిజమైన కధ తరువాత పోస్ట్ లో చెప్తాను, అది నా కళ్ళతో చూసింది, మా అత్తయ్యా చెప్పింది.మనసు ద్రవించిపోయే నిజాలు, నిజమైనా జీవితాల కధలు. కానీ ఈసారి కాస్త టైం పడుతుంది పోస్ట్ రాయడానికి, కామెంట్లకు జవాబివ్వడానికి ఎందుకంటే ఈ నెల్లూరు నెరజాణ ??? ఇక నెల్లూరు వదిలి హైదరాబాదు వెళ్తుంది.సో ఇల్లు, ఊరు,ఉద్యోగం అన్నీ మారాలంటే కాస్త టైము కావాలి కదా)

Friday, September 10, 2010

నా విరహంలో నీ తోడు

"వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా? విరహానా జోడీ నీవే. నీకు భూలోకుల కన్ను సోకక ముందే పొద్దు తెల్లార కుండా పంపిస్తాలే"

ఈ పాట లో గ్రామర్, చందస్సు ఇలాంటివన్నీ నాకు అర్ధం కావు కాని,భావం మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఎవరూ లేని ఒంటరితనంలో మనసు తోడు కోరుకున్నప్పుడు, చుట్టూ ఆహ్లాదమైన వాతావరణంలో అంటే చిన్న చిరు జల్లు పడుతుంటే సాయంత్రం 7 దాటాక వరండాలో కూర్చున్నప్పుడు కాని, చల్లని రాత్రి పూట డాబామీద ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కాని, ఏదైన తోటలో, నీటి వొడ్డున ప్రసాంతంగా వున్న ఆ మౌనంలో నాకు మాత్రం వేరే ఏ మనిషి తోడు కూడా వొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమో నాకు ఆ ఒంటరితనం చాలా బాగుంటుంది. కాని నాతో పాటు మౌనంగా కూర్చొని ఆ ఏకాంతానికే అందాన్ని, అద్భుతాన్ని తీసుకు రాగల ఒక తోడు కావాలనిపిస్తుంది. అది వేరే ఏ మనిషి తీసుకు రాగలరని నాకు అనిపించదు. మనకెంతో ఇష్టమైన మన పిల్లలైనా, ప్రియుడైనా, నేస్తమైనా కూడా కొన్ని సంధర్భాలలో ఎవరూ వద్దు ఒంటరిగా వుండాలి అనిపిస్తుంది కాని ఇంకేదో తోడు కావాలనిపిస్తుంది. ఈ భావం ఏంటో నాకే అర్ధం కాదు. అంటే అప్పుడు తోడు వద్దు కాని కావాలి అంటే ఏమైనా అర్ధం వుందా అసలు. నాకు మెంటల్ వచ్చిందా ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. నాకు చాలా సార్లు అలాగే అనిపిస్తుంది. అప్పుడు ఆలోచించేదాన్ని ఇప్పుడు మరి నాకు ఎలాంటి తోడు కావాలి అని. ఏ మనిషి లో ఐన ఏదో ఒకటి నచ్చనిది వుంటుంది, వాళ్ళకి కూడా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి. అలాంటి తోడు కాదు కావాల్సింది. మౌనంగా వుండాలి కాని మాట్లాడుతున్నట్లే వుండాలి. ఆ చల్లని రేయికి, ఆ చక్కని ప్రకృతికి, ఆ చిక్కని నిశి కి కూడా అందాన్ని తెచ్చేలా వుండాలి. తను పక్కనుంటే చాలు మనసు ప్రశాంతంగా అయిపోవాలి, అమ్మ ప్రేమలా, స్నేహితుని భరోసా లా చల్లగా అనిపించాలి. ప్రియుని కౌగిలిలా మత్తుగా గమ్మత్తుగా వుండాలి.

ఇవన్నీ మనుషులెవరూ ఇవ్వలేరు. కాని ఇలాంటి అనుభవం నాకు కలిగింది.ఒకసారి కాదు కొన్ని సంధర్భాలలో తన తోడు నా విరహపు రాత్రుల్లో దొరికింది. ఆ తోడే, నేస్తమే, ఆ ప్రియుడే నా అందాల మామ, చంద మామ. ఆ ఏకాంతంలో తన తోడు దొరికినప్పుడంతా ఎంతో తృప్తి. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లు చంద్రుడు రోజూ అక్కడే వుంటాడు. కాని మనం చూసే దృష్టి వల్ల ఒక్కోసారి మాత్రమే అందంగా కనిపిస్తాడు అని. కాని అది నిజం కాదు. ఆ చంద్రుడు మన మనసు లోకి చొరబడితేనే అందం కనిపిస్తుంది. ఏకాంతంలో తన తోడు ని అనుభవిస్తూ మౌనంగా ప్రేమించగలిగేతేనే ఈ తృప్తి కలుగుతుంది.

వజ్రపుకొత్తూరు లో వున్నప్పుడు కొన్ని సార్లు సాయత్రం 7 దాటాక సముద్రపు ఒడ్డుకు వెళ్ళేదాన్ని. చీకటి, చక్కని రేయి, నిర్మానుష్యమైన సముద్ర తీరం, చల్లగా మెత్తగా కాళ్ళకింద తగిలే ఇసుక, గాలి తో పాటు ఎగిరి వచ్చి తాకే నీటి తుప్పర్లు, అంత ఒంటరి రేయిలో కూడా హోరున ఏదో చెప్తున్నట్లుందే సముద్రపు ఘోష. మొదట కలిగేది భయం, అది ఈ లోకపు పరిస్థితులు కలిగించే భయం. ధైర్యం చేసి అక్కడెక్కడో పడవల దగ్గర కనిపించే ఒకరో ఇద్దరో మనుషుల గురించి భయపడకుండా, తోటి మనుషులున్నారు అని ధైర్య పడగలిగి ఇసుకలో కూర్చోగలిగితే మొదలవుతుంది ఆ ప్రేమ ప్రయాణం. సముద్రం పై వెన్నెల చేసిన వెండి వెలుగుల దారి లో మొదలవుతుంది ఈ లోకాన్ని విడిచి తనతో గడపాలని చూసే నాకోసం చనదమామ దిగి వచ్చే అద్భుతం.కెరటాల మీద వెన్నెల వజ్రాల మెరుపులు నన్ను, నా చుట్టూ వున్న లోకాన్ని అబ్భుతమైన సౌందర్య రాసిగా ముస్తాబు చేస్తాయి. ఆ కెరటాల హోరు లో వున్న విరహ వేదన నాదేనా అనిపిస్తుంది. గాలి తో పాటు నా వేదనా గీతిక చంద్రుని చేరిందా! ఆ చీకటి వెలుగుల్లో ఒంటరిగా ఎవరు నాకోసం చూస్తున్నారు అని మబ్బుల చాటునుండి మరింత ప్రకాశంతో నన్ను తొంగి చూస్తున్నది అందుకేనా! ఇంత విశాల ప్రపంచంలో పక్కనే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి గొడవల్లో వాళ్ళు పడిపోతే కేవలం తన కోసమే ఈ అంతులేని జలరాసి కి ఎదురుగా, అందరికీ దూరంగా ఈ ఇసుక తిన్నెల నడుమ భయపడక చూస్తున్న నాకోసం దిగి రాక ఏమి చేస్తాడు? చంద మామ తన నేస్తాన్ని కలవాలని వచ్చినప్పుడు ఇక ఆ ఏకాంతానికి ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డు తగల లేదు. మరునాడు ఇవ్వాల్సిన రిపోర్టులు కాని, చీకటిలో కలిగే భయాలు కాని, ఇంటికెళ్ళమని హెచ్చరించే పల్లెకారులు కాని, తొందరగా తిరుగుతున్న చేతి వాచి ముల్లు కాని ఏమీ కనిపించవు వినిపించవు. ఇక ఎవరూ మనుషులు రారు అని ధైర్యంగా ఇసుక రంధ్రాల లోనుండి బయటకి వచ్చి సముద్రపు ఒడ్డునంతా నింపేసి అల్లరిగా పరిగెత్తే పీతలు జనాభా కూడా కనిపించదు, దూరంగా సముద్రం లోపలకి వేటకి వెళ్ళిన వారికోసం ఒడ్డున ఏర్పాటు చేసిన ఎత్తైన రాట పై కుండలో వెలుగుతున్న దీపం వెలుతురే పట్టపగలు అనిపించేంత ధైర్యాన్ని ఇస్తుంది. గాలి తో పాటు తాకుతున్న నీటి తుప్పర్లు మేమంతా నీకు తోడున్నాము అని చెప్తాయి. సముద్రపు ఘోష సంగీతమైపోతుంది. ఇక నాకు భయమన్న మాటే మతికి రాదు. చందమామ నా విరహాన తోడై వచ్చేసాడు. నేను, తను ఇద్దరం మౌనంగా సముద్రాన్ని చూస్తున్నాము. నాకు ఆ సముద్రం ఎందుకో ఆడుతూ అల్లరి చేస్తున్న నా చిన్నారి పాప లా అనిపించింది. చందమామ తన వెన్నెల తో పాపని నిమురుతున్నాడు. నేను నా చూపులతో కెరటాల అల్లరికి నవ్వుతూ మురిసిపోతున్నాను. ఈ సముద్రానికి ఇంత అందం ఎక్కడిది. కెరటాల పై మెరిసే ఆ వజ్రాల వెలుగు, పాల నురుగు చందమామది ఐతే, ఈ చలాకీ తనం, లోతైన భావం నా పోలిక. ఆ అంతులేని తనం మా ఇద్దరి పోలిక నాకు చంద్రుని పై వున్న అంతులేని ప్రేమ లా, చంద్రునికి వున్న అంతులేని ఆకర్షణ లా ఈ సముద్రానికి ఎక్కడా లేని అంతులేని నీరు గా మారింది. నేను చంద్రుని చూడటం లేదు కాని ఆ సముద్రంలో మెరుపుగా,ఆ గాలిలో చల్లదనం లా, ఆ చీకటిలో వెలుగులా, నన్ను చుట్టు ముట్టిన తన వెన్నెల కౌగిలిలోనే నేను వున్నాను. చందమామ కూడా నన్ను చూడటం లేదు ఎగిసి పడుతున్న కెరటాలలో నా మనసులోని భావాలను,భయాలనూ నవ్వుతూ చూస్తున్నాడు. మేమిద్దరం మౌనంగా వున్నాము కాని మాట్లాడుకుంటున్నాము. " నేను ఫీల్డ్ కి వెళ్ళినా, బండి మీద వస్తున్నా నా వెంటే వస్తున్నావు కదా, జీడి చెట్ల చాటునుండి నువ్వు నన్ను చూడటం నేను చూసాలే అని నేను చెప్పాను.' 'చూస్తున్నానని నువ్వు గమనిస్తున్నావని నేను కూడా చూశాలే, ఎవరితోనో మాట్లాడుతూ చీకటి పడే సరికి నేను వచ్చానా లేదా అని నువ్వు ఆకాశం వైపు చూడటం నేనూ చూశాలే, నేను రాని రోజున నీ కళ్ళల్లో నిరాశ ని మబ్బుల చాటు నుండి చూశాలే" అని నన్ను మౌనంగా నే ఆట పట్టిస్తున్నాడు"

ఎంత సమయమైనా మేమిద్దరం ఇలా మౌనంగా ఒకరికొకరు తోడుగా వుండగలం. తన చల్లని వెన్నెల వెలుగులు నాకిష్టం, తనని చూసి మురిసిపోయే నా కళ్ళల్లో వెలిగిపోయే వెన్నెల తనకిష్టం. కాని మా మౌనం, ఏకాంతం సముద్రపు ఘర్జన తో భంగం అయింది. ఇక నేను అల్లరి చేసి ఆటలాడి అలసి పోయాను, ఇక నిద్ర వస్తుంది నాకు అని గట్టిగా చెప్పింది. ఇక చేసేదేముంది, మళ్ళీ కలవాలని కళ్ళతోనే బాస చేసుకొని విడిపోయాము. చందమామ పైకెళ్ళిపోయాడు, సముద్రానికి వెన్నెల దుప్పటి కప్పి జోకొట్టాడు. నేను పెదవులు కలిపాను గుడ్ నైట్ కిస్ పెట్టాలని,సముద్రపు ఉప్పదనం తగిలింది నా పెదవుల పై. నవ్వుకుంటూ వచ్చేశాను.మనసంతా ఎంతో హాయిగా వుంది,తృప్తిగా వుంది,అసంతృప్తిగా వేదనగా కూడా వుంది. నాకు తెలుసు పైనుండి నన్నే చూస్తున్నాడని, అదే నాకు తనపై వున్న భరోసా. తనకి తెలుసు నేను ఇప్పుడు తనని చూడనని, చూస్తే వదిలి వెళ్ళలేనని, ఆ ప్రేమకే లొంగి పోయి వస్తున్నాడు నాకోసం నేలపైకి నా విరహపు రాత్రుల్లో తోడుగా..ఎప్పటికీ.

ఇలాగే కాకపోయినా కొద్ది తేడాతో అయినా మనలో ప్రతీ ఒక్కరికి జీవితంలో అప్పుడప్పుడు ఏకాంతం కావాలని, ఆ ఏకాంతంలో ప్రకృతి మన తోడు గా వుంటే మనసు సంతోషంతో నిడిపోయి తృప్తి,అసంతృప్తి ల మధ్య ఊగిసలాడుతూ ఒక తీరని వేదన కలుగుతుంది కదా!! అది ఎందుకు అలా? అది ప్రకృతిలో వున్న గొప్పతనమా? ఇటువంటి అనుభవం నాలుగు గోడల మధ్య ఏరోజూ కలగదు. నేను ఎప్పుడైనా ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సముద్రపు వొడ్డున వున్నా, కృష్ణ తీరాన కూర్చున్నా, జీడి తోటలో కూర్చున్నా, వెన్నెల రాత్రిలో మాత్రమే కలుగుతుంది. రూం లో ఒక్కదాన్నే వున్నా కూడా ఇటువంటి అద్భుతమైన భావం కలగదు. మహా అయితే బోర్ కొట్తి విరుగొస్తుంది, టి.వి.చూసి తలనొప్పి వస్తుంది. మీకెంతో నచ్చిన ఫ్రెండ్ తో మాట్లాడినా, ఒక వేళ మీ లవర్ తో మాట్లాడినా కూడా కలగని సంతోషం ప్రకృతిలో వుంది. వీలైతే ట్రై చెయ్యండి. అదే ఇష్టమైన మనిషితో ఒక్కసారి అలా ఒక ఏకాంతమైన ప్రకృతిలో 10 నిముషాలు మాట్లాడకుండా కూర్చున్నా కూడా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. నాకు ఇప్పటికి కళ్ళ ముందు కనిపిస్తూనే వుంటాయి అటువంటి సన్నివేశాలు. ఇంత గొప్ప అనుభవాలను ఇచ్చిన ఈ జీవితం అంటే, ఈ వుద్యోగం అంటే, వీటిని ఆస్వాదించగలిగే నా మనసంటే నాకెంతో ఇష్టం. ఇదంతా మనం మనిషిగా పుట్టడం వలనే కదా! ఎన్నో భావాలను నింపుకున్న మనసులున్న ఈ మనుషులంటే కూడా ఎంతో ఇష్టం. కలిసిన ప్రతీ మనిషి లో ఏదో ఒకటి నచ్చుతుంటే అందరిని ఇష్టపడుతుంటే జీవితం ఎంత బాగుంటుంది కదా!!! ద్వేషాలు లేని, కోపాలు లేని, కల్మషంలేని సంతోషం అందరికీ దొరకాలని ఆశిస్తూ....

మరొక అరుదైన అనుభవాల దిరిసెన పుష్పాన్ని మీ ముందుంచుతున్నాను.

(అంతా రాసి చదివాక ఏదో కవిత్వం లా అనిపిస్తుంది. కాని మొన్న ఒకసారి ఊరినుండి వస్తుంటే జీప్ లో నుండి చూస్తే నాతో పాటు వస్తున్న చంద్రుడుని చూస్తూ వచ్చాను. హొటెల్ రూంలోకి వచ్చాక కూడా నా వెంట పరిగెత్తి వస్తున్న ఆ చందమామే కళ్ళముందు కనిపిస్తుంటే మనసులో కలిగిన భావాలు గుర్తొచ్చిన ఙ్ఞాపకాలు ఇలా రాసాను)