Tuesday, June 28, 2011

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే ......


వెర్రోడి పెళ్ళాం ఊరందరికి వదిన అని సామెత. గవర్నమెంట్ వుద్యోగులు అంటే చాలు అందరూ తిట్టేస్తారు. కాని నిజానికి వాళ్ళకి చాలా పని వుంటుంది. నేను ఎక్కువగా చూసేది కలెక్టర్స్ ని, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, వివిధ డిపార్ట్ మెంట్ హెడ్స్ ని. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చాక అనిపించింది, ఎందుకని కలెక్టర్ల గురించి ఒక పోస్ట్ రాయకూడదు అని. అక్కడికి నాకేదో వందలమంది కలెక్టర్లు తెలుసని కాదు. కాని తెలిసిన వారిలో కొందరి మీద కొన్ని అభిప్రాయాలు వున్నాయి. అవి మీతో పంచుకోవాలని ఈ పోస్ట్.

నేను వుద్యోగం జాయిన్ అయిన కొత్తలో నాకు తెలిసిన మొట్టమొదటి కలెక్టర్ గారు జవహర్ రెడ్డి గారు. కలెక్టర్ అంటే నాకు మొదట గుర్తొచ్చేది అతనే. నన్ను ఇంటర్వ్యూ చేసిన బోర్డ్ లో అతను కూడా వున్నారు, ఇంత స్మార్ట్ గా వున్నారు కదా ఒక ప్రశ్న అయిన అడుగుతారేమో అని ఎదురు చూశా, అతను అలా చూస్తునే వున్నారు కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.పుట్టడమే కలెక్టర్ హోదాలో పుట్టారా అన్నట్లు వుంటారు. ఎంతో డిగ్నిఫైడ్ గా ఎక్కడా ఏమాటలో, భావంలో చూసినా ఒక డిగ్నిటీ కనిపిస్తుంది. అసలు అతను మాట్లాడుతుంటే అలాగే వినాలనిపించేది. నేనైతే అతన్ని అలా చూస్తూ నేను ఎందుకు కలెక్టర్ కాలేదా అని, అసలు ఐ.ఎ.ఎస్ అయితే అలాంటి డిగ్నిటీ వస్తుందేమో అనుకునేదాన్ని.

కాని ఆ అభిప్రాయం ఎక్కువ కాలం నిలబడలేదు. కొందరు ఐ.ఎ.ఎస్ లను చూసినతరువాత చదువు, పదవి, పొజిషన్ కాదు ఒక మనిషి ఏమి నేర్చుకున్నాడు అని కాదు నేర్చుకున్నదానిని ఎంత బాగా సంధర్భానికి అన్వయిస్తున్నాడు అనేదాన్ని బట్టి వుంటుంది. అందరు కలెక్టర్లు డైరెక్ట్ ఐ.ఎ.ఎస్ లు కాదు. కొందరు కర్ఫర్డ్. వాళ్ళల్లో కొందరికి వారు ఎక్కువకాలం పనిచేసిన డిపార్ట్మెంట్ వాసనలు ఎప్పటికి పోవు, కాని కొందరు అనుభవం తో వచ్చిన ఙ్ఞానం ఎలా అయినా గొప్పది అనిపించేలా వుంటారు.

జవహర్ రెడ్డి గారి తరువాత నాకు అంత బాగా నచ్చిన కలెక్టరు ప్రస్తుతం మా మెదక్ కలెక్టర్ సురేష్ కుమార్ గారు, తమిళాయన కాని ముద్దు ముద్దు గా అయినా చాల అనర్గళంగా తెలుగు మాట్లాడతారు. మాటల కంటే కూడా సమయం వేస్ట్ చెయ్యకుండా చాలా ఆర్గనైజ్డ్ గా పని చేస్తుంటారు. అసలు మెదక్ జిల్లా ఏదో అదృష్టం చేసుకుంది ప్రస్తుతం వున్న ఆఫీసర్లు అందరూ చాలా బాగా పనిచేస్తారు. మనం ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమీ పని చెయ్యరు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అనుకుంటాము. కాని ఎవరో కొందరు తప్ప అందరూ చాలా మంచి వాళ్ళు వుంటారు. (అటునుండి ఇటు కూడా అయ్యుండ వచ్చు) కాని ఎవరికైనా సరే వుదయం 6 నుండి రాత్రి కనీసం 10 వరకు తల తిప్పుకోడానికి వీలుకాని పని వుంటుంది. నేను ఎప్పుడైనా వుదయాన్నే 6, 7 కి కేంప్ ఆఫీస్ కి వెళ్ళినా, రాత్రి 10 కి అలా కలిసినా నాకు వాళ్ళని చూస్తే చాలా జాలి వేస్తుంది. వాళ్ళకంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద వారి పేషిలో పని చేసే వారి మీద చాలా జాలి. ( మా ఇంట్లో వాళ్ళు నన్ను అచ్చేసి వదిలేశారనుకోండి).నా తరువాత ఇంకా వాళ్ళకి చాలా మందితో మాట్లాడాల్సిన వాళ్ళుంటారు. అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, బుద్ధిగా రాసుకుంటారు, వింటారు, సలహాలిస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్డర్స్ ఇస్తారు, ఇలా క్షణాలలో చాలా ప్రోసెస్ జరగాలి మెదడులో.

అసలు నాకు అందరికంటే ఇష్టం అయిన కలెక్టర్ ఎందరికో ఆదర్శం అయిన కలెక్టర్, ప్రస్తుతం ఎస్.ఇ.ఆర్.పి కి పి.డి అయిన రాజశేకర్ గారు. అతని పేరు చెప్తే తెలియని వాళ్ళు వుండరు. అంత మంచి పేరుంది. నేను అయితే అతనికి అదౄశ్య అభిమానిని. ఎందుకంటే ఎప్పుడు కలిసి పని చెయ్యలేదు, కనీసం చూడలేదు కాని అతనంటే చాలా చాలా ఇష్టం. నా దురదృస్టం నేను అతన్ని కనీసం చూడగలగటం ఎప్పుదు క్షణాల తేడాలో మిస్ అయిపోతాను. మొదట అతని గొప్పతనం విని పెద్ద అభిమాని అయిపోయాను. మొదటసారి 1999 లో అతన్ని కలిసే అవకాశం వచ్చింది నన్ను అనంతపూర్ ఎక్స్ పోజర్ కి పంపినప్పుడు ఆయన అక్కడ వెలుగు పి.డి. అక్కడ 3 రోజులున్నా అతని క్లాస్ కూడా వుంది మాకు కాని ఏదో అర్జెంట్ పని వుందని ఇంకో పెద్దాయనతో ఆ సెషన్ జరిపించారు. అయినా సరే అతన్ని చూడాల్సిందే అని నేను పట్టు బట్టి తరువాత రోజు వెళ్ళిపోయే ముందు ఆఫీస్ కి వెళ్ళాము. కాని మేము వెళ్ళేసరికి అతను లంచ్ కి వెళ్ళారంట (టైము సాయంత్రం 4) ఇక మాకు టైము లేకపోయింది. తరువాత మళ్ళీ అతన్ని కలిసే అవకాశం 2004 లో వచ్చింది, అప్పుడు అతను నెల్లూరు కలెక్టర్. సునామీ ప్రాజెక్ట్ లో నాకు నెల్లూరు పోస్టింగ్. మా కేర్ వాళ్ళందరు అతనితో కలిసి సర్వే కూడా చేశారు. ఇక నేను కలిసి పని చెయ్యబోతున్నా అనుకుని సంతోషించా. కాని నేను జాయిన్ అయిన రెండ్రోజులకి అతను రిలీవ్ అయిపోయారు. కనీసం చూడలేకపోయా. మొన్న పని కట్టుకొని హైదరబాదు లో ఎస్.ఇ.ఆర్.పి ఆఫీస్ కి అతన్ని కలవాలని వెళ్ళాను. వేరే పనులు కూడా వున్నాయిలెండి. ఆరోజు సార్ కేంప్ కి వెళ్ళారు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ విషయం తెలిసిన చాలా మంది నన్ను ఎగతాళి కూడా చేస్తుంటారు. నేను అడుగుపెడితే రాజశేకర్ గారికి ట్రాన్స్ఫర్ అని.జీవితంలో ఒకసారన్నా కలిసి........ఏమి చెప్పాలి? ఏమో నాకు ఒక ప్లాన్ అని ఏమీ లేదు. కొందరు ప్రమోషన్లు మీద మినిష్టర్స్ కి సెక్రటరీ గా వెళ్ళిపోతారు, వారికి ఇన్ ఫ్లుఎన్స్ వుంటుంది కాని పనిలో ఏమాత్రం సంతృప్తి వుంటుందని ఈ సారి అడిగి చూస్తా కన్నబాబు గారిని, అమరేంద్ర గారిని.

నేను చెప్పేది ఏంటి అంటే ఒక్క కలెక్టర్లే కాదు చాలా మంది ముఖ్యమైన పొజిషన్లో వున్న ఎందరో గొప్ప వ్యక్తులున్నారు. మా అదిలాబాద్ జె.సి స్యామ్యూల్ ఆనంద్ గారు, మొదట అతన్ని కలిసి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుతుంటే అతను చేతులతో మొహం తుడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఆడుకుంటుంటూ వుంటారు.కోపం తో మనం బయటికి వచ్చిన తరువాత గేట్ దాటేలోపల మన పని మొదలయిపోతుంది. అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. మనిషిని చూసి అపార్ధం చేసుకోకూడదు అని అతని పని చూస్తే తెలుస్తుంది.ఇక విజయకుమార్ గారు, గిరిజా శంకర్ గారు వంటి వాళ్ళతో ఒకసారి పరిచయం వారి పని తీరు చూశాక ఆ జాబ్ వదిలేసినా, ఎక్కడికెళ్ళినా ఆ బంధం కొనసాగుతుంది. కొందరు కొత్త ఐ.ఎ.ఎస్. టాపర్స్ ముత్యాల రాజు లాంటి వారు వుంటారు వాళ్ళకి కొంత కాలం అయ్యే వరకు ఒక స్టైల్ అంటూ రాదు.కొంత డక్కాముక్కీలు తిన్నాక వారిదంటూ ఒక ప్రత్యేక స్టైల్ వస్తుంది,నేను మొదట్లో చూసిన సంజయ్ జాజు గారికీ ఇప్పటి కీ చాలా తేడా వచ్చింది.

నాకేమనిపిస్తుందంటే కాస్త యంగ్ గా వున్న ఆఫీసర్స్ ని వుంచాలి. కాస్త ఏజ్ అయిన తరువాత పెద్దగా నిర్ణయాలు స్పీడ్ అవసరం లేని పదవుల్లో వెయ్యాలి. 90% మందికి కొంత వయసొచ్చక స్పీడ్ తగ్గి పోతుంది, అది మెచ్యూరిటీ అనుకోవాలేమో!. కాని కొందరికి అసలు పనిలో ఎప్పటికీ వయసవ్వదేమో!!వుదాహరణకి ప్రస్తుతం ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.(ఉపాది హామీ పధకం) డైరెక్టర్ మురళి గారు. అతను రోబో లాగా పని చేస్తుంటారు. నిజంగా అతని నడక, ఆఫీసులో లేదా మీటింగ్స్ లో అతని పని తీరు, మాట తీరు 10 సంవత్సరాలుగా కొంత కూడా స్పీడ్ తగ్గటం చూడలేదు. అసలు చాలా మంది పని తీరు ఎంత ఆర్గనైజ్డ్ గా వుంటుందో అసలు. నేను ఎవరిదగ్గరికైనా వెళ్ళే ముందు కొంత హోంవర్క్ చేస్తా, ఏమి విషయాలు మాట్లాడాలని పాయింట్స్ రాసుకోవటం, ఏది ముందు చెప్పాలి, ఏ విషయం కాస్త తరువాత చెప్పాలి వంటివి ముందే అనుకొని వెళ్తాను. కాని కొందరు నాకంటే బుద్ధిమంతులుంటారు. నాకున్న మతిమరుపుకి లేదా ఓవర్ కాంఫిడెన్స్ కి ఒక్కో సారి ఏదైనా మర్చిపోయానో అప్పుడే అది అడుగుతారు. చాలా వరకు మనతో మాట్లాడుతూ నోట్స్ రాసుకుంటారు, కొందరైతే పోయినసారి రాసుకున్న పేజ్ కరెక్ట్ గా తీసి ప్రస్తుతం స్టేటస్ గురించి ఆ సంబందించిన అఫీషియల్స్ ని అడుగుతారు. చాలా నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు.

అందరు మంచి వాళ్ళే అని పొగిడేస్తుంది...ఈమె మరీ ఓవర్ అనుకుంటున్నారా. అసలు వేరే రకం వాళ్ళని చూడలేదా ఆఫీసర్లలో అంటే చూశాను. కాని నాకు చెడు గుర్తుచేసుకోవటం కూడా ఇష్టం వుండదు. వ్యవస్థ లో లోపాలు అందరూ ఎలాగు చూస్తున్నారు. ఇలా కష్టపడి పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం వున్న వారి గురించి మాట్లాడుకుంటే మంచిది, వాళ్ళ దగ్గర్ నేర్చుకోడానికి వుంటుంది, వారితో పని చేస్తే ఎంతో తృప్తి వుంటుంది.

రెండో రకం కూడా వున్నారు. విపరీతమైన బ్యూరోక్రసీ, ఆధిపత్యం చూపించుకోవటం, వచ్చిన వారి తో మర్యాద లేకుండా ప్రవర్తించడం, ఫైల్స్ మొహం మీద విసిరి కొట్టడం, తన క్రింద స్థాయి వాల్ల మీద అరవటం, పర్సనల్ గా నిందించటం,వ్యవస్థని తిట్టుకోవటం, అన్ని విషయాలలో తప్పులు వెతకడం, అనవసరమైన విషయాల పై శ్రద్ధ అసలు పని పక్కన పెట్టి నాయకుల వెంట మంచి పేరు కోసం ప్రమోషన్ల కోసం తిరిగుతూ పని ఎగ్గొట్టే వాళ్ళు, ఉద్యోగంలో స్థాయి పెరిగినా మెచ్యూరిటీ రాని వాళ్ళు.....ఇలా చాల పెద్ద లిస్ట్ వుంది. కాని అది అనవసరం.అనవసరం అంటే వాళ్ళగురించి చాలా అందరికీ తెలుసు. కాని ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళని చూస్తే అసలు వీరి గురించి ఎవరూ మాట్లాడరేంటి అనిపిస్తుంది. తినడానికి, నిద్రకి, సెలవులకి మనకి ఎన్నో సదుపాయాలుంటాయి. కాని వీరికి జీవితంలో టైము అన్నదే వుండదు, చేసే వాళ్ళకి గవర్నమెంటు లో చాలా చాలా పని వుంది. మన అందరికంటే మన ప్రభుత్వం పని ఎక్కువ, ప్రభుత్వం యొక్క అవుట్ రీచ్ ఎక్కువ. ప్రభావం ఎక్కువ.......సమస్యలు కూడా ఎక్కువే. పని చెయ్యని వాల్లకు అవకాశాలు ఎక్కువ, పని చేసే వాళ్ళకి పని, అడ్డంకులు చాలా ఎక్కువ.

ఇటువంటి ఒక ఆఫీసర్ మీ జీవితంలో ఎదురైతే తప్పక అభినందించండి.నేను ఒక పోస్ట్ లో రాసినట్లు బాస్ హ్యాండ్సం అని వారి పని వల్లనే అనిపిస్తుంది. హార్డ్ వర్కర్స్, స్మార్ట్ వర్కర్స్ ఇలా ఎందరో మహానుభావులు.....అందరికీ వందనాలు. మీరు పడుతున్న శ్రమ వల్లనే మాకు ఎన్నో పనులు జరుగుతున్నాయి.జీవితంలో ఒక్క మనిషికైనా ఉపయోగపడగలిగే తృప్తి వర్ణించలేనిది అటువంటిది మీ వుద్యోగం మీకిచ్చిన అవకాశం. ధన్యం ఆ జీవితం.

Friday, June 24, 2011

ఎందుకిలా అవుతుంది? నాకేమైంది?




నాగార్జున సాగర్ చూశానోచ్. మన నెహ్రు గారి పుణ్యం, ఎందరో వ్యక్తుల శ్రమ, మన దేశానికే గర్వకారణం అయిన బహుళార్ద సార్ధక ప్రాజెక్టు చూశాను. ఈ మద్య రెండ్రోజులు మాకు అక్కడే మీటింగ్ అయింది. సరే అంత పెద్ద డ్యాం దగ్గర ఏమి చూశావు అని మాత్రం అడకండి ఎందుకంటే అందులో పెద్దగా నీళ్ళు లేవు. సో బహుళార్ధం సార్ధకం అంతా సగం సగం పని చేస్తుంది. కాకపోతే కృష్ణ అంటే నలుపు అని చెప్పినట్లు నల్లటి కృష్ణ లో కాసేపు జలకాలాడాము, నీటి ప్రవాహంలో నున్నగా మారిన రాళ్ళు ఏరుకొని ఇంటికి మోసుకొని వచ్చాను. ఇప్పుడవి ఏమి చెయ్యాలో తెలియక అలా వుంచాను. ఏదో ఒక రోజు మా ఇల్లు మ్యూజియం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కడెక్కడనుండో తెచిన గవ్వలు, ఆల్చిప్పలు, రాళ్ళు, రప్పలు వున్నాయి.

సరే ఇక అసలు విషయానికి వస్తాను, అసలేమి జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి....ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే...నేను బ్లాగ్ లోకాన్ని సందర్శించి చాలా నెలలైంది. టైము వుంది కాని, ఏంటో ఎందుకు రాయలేకపోతున్నానో అర్ధం కావటం లేదు. ఎందుకు రాయలేకపోతున్నాను అని చెప్తూ రాయడానికి కొన్ని సార్లు ప్రయత్నించాను. కుదరలేదు. మీరే చెప్పండి నేను ఎందుకు రాయలేకపోతున్నాను?

నా పరిస్థితి, ఇంతకు ముందు నా ప్రపంచం, ఇప్పుడు పరిస్థితి ఇవన్నీ చూసి చెప్పండి. నేను ఏమి చేస్తె రాయగలను? ఏ పరిస్థితులవల్ల రాయలేకపోతున్నాను అని.

లేదా ఏదైన టాపిక్ రాద్దాము అంటే ఏమి రాయాలి తెలియటం లేదు. పిచ్చి పిచ్చి పిచ్చిగా....పిచ్చెక్కినట్లుంది.

మీకు ఎప్పుడైన ఇలాంటి పరిస్థితి వచ్చిందా? వస్తే ఏమి చేశారు? అవును మరి నువ్వు రాయకపోతే లోకానికి కనీసం మాకేమైనా నష్టమా అని అడగకండి...నేను నాకోసమే రాస్తుంటాను. రాయటంలో మనసులో భావాలు బయటకి వచ్చి, భావాలు అక్షరాలుగా ఘల్లు ఘల్లు మని నాట్యం చేస్తున్నట్లు, మల్లెలుగా రాసులు పోగైనట్లు, ఒక చక్కని తృప్తి వస్తుంది. ఇప్పుడు ఆ తృప్తి లేదు. కీ బోర్డ్ మీద చెయ్యి అలా ఆగిపోతుంది. మనసు ఆలోచనలు, భావాలు రాక, రాయలేక బాధపడుతుంది. ఎందుకిలా అవుతుంది? నాకేమైంది? (నీకు పిచ్చి పట్టింది, నువ్వు ప్రేమలో పడ్డావు లాంటి ఆన్సర్స్ ఇవ్వొద్దు ప్లీస్)

మీకు నేను రాసిన పోస్ట్లు ఏవైనా నచ్చితే....నిజంగ చెప్పండి, నేను ఎందుకు రాయలేకపోతున్నాను, ఎటువంటి ఆలొచనలు చేస్తె రాయగలుగుతాను. హైదరాబాదు వచ్చి, కొత్త జాబ్ లో జాయిన్ అయిన నుండి రాయలేకపోతున్న. నేను ఏమి చెయ్యలి?(జాబ్ మానేయ్, హైదరబాద్ వదిలేయాలి అంతేనా? అది కాదు కాని ఇంకో మాట చెప్పండి) మనసులో సౌకుమార్యం, స్పందన లేనితనం నాకెందుకు వచ్చింది? నేను బండలా ఎందుకు మారిపోతున్నాను?అంటే రాయలేని వాళ్ళందరూ బండలా అని కాదు, ఎవరి భావ వ్యక్తీకరణ కొసం వాళ్ళు చేసే పని వాళ్ళు చెయ్యలేకపోవటం వాళ్ళలో ఆ సున్నితత్వం పోవటం వల్ల జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది అని నా ఫ్రశ్న?

తిండి,నిద్ర, పని షాపింఘ్ అన్నీ చెయ్యగలుగుతున్నాను. కాని మనసు లో సంతోషం లేదు. ఏ పని కూడా మనసుని తాకటం లేదు. నేను చేస్తున్న జాబ్ లో ప్రయాణాలు ఎక్కువ. మెదక్, మెహబూబ్ నగర్, అదిలాబాద్ జిల్లాలు తిరుగుతున్నాను. అక్కడ పనిలో ప్రకృతిలో కూడా సంతోషం లేదు. జీవం లేనట్లున్న మైళ్ళు కొలది రహదారిపొడుగునా వున్న ప్రదేశాలు,తెల్లగా దుమ్ము తో ఎండ వేడితో తేమ లేని గాలి మనసు లో తడి కూడా ఆరిపోయేలా చేస్తుందా? కలిసిన ప్రతి కుటుంబంలో వున్న కన్నీరు కాని, ఏమీ మార్చలేని వారి జీవితాలాలో బాధ కూడా కరిగించలేని ఈ ఖటినత్వం నాకెందుకొస్తుంది? మనిషి సంతోషంలోనే రాయగలడా? బాధ కూడా రాస్తాము కదా.......కాని మనసు కి బాధ కలిగినా రాయాలేకపోతున్న ఈ పరిస్థితి కి కారణం ఏమై వుంటుంది? మీకు ఏమైన అర్ధం అవుతుందా? ఐతె చెప్పరూ..........


Saturday, April 2, 2011

మీరెంతవరకు హెచ్.ఐ.వి నుండి రక్షణ పొందారు???


చాలా రోజుల తరువాత ఎందుకు బ్లాగ్ రాశాను అని ఆలోచించాను. బహుశా నేను సంతోషం గా వున్నప్పుడే రాయగలుగుతాను అని అనిపించింది. కొత్త ఉద్యోగం లో చేరాక చాలా విషయాలు వున్నాయి.కాని సంతోషం కలిగించేవి ఏవీ లేవు. అన్నీ మనసు ని కలిచివేస్తున్న విషయాలు. అందుకే రాయలేకపోతున్నాను.

హెచ్.ఐ.వి తో బాధ పడుతున్న లేదా, ఆ వ్యాధి వల్ల ప్రభావానికి గురి అయిన కుటుంబాలతో పని చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలు వున్న కుటుంబాలతో మా ప్రాజెక్ట్ లో పని చేస్తాము. ఒక్కో కుటుంబానికి వెళ్తుంటే పాపం తెలియని ఆ పిల్లలు హెచ్.ఐ.వి బాధితులంటే మనసులు కలిచివేసినట్లవుతుంది. చిన్న పిల్లలు ఇంక లోకం కూడా తెలియని పిల్లల దగ్గర నుండి జీవితం మీద ఆశలు పెంచుకునే టీనేజ్ పిల్లల వరకు వున్నారు.

90% తండ్రి ద్వార కుటుంబంలోకి ఈ జబ్బు వస్తుంది మామూలు కుటుంబాలలో. 18 సంవత్సరాలకి పెళ్ళి అయి, 20 కి భర్త పోయి, హెచ్.ఐ.వి వచ్చేసి, ఇంట్లో వాళ్ళు బయటకి తరిమేస్తే వ్యాది సోకిన తను, తన చిన్నారి బిడ్డతో రోడ్ మీద పడిన ఎందరో ఆడవాళ్ళు. ఇక వారు బ్రతకడానికి దారి ఏది? అమ్మ నాన్న  చనిపోతే అనాధగా బ్రతకడం లేదా తాత గారింట్లో బ్రతకడం కూడా కష్టమే అలాంటిది వారు ఎయిడ్స్ తో చనిపోతే? చేరదీయాల్సిన వాళ్ళు కూడా చేరదీయకపోతే? ఎయిడ్స్ అంటే ఏమిటో తెలీకపోయినా, ఆ వ్యాధి చిన్నప్పుడే వాళ్ళకి తల్లిదండ్రులనుండి వారసత్వంగా వచ్చేస్తే? తన చర్మం ఎందుకు అలా వుందో, తనెందుకు ఎప్పుడూ జబ్బులు పడుతున్నానో తెలీక, అందరు తనని ఎందుకు నీచంగా చూస్తున్నారో తెలీక ఆ పిల్లల కళ్ళల్లో కనిపించే అయోమయం చాలా బాధ కలుగుతుంది.

ఎయిడ్స్ బయట నుండి చూస్తే ఒక ఆరోగ్య సమస్య, లేదా నీతి సంబందించిన సమస్య అనుకుంటాము. కాని అది అంతకు మించి ఎంతో.....ప్రకృతి ని శాసించే స్టేజ్ కి వచ్చాము అనుకునే మనకి, దేనికైన పరిష్కారం కనుక్కోగలమనుకునే మన శాస్త్ర విగ్ఞనానికి ఈ పిల్లల్ని చూస్తె సిగ్గు చేటు. హెచ్.ఐ.వి వచ్చినా సి.డి.4 కౌంట్ ఎక్కువ వుండి నిరోధక శక్తి బాగుంటే పర్వాలేదు. కానీ సి.డి.4 తగ్గిపోయాక ఒకసారి ఎ.ఆర్.టి మందులు వాడటం మొదలు పెట్టాక ఇక జీవితాంతం అవి వాడాలి. పిల్లల్లో కనుక ఎ.ఆర్.టి మందులు మొదలయిపోతే అవి 15 సంవత్సరాలు వరకే మొదటి లైన్ మందులు పనిచేస్తాయి. ఒక సారి రెండవ లైను మందులు మొదలైపోతే మహా అయితే 8 సంవత్సరాలు... చిన్నప్పుడే ఎ.ఆర్.టి మొదలైన పిల్లలికి,కరెక్ట్ గా టీన్ ఏజ్ కి వచ్చేసరికి ఇక జీవితం వుండదు. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమి చెప్పాలో అర్ధం కాదు. కానీ ఒకటి నిజం. వ్యాధి వున్నా లేకపోయినా మనందరి మనసులు ఒకటే, మనందరి ఆశలు ఒకటే. నవ్వుతూ మాట్లాడితే సంతోషిస్తారు. వ్యాధి గురించి మాట్లాడితే.............చావు గురించి , సమాజం చూసే చూపు గురించి మాట్లాడితే.......

హెచ్.ఐ.వి లోతులు ఇంకా నాకు పూర్తిగా తెలీదు. ఒక్కొక్కరితో మాట్లాడితే ఒక్కో విషయం తెలుస్తుంది. కాని ఎంతమంది కి ఇవన్నీ తెలుసు? కౌన్సిలింగ్ ఇస్తున్నారు కాని ఎంతవరకు బయట విన్న అపోహలు నిజాలు కలిసిపోతున్నాయి అని తెలీదు. నేను హెల్త్ సైడ్ పని చెయ్యట్లేదు. కేవలం హెచ్. ఐ. వి కి గురి అయిన లేదా ప్రభావితమైన వారికి జీవనాధారం కల్పించే టాస్క్ నాది. కానీ కొంత వరకు తెలుసుకుంటున్నా.

మొన్న ఒకరోజు లత (పేరు మార్చేశాను), పాజిటివ్ నెట్ వర్క్ (హెచ్.ఐ.వి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరిది నెట్వర్క్) మెంబర్, నేను కలిసి చాలా సేపు కలక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురుచూస్తూ కూర్చున్నాము. ఆ జిల్లా కలెక్టర్ కి ఎప్పటికీ మమ్మల్ని లోపలికి పిలిచి మాట్లాడే సమయం దొరకటం లేదో, లేక పాజిటివ్ వాళ్ళంటే వున్న చిన్న చూపో కాని అంత సమయం తీసుకుంటున్నారు. లత కి నీరసం వస్తుంది. సరే అని నేను వుంటున్న హొటెల్ రూం కి తీసుకెళ్ళాను. కాసేపు ఫ్రెష్ అయ్యాక వెళ్ళొచ్చని. లత కి 25 సంవత్సరాలు. పాజిటివ్, ఒక కొడుకు 7 సంవత్సరాలు, 18 కి పెళ్ళి అయ్యింది, 20 కి విడో అయ్యింది, కనీసం భర్త శవాన్ని కూడా ఇంటికి రానీయలేదు స్వంత తల్లిదండ్రులు, అత్త మామలు. లత ఒంటరిగా బ్రతుకుతుంది. నెట్ వర్క్ లో చిన్న ఉద్యోగం, అప్పుడే ఎ.ఆర్.టి వాడుతుంది. తను చనిపోతే కొడుకేమి కావాలి? నేను అడిగాను ఎందుకు మంచిగా ఆహారం తీసుకుని వుంటే నీకు సి.డి.4 బాగుండేది కదా ఎ.ఆర్.టి కి అప్పుడే ఎలా వచ్చావు అని?, బార్యా భర్తలిద్దరికి హెచ్.ఐ.వి వుండి వాళ్ళిద్దారు కండోం లేకుండా సెక్స్ లో పాల్గుంటే, వైరస్ పెరిగిపోతుందని, ఇద్దరిలో ఒకరు ఎ.ఆర్.టి మందులు వాడుతుంటే రెండవ వారికి కూడా ఆ మందుల కు రెసిస్టెన్స్ వచ్చేసి సెకండ్ లైన్ మందులకు డైరెక్ట్ గా వెళ్ళాలని , తన భర్త ఎప్పుడు కండోం వాడలేదని చెప్పింది. హెచ్.ఐ.వి వచ్చక అసలెందుకు కలిశారు అని అదిగాను, అదేంటండి మా వయసెంత? మాకు కోరికలుండవా అని అడిగింది. కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియక వ్యాది తీవ్రత పెంచేసుకున్నాము అని చెప్పింది. నిజమే మనందరికి హెచ్.ఐ.వి గురించి, దాని బారిన పడ్డవారి గురించి చాలా తక్కువ తెలుసు.

ఎ.ఆర్.టి మందులు చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. యాంటీ బయటిక్ ఎప్పుడో జ్వరమొచ్చినప్పుడు తక్కువ పవర్ ది వేసుకుంటేనె తిండి సహించక, వికారం వచ్చేసి నానా రకాలు అయిపోతుంది. అలాంటిది రోజూ హై డోస్ ఏంటీబయటిక్ వాడితే వారి పరిస్థితి చాలా దారుణంగా అయిపోతుంది. సరిగా తినలేరు, వాంతులు, కళ్ళు తిరగటం, కాంబినేషన్ మార్చినప్పుడు కొందరికి పెరాలసిస్ కూడా వచ్చేస్తుంది, చర్మ వ్యాధులు, చర్మం నల్లగా మాడినట్లు అవ్వటం, మెడ వెనుక మూపురం లా రావటం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తుంటాయి.

ఒక వైపు శరీరం తో పోరాటం, ఒకవైపు సమాజంతో పోరాటం, ఒకవైపు చావమని చెప్పే మనసుతో పోరాటం....

ఒక్కొక్కరిని కదిపితే అంతులేని వేదన, మనిషి ఎంతో సాధించాము అంటాడు కదా మరి ఇదేంటి మన తోటి వారు నరకం చూస్తుంటే ఏమీ చెయ్యలేకపోతున్నాము? ఇంత ప్రాణాంతకమైన జబ్బులు ఇలా ఆకలి, దాహం,నిద్ర, సెక్స్ కోరిక వంటి సహజమైన అవసరాలు ద్వారా వస్తే ఎంత కష్టం (ఇక్కడ నేను నీతులు, సామాజిక కట్టుబాట్లు ఆలోచించటంలేదు, ఎందుకంటే ఈ కట్టుబాట్లు జంతువులకు లేవు కాని మనుషులకున్నాయి, కాని ఇలాంటి జబ్బులు మాత్రం మన్షులకే వున్నాయి) మనం ప్రకృతి సహజత్వం నుండి చాలా దూరం వచ్చేసామా??? మనకి మనమే నీతులు కట్టుబాట్లు, సౌకర్యాలు సంరక్షణలు ఏర్పాటు చేసుకొని, మనమే సహజమైన ప్రేమ, భంధాలు, సహజమైన కట్టుబాట్లు దాటి ఈ అసహజ సామాజీకీకరణ వల్ల ఇవన్నిటి బారిన పడుతున్నామా అనిపిస్తుంది .ఇటువంటి అలోచన మనకి జీవితంలో ఎన్నో సంధభాలలో కలుగుతుంది. అసలు మనిషి ఎందుకు ఈ సమాజికీకరణ చెందాడు అని(ముక్ఖ్యంగా ఆఫీసు లో చికాకొచ్చినప్పుడు, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు, నిద్రొస్తున్నా పనిచెయ్యల్సి వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇలా, హాయిగా ఆ పూట తిండి మాత్రం సంపాదించి నిద్రపోయే జంతువులను చూస్తే, టెన్షన్ లేని వాటి జీవితాన్ని చూస్తే, మెరిసిపోయే వాటి ఆరోగ్యమైన చర్మాన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది.

మరి మనం అందరం ఏమి చేస్తున్నాము మన తోటి వారు ఇలాంటి వ్యాధికి గురవుతుంటే? ఇక్కడ కుటుంబాలు చూస్తే వారేదో అంగారక గ్రహం నుండి రాలేదు, మనలాంటి మామూలు కుటుంబాలు, ముందు రోజు వరకు సంతోషంగా జీవితం మీద ఆశతో, సమాజం లో గౌరవంగా బ్రతుకుతున్న వారే. దాని బారిన పడే పరిస్థితి వస్తుందని వారు కూడా ఊహించరు. మనం, మన కుటుంబాలు, స్నేహితులు, పిల్లలు ఈ వ్యాది రాకుండా ఎంతవరకు అరికడుతున్నాము, మన పిల్లల్ని ఎంతవరకు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము? తల్లి దండ్రులు చూసి చేసిన పెళ్ళిల్లే, కాని అప్పటికే హెచ్.ఐ.వి వుంటే వారికి తెలుసుకునే అవకాశం వుందా? ఒక వేళ వ్యాదికి గురి అయితే కూడా జీవిత కాలం పొడిగించుకుని ఆరోగ్యంగా జీవించే అవకాశం ఎంతమందికి కల్పిస్తున్నాము? తోటి మానవులుగా, కుటుంబ సభ్యులిగా, స్నేహితులుగా, అద్యాపకులిగా, డాక్టర్లుగా, బాధ్యత కలిగిన స్థానాలలో వుండి మనం ఎంతవరకు మన పాత్ర నిర్వహిస్తున్నాము?ఎంతవరకు హెచ్.ఐ.వి. కి గురైన వారికి బ్రతికే ధైర్యాన్ని ఇస్తున్నాము?

పెద్ద పెద్ద చదువులు చదివి, వుద్యోగాలలో వుంటూ...ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలియకుండా వుండే వారి వల్ల ఈ కుటుంబాలు మానసికంగా కూడా బ్రతికే శక్తి కోల్పోతున్నాయి అని కళ్ళారా చూస్తుంటే...ఇంకా ఇలాంటి ఎన్ని విషయాలు నాకు ఇంకా తెలియకుండా వున్నాయా అని భయం వేస్తుంది.

Friday, March 25, 2011

మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?


హాండ్సం బాస్ వుండటం ఎంతవరకు వుపయోగమో నాకు తెలీదు కానీ, నేను గమనించలేదు కాని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు వున్న బాస్ లలో ముగ్గురు తప్ప అందరు హండ్సం బాస్ లే. నేను వాళ్ళ పనినే చూశాను కాని వాళ్ళు హాండ్సం గా వున్నారా అని పాపం అసలు పట్టించుకోలేదు. కాని మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయాక షాపింగ్ వెల్దామని అక్కడే వుంటున్న నా కాలేజి ఫ్రెండ్ ని హొటెల్ దగ్గరికి వచ్చి పిక్ అప్ చేసుకోమని చెప్పాను. తన పేరు రాధిక.

విజయవాడ లో మా ఆఫీసు వాళ్ళు ఏదో ఒక పనికిమాలిన మీటింగ్ పెట్టారు రెండ్రోజులు. పగలంతా వాయించేశారు. ఇక సరే హాయిగా సాయంత్రం రిలాక్స్ అవుదామంటే మా బాస్ ఎక్కడ మళ్ళీ ఇంటర్నల్ టీం మీటింగ్ అంటాడో అని అతనేదో పనిలో బిజీ గా వున్నప్పుడు చూసి, ప్రీతం నేను సాయంత్రం బయటకి వెళ్తున్నా మనకేమీ వేరే మీటింగ్ లేదు కదా అని అడిగాను. "హ హా నో శిరీష  యు కెన్ గో అబ్సు ల్యూట్లేఅ నో ప్రాబ్లెం" అని హామీ ఇచ్చేశాడు. హమ్మయ్య అని నా ఫ్రెండ్ కి అర్జెంట్ గా కార్ తీసుకొని వచ్చెయ్ అని చెప్పేసా. తను కూడా మళ్ళీ నా మనసెక్కడ మారిపోతుందో అని( పాపం పూర్వానుభవం) వెంటనే వచ్చేసి రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ కూర్చుంది. నేను మీటింగ్ అవ్వగానే, స్కూల్ పిల్లలు బడి గంట కొట్టగానే పరిగెత్తినట్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే మా ఇతర జిల్లాల స్టాఫ్,  కొలీగ్స్ ఓయ్ ఎక్కడికి పారిపోతున్నవ్ చాలా రోజులకు కలిశావు పద మన బాసులని తిట్టుకుందాం ప్రశాంతం గా నీ రూం లో అన్నారు. వాళ్ళకి నచ్చజెప్పి, షాపింగ్ అయ్యాక డిన్నర్ చేసి బలంగా తిట్టుకుందాం అని బరోసా ఇచ్చి రిసెప్షన్ దగ్గరకి వచ్చేసరికి రాధ ఎదురుచూస్తు కూర్చుని వుంది. తన దగ్గరకి వచ్చెలోపల నా టీం మెంబర్ దగ్గర నుండి కాల్ వచ్చింది ప్రీతం అర్జెంట్ గా ఇంటర్నల్ మీటింగ్ పెట్టాలన్నారు, మీ రూం లో పెడదామా, నా రూం లోనా అని. ఇదేంటి సడన్ గా అని నేను హోటల్ వదిలి చాలా టైం అయింది, నేను లేను, నా రూము లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసా. కానీ తీరా చూస్తే ఎదురుగా ప్రీతం వస్తూ కనిపిస్తున్నాడు. నన్ను చూస్తే మళ్ళీ దొరికిపోతా అని నా ఫ్రెండ్ కి చిన్న సైగ చేసి పక్కకి తప్పుకున్నా. రాధ నా సైగలు చూసి ఎవరి దగ్గర దాక్కుంటున్నానా అని చూసి ప్రీతం ని చూసింది.

తరువాత ఇద్దరం బయటకొచ్చేసాము. తన కార్ లో కూర్చున్నాక అడిగింది ఎందుకు దాక్కున్నావు అని. నేనేమి దాక్కోలేదు. మా బాస్ మళ్ళీ సడన్ గా మీటింగ్ అన్నారు, నేను హొటెల్ లో లేనని నీకోసం అబద్దం చెప్పాను కాని బాస్ ఎదురుగ వస్తుంటే, నన్ను చూస్తే నేను మీటింగ్ వెళ్ళిపోవాలి, పాపం నువ్వు బాధపడతావని అలా మానేజ్ చేసా అని చెప్పాను. అవునా ఐతే ఓ.కె. అని బయలుదేరాము. కాసేపాగి మీ బాస్ భలే హ్యాండ్సం గా వున్నాడు, యంగ్ షారుఖ్ ఖాన్ లాగా అని చెప్పింది. అదిగో అప్పటి నుండి ఆలోచిస్తున్నా. నాకు ప్రీతం లో షారుఖ్ ఖాన్ కనిపించలేదేంటబ్బా అని. అసలు ప్రీతం హ్యాండ్సం ఆ? ప్రీతం కంటే కూడా హ్యాండ్సం బాస్ లు ఇంతకు ముందు కూడా వున్నారు,కానీ నాకెప్పుడు ఎందుకు బాస్ హ్యాండ్సం గా అనిపించడు అని. అసలు బాసు లు ఎక్కడైనా హ్యాండ్సం గా వుంటారా? ఈ రాధ కి ఏమీ తెలీదు పిచ్చి ముఖం ది.

బాస్ అంటే ఎప్పుడు కనిపించేది ఒక్కటే పని రాక్షషుడా, టార్గెట్ రాక్షషుడా, టైము రాక్షషుడా, డిసిప్లిన్ రాక్షషుడా ఇలా ఆలోచనలే వస్తాయి. అసలు నాకు తెలిసి బాసులు రెండు రకాలు. మంచి బాసు, చెడ్డ బాసు. అది ఆడ అయినా మగ అయినా. నాకు ఇంతవరకు ఆడ బాసు రాలేదు. ఒకసారి వున్నా నేను తనకి డైరెక్ట్ రిపోర్టింగ్ కాదు కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది మా ఇద్దరికి. ఇక మిగిలిన వాళ్ళందరు గవర్నమెంట్ లో వున్నంత కాలం పి.డి లు, ఐ.ఎ.ఎస్ లు. వాళ్ళెప్పుడు హడావిడి గా టెన్షన్ గా వుంటారు. ఏ మినిస్టర్ కో, ఏ కలక్టర్ కో వీళ్ళతో పడదు సో నేను కూడా నా బాసు శత్రువులని నా శత్రువుగా భావించి వాళ్ళు పెట్టే సమస్యలని తప్పించుకోవటం ఎలా, టార్గెట్లు రీచ్ అవ్వటం ఎలా, ప్రొగ్రాం లో ఏ మాట పడకుండా మేమంతా బయట పడటం ఎలా అని సతమతం అవుతుండటం తో సరిపోయేది. ఈ గొడవలో బాస్ హ్యాండ్సం అవునా కాదా ఎవరికి పడుతుంది. మంచి వాడా కాదా, ఇతను చేసే పనులు ప్రజలకి వుపయోగమా కాదా అని ఆలోచన వస్తుంది.పని ఎప్పటికీ తెమలదు. అంత పని వుంటుంది.

ఇక ఎన్.జి.ఓ లో ఇక్కడ పని కంటే పద్ధతులు, ప్రొసీజర్ లు ఎక్కువ. చేసే పని టార్గెట్లు తక్కువే కాని లోతెక్కువ.అందరికి స్వేచ్చ ఎక్కువ కాబట్టి ఒక పని చెయ్యలంటే వంద మంది వంద రకాల తప్పులు చూపిస్తారు,వంద ఆలోచనలు వంద దారులు చూపిస్తారు. ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో అసలు చెయ్యాలో వద్దో అని సతమతం అవుతుంటాము. ప్రతీ ఒక్కరు చెప్పే దానిలో ఒక అర్ధం వుంటుంది. ఎంతో లెర్నింగ్ వుంటుంది. తక్కువ డబ్బు ని ఎంత బాగా ఎక్కువమందికి తక్కువ క్రిటిసిజం తో వుపయోగించాలో అని తల పగలగొట్టుకోవాలి. ఈ ప్రాసెస్ లో బాస్ హ్యాండ్సం అయితే ఎంత కాకపోతే ఎంత. విపరీతమైన టూరింగ్, ఇంటికి వస్తే బ్యాగు లో మాసిన బట్టలు తీసి మంచి బట్టలు పెట్టుకునే టైము మాత్రమే వుంటుంటే, మొగుడు, పిల్లలు, ఇల్లు, కాయగూరలు, పప్పు వుప్పు, పనమ్మాయి, పిల్లాడి పరీక్షలు వీటికే సమయం దొరకట్లేదు ఇక బాస్ హ్యాండ్సం గా ఎలా కనిపిస్తాడు. అతని ఫోన్ వస్తుంటే హమ్మో ఇంకేమి కొత్త పని వచ్చిందో లేక సమస్య వచ్చిందో అనే ఆలోచన మాత్రమే వస్తుంది.

ఇవి కాక మా పని లో ఎంతో స్త్రగుల్. కొన్ని కుటుంబాలలో జీవితాలలో కొంతైన సమస్యలు తీర్చగలిగితే చాలు అనిపించె వుద్యోగాలు. కాని ప్రొసీజర్లు పద్దతులు బ్యూరోక్రసీ మన మనసులో సున్నితత్వాన్ని నలిపేస్తుంటాయి. ఆ సమయంలో ప్రజల ప్రయోజనం కోసం పోరాడే బాసే హ్యండ్సం గా కనిపిస్తాడు. అది కూడా.. ఆ పని, ఆ ప్రజలు మన వాళ్ళు అని ఫీల్ అవుతున్న కొలదీ, బాసు, వుద్యోగులు కలిసి ఆ పని మనది అనుకున్నప్పుడు ఒక రకమైన "మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఇక అందం ఒక అంశమే కాదు" మన అమ్మ, నాన్న మనకి అందం గా కనిపించరా? అలాగే మన టీం అనుకుంటే వారిలో బలం, బలహీనత మనదే, వారి అందం మన పనికి, విజయానికి, అపజయానికి ఎటువంటి వుపయోగం లేదు, అవసరం లేదు.

నాకు తెలిసి వుద్యోగం లో, పనిలో విపరీతమైన ఒత్తిడిలో ఏదో చెయ్యలనే తపనలో నలిగి పోతున్న వాళ్ళందరికీ మన పనిలో పరిచయాలు కేవలం ఒక సబ్జెక్ట్ గా మాత్రమె కనిపిస్తాయి అనుకుంటా. నాకు తెలిసి ఎవరైన  నా బాసుల గురించి చెప్పమంటే మొదటి బాసు...గిరిజనుల కోసం వారి ప్రాచీన సంస్కృతి కోసం తపన పడే పెద్దాయన గౌతం శంకర్, నేను ఎప్పటికైన అతని లా ఒక కాజ్ కోసం జీవితం అంకితం చెయ్యగలనా అనిపిస్తుంది. రెండవ బాస్ గిరిజా శంకర్....నడుస్తున్న ఆరాటం, తన పరిధిలో తనకి వీలయ్యేంత మార్పు తీసుకురావాలనుకునే తపన తో బొంగరంలా పరిగెడుతుండే మనిషి. ఇక ఆ తరువాత కూడా కొందరు మంచి బాసులు, ఏదో లే టైము గడిచిపోతే చాలు అనుకునే వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, వున్న పదవిని దుర్వినియోగం చేసిన వాళ్ళు, విపరీతంగా పని చేసే వాళ్ళు, రాత్రి పగలు మరిచి పని చేస్తున్నా పక్క వారి గురించి పట్టించుకునే వాళ్ళు, ఆఫీస్ అటెండర్ ఇంట్లో అవసరాలని కూడా కనిపెట్టి కనుక్కునే వాళ్ళు, తను టెన్షన్ పడుతూ అందరిని టెన్షన్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేసే వాళ్ళు, ఎంత పెద్ద సమస్య అయినా, టెన్షన్ అయినా తనే తీసుకొని మనకి మార్గం చూపించి పని జరిపించే వాళ్ళు, తన టీం మీద విపరీతమైన మమకారం వున్న వాళ్ళు, తన టీం ని బయపెట్టి పని జరిగేలా చేసుకొని పదోన్నతి పొందటమే జీవితాశయం అయిన వాళ్ళు, ప్రజల కి, తన టీం కి అండగా నిలబడి వారి మీద నమ్మకమే తన మేనేజ్మెంట్ తరహా గా చూపించే వాళ్ళు


ఇలా ఎంతో మంది బాసులు. విపరీతమైన మంచి చూశాను, విపరీతమైన చెడు చూశాను. కానీ ఎవరూ కూడా (జీవితంలో ఏ మనిషి కూడా) అన్ని విషయాలలో చెడు కాదు, అన్నివిషయాలలో మంచి కాదు. అందరికీ మంచి వారు కాదు, అలా అని అందరికి చెడ్డవారు కాదు. ఎన్నో రకాల అందాలు, వికారాలు చూసాను. యె బాస్ హ్యాండ్సం అంటే ఏమి చెప్పాలి. ఒక్కో బాస్ లో ఒక్కో అందం. ప్రతీ బాసు కి ఇంకో అందమైనా లేద వికారమైన బాసు వుంటారు.

అసలు విషయం మరిచిపోయా...బాసులని తిట్టుకోవటం అనేది మన జన్మ హక్కు. అంతే కాని ప్రీతం మంచివాడని తిట్టుకోవటం మాత్రం మానేయం. మరి మీ బాస్ హ్యాండ్సమా?? కాదా?

Monday, November 29, 2010

తూ.గో.జి. వారికి ఒక విఙ్ఞప్తి

తూర్పు గోదావరి జిల్లా బ్లాగర్స్ కి ఒక విఙ్ఞప్తి, నేను ఒక క్విజ్ కార్యక్రమం చేయబోతున్నాను. అందులో తూర్పు గోదావరి కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సమాధానాలు కావాలి. నాకంటే మీ జిల్లాకి సంబంధించిన సమాచారం మీ అందరి దగ్గర బాగా వుంటుంది. కాబట్టి దయచేసి తూర్పు గోదావరి జిల్లాకి సంబందించి ఏవైనా ప్రశ్నలు వుంటే రేపు ఎల్లుండిలోపల నాకు పంపండి. మరీ కష్టమైనవి కాకుండా మరీ అందరికీ తెలిసేవి కాకుండా వుంటే బాగుంటాయి.

మీ సహాయానికి కృతఙ్ఞతలు.

Tuesday, November 23, 2010

రక్త చరిత్ర.2....ఎవరికి వుపయోగం!!

ఏ సంఘటన వల్ల ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అసలు ఊహించలేము. కానీ ఆవేశం తో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం ఎప్పుడూ విపరీతాలే జరుగుతాయి. సమరసిం హారెడ్డీ అనే పోస్ట్ లో సరదాగా ప్రస్తావించాను రెడ్డి లవ్ స్టోరీ అని. కానీ నిజానికి అంత సరదాగా ఆకధలు ముగియలేదు. అనసూయమ్మ, మా ఊరి ఫ్యాక్షన్ లీడర్ బార్య, ఆమెకి స్వంతంగా పిల్లలు లేరు కాని ఆమె తన మేనల్లుడు గౌరు వెంకట్రెడ్డి ని దత్తత తీసుకుంది అంటున్నారు కాని ఈ ఊరి గొడవల్లో డైరెక్టుగా గౌరు వెంకట రెడ్డికి, గౌరు చరితకి మాత్రం సంబంధం వుంది అనేది అక్కడి పసిపిల్లలికి కూడా తెలిసిన నిజం అయినా కూడా వాళ్ళు ముగ్గురు బయట ఎందుకున్నారో, ఏ సంబంధం లేని వాళ్ళు జైలు లో ఎందుకున్నారో మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం.
ఇక అనసూయమ్మ భర్త కి ఒక అన్న వున్నాడు అతను కాస్త మెతక మనిషి కావటం, అతనికి ముగ్గురు ఆడపిల్లలు కావటం, మగపిల్లాడు అందరికంటే చిన్నవాడు కావటం వల్ల అతను ఈ గొడవల్లో పెద్దగా తలదూర్చలేదు. కాని ఆ కుటుంబంలో వుండటం వల్ల వారి పిల్లల జీవితాలు కూడా తారుమారు అయిపోయాయి. అతని పెద్ద కూతురుకి అప్పటికే పెళ్ళి అయి భర్త కర్నూలు లో లాయర్ గా పనిచేస్తున్నాడు. కాని అతని మీద కేసు వేసారు. అంతే కాదు ప్రాణ భయం కూడా ఇక చేసేది లేక అతను కూడా ఈ గొడవల్లోకి రావలసి వచ్చింది. ఇక రెండో అమ్మాయి...అపర్ణ. అందమైన, సున్నితమైన అమ్మాయి. వెంకటేశ్వర రెడ్డి ( నా రెడ్డి ) తో తనకి పెళ్ళి అనే అందరు చెప్పటం, రెడ్డీ కూడా తన చుట్టూ తిరగటం చూసి, జీవితాన్ని అందంగా ఊహించుకొని కాలం గడుపుతుంది. కాని అనుకోని విధంగా ఈ ఫ్యాక్షన్, చిన్నాన్న చనిపోవటం, స్వంత బంధువులే చంపటం, అక్క భర్త జైలు కి వెళ్ళటం, తమ ఇంట్లో అందరికీ అకస్మాత్తుగా ప్రాణ భయం రావటం ....తన జీవితాన్ని ఎంత గా తలకిందులు చేస్తాయో అపర్ణ ఊహించలేకపోయింది. మహా అయితే తన పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది అని, లేదా రెడ్డీ తో పెళ్ళి అయ్యాక రెడ్డి కూడా కేసుల్లో పడాల్సి వస్తుంది అని ఊహించింది. కానీ....
రెడ్డి వాళ్ళ అమ్మ, అంటే మా అత్తమ్మ తన కొడుకు మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ( అదేంటో రాయలసీమ లో కొడుకొక్కడే తమకి పుట్టిన బిడ్డ అని కూతుర్లు మాకేమీ కాదనే వుద్దేశ్యంతో వుంటారనిపిస్తుంది.ఒక్కొక్కరి ఇంట్లో తమ కూతుర్లకు వాళ్ళు చేసేది చూస్తే నాకు ఇలా అనిపించింది. వాళ్ళకి తిండి పెట్టాలి, చదివించినా పైగా కట్నాలివ్వాలి అని వాళ్ళేదో పరాయివాళ్ళన్నట్లు మాట్లాడుతుంటారు, మా వాడికేమైనా ఐతే ఇక మేమెందుకు బతకాలి అని, మా మనవడున్నాడు వాని తరువాతే మీరు అని ఇలా అన్నిట్లో కూతురిని, కూతురి పిల్లల్ని వేరు చేసి ఎదురుగానే మాట్లాడుతారు, ఆ సమయంలో మా ఆడబిడ్డల్ని చూస్తే నాకు ఏడుపొస్తుంది, కాని వాళ్ళకి కూడా అది అలవాటేమో పెద్దగా ఫీల్ అవ్వరు) ఇటువంటి పరిస్థితి వున్నప్పుడు ఎవరు కోరి అటువంటి పరిస్థితుల్లోకి కొడుకు ప్రాణాలు పణంగా పెడతారు? అందుకే ఎట్టి పరిస్థితిలో అపర్ణని చేసుకోవద్దు అని మా అత్తయ్య ఒట్టు పెట్టించేసుకున్నారు. రెడ్డి కాని, అపర్ణ కాని ఎవరూ ఏమి చెయ్యలేని పరిస్థితి ఊర్లో వున్న పరిస్థితి.ఆ సమయంలో ఎందరి పెళ్ళిళ్లో తప్పి పోయాయి, ఎన్నో కధలు గుండెల్లో మిగిలిపోయాయి, వీళ్ళిద్దరు ఎదురుపడి ఎప్పుడూ మాట్లడుకోలేదు, ఏదో తెలియని నమ్మకం మాత్రమే ఒకరికొకరం అని , పెద్దలు కూడా పక్కాగా అడగటం జరగలేదు,ఖాయం చేసుకున్నది లేదు. కాదు అని చెప్పుకున్నది లేదు. కాని అందరి వుద్దేశ్యాలు అందరికి అర్ధం అయ్యాయి. రెడ్డిని హైదెరాబాదు చదువుకోసమని పంపేసారు (ముఖ్యంగా ఈ గొడవల్లో ఎక్కడ ఇరుక్కుంటాడో అని ) రెడ్డి బాధతో నలిగిపోయినా ఏమీ చెయ్యలేని వయసు.
కాని అపర్ణ వాళ్ళ పెద్దలు కాస్త ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదంటే మా అమ్మాయికి పెళ్ళే కాదా, అతి త్వరలో గొప్ప ఆస్టిపరుడుని తెచ్చి చేస్తాము అని శపదం చేసి మరీ ఒక డబ్బున్న పెద్దమనిషికి ఇచ్చి అర్జెంటుగా పెళ్ళి చేశారు. అతను నిజంగా పెద్ద మనిషే, వయసులో, అన్ని రకాల వ్యసనాలలో, ఆస్థిలో అన్నిట్లో పెద్ద వాడే. సీమ పల్లెల్లో వున్న (నాకు ఎదురైన) ఇంకో బయంకరమైన ఆలోచన ఇది. పొలం, ఆస్తి వుంటే చాలు పిల్లని ఇచ్చేస్తారు. తాగుడు, ఇతర వ్యసనాలు వున్నాయని తెలిసినా అది ఒక విషయం అని ఎవరు కనీసం మాట్లాడరు. తాగితే తప్పా, తిరిగితే తప్పా, ఆస్తి వుంది కదా అని చూస్తారు. అమ్మాయికి ఇష్టమా అని కూడా అడగరు అనుకుంటా. అలా అపర్ణ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి రోజు రెడ్డి పడిన నరకం తను నాతో చెప్పినప్పుడు ఎప్పుడు చూడని కన్నీరు తన కళ్ళల్లో కొంచెం మెరిసి మాయమయ్యినప్పుడు అర్ధం అయింది. అపర్ణ పెళ్ళి రోజు ఏ పని లేకపోయిన నంద్యాల వెళ్ళి, పెళ్ళి జరిగే కళ్యాణ మండపం రోడ్డులో అటు ఇటు తిరిగాడంట, ఏ కారణం చేత ఐనా పెళ్ళి ఆగిపోతుందేమో అని, ఎవరో దూరపు బంధుత్వాన్ని సాకుగా చెప్పి వాళ్ళింటికి వెళ్ళి పెళ్ళి అయిపోయిందా, అపర్ణ బాగానే వుందా అని అనవసరమైన మాటలాడి, మళ్ళీ తనే తన తెలివితక్కువ తనానికి సిగ్గుపడి వచ్చేసాడంట. ఆ చిన్న వయసులో ఏమీ చెయ్యలేకపోయినా ప్రేమ మాత్రం ఎంతో స్వచ్ఛంగా వుంటుంది. కాని పరిస్థితులు ఎప్పుడు స్వచ్చంగా కలిగే ప్రేమ కి వ్యతిరేకంగానే వుంటాయేమో ! లేక దొరకదు అని తెలిసినప్పుడే ప్రేమ తీవ్రంగా వుంటుందా? ఏమో...!!!!
అపర్ణ కి పెళ్ళి అయినదగ్గర నుండి జీవితం నరకం అయిపోయింది. చిన్న వయసు, హాయిగా కలలు కంటున్న లోకం లో నుండి భయంకరమైన వాస్తవంలోకి దారుణంగా వచ్చి పడింది. అపర్ణ భర్త వ్యసనపరుడే కాదు, శాడిస్ట్ అని చెప్తారు. దానికి సాక్ష్యం ఆమె వంటి నిండా వున్న దెబ్బలు, సిగరెట్ తో కాల్చిన గుర్తులు. అతనికి చాల మంది తో అక్రమ సంబంధాలు, తాగుడు, శాడిజం... ఇవి కాక అపర్ణ ని ఎప్పుడూ ఇంటికి పంపేవాడు కాదు. ఒక వేళ పంపినా సాయంత్రానికి తిరిగి రావలసిందే. ఆమె పడే నరకం ఊర్లో అందరికీ అర్ధం అయేంతగా వుండేది. ఎన్ని కష్టాలో పడింది గొప్ప ఇల్లాలు అని పొగుడుతుంటారు ఆమె కష్టాలు తప్పించాలని ఆలోచన చెయ్యలేని ఈ మూర్ఖులు. ఇక ఆమె శరీరం తట్టుకో లేకపోయింది. మంచం పట్టింది. అప్పటికి ఆమె తల్లిదండ్రులకి కరుణ కలిగింది. అపర్ణని తమ ఇంటికి తీసుకొచ్చేశారు. కాని అపర్ణ ఎవరితో మాట్లాడటం మానేసింది. తనని తాను ఒక గదిలో బంధించుకుంది.  అపర్ణ కి ఒక బాబు పుట్టాడు, కొన్నాళ్ళకి ఆమె భర్త ఎయిడ్స్ వ్యాదితో మరణించాడు. ఆఖరి రోజుల్లో అపర్ణని చూడాలని తపించాడు. కాని అప్పటికే అపర్ణ ఈలోకంతో అన్ని సంబంధాలు తెంచుకొని తన గదిలో బంధీ అయిపోయింది, బాబు కూడా చనిపోయాడు, అపర్ణ కి కూడా ఎయిడ్స్ సోకిందని పరీక్షల ద్వారా తెలిసింది. అపర్ణ మరీ క్రుంగిపోయింది. వెలుగు కూడా భరించలేనంత చీకటిలో వుండిపోయింది. తను ఆ విధంగా ఒక డిప్రెషన్లో వుందని తెలిసి కూడా ఆమెకి అవసరమైన వైద్యం చేయించలేదు.
అపర్ణ జీవితం ఇలా వుంటే రెడ్డి ఈ లోగా చదువు పూర్తయ్యి, మొదట UNDP  ప్రాజెక్టులో తరువాత వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తూ శ్రికాకుళం, వజ్రపు కొత్తూరు వచ్చాడు. రెడ్డీ ఎప్పుడూ మౌనంగా, అందరికీ దూరంగా వుండేవాడు. కాని తన టీం లో వున్న నేను, శ్రీను విపరీతమైన అల్లరి చేస్తూ జీవితం అంటే సంతోషమే అన్నట్లు వుండే వాళ్ళం. మేము పెరిగిన పరిస్థితుల్లో మాకు అంత తీవ్రమైన కష్టాలు లేవు. పరిస్థితులు ఒకే లా పుట్టిన పిల్లల్ని ఎలా మారుస్తాయో ఆ తేడా నన్ను, రెడ్డిని చూస్తే తెలుస్తుంది. శ్రీను కి పేదరికం, తల్లి చనిపోవటం వంటివి కష్టాలున్నా తనెప్పుడూ నవ్వుల బ్రహ్మానందం లా అందరిని నవ్విస్తూ వుంటాడు. మా ఇద్దరి స్నేహం, ఆటలు, నవ్వులు చూసి రెడ్డిలో కూడా చలనం వచ్చింది. (ఆ కధ అంతా నా ముందు పోస్ట్ లలో రాశాను కదా) కొన్నాళ్ళకు మాతో పాటు కలిసిపోయాడు. వాళ్ళ ఊరికధలు చెప్పాడు, కాని నేను వాటి తీవ్రత అర్ధం చేసుకోలేదు నిజంగా. వాటి ప్రభావం నా జీవితం మీద పెద్దగా లేదు కూడా. రెడ్డి ని నేను పెళ్ళి చేసుకొని ఆ ఊరెళ్ళాక నాకు ఆ ఊర్లో చూడాలనిపించింది, కలవాలనిపించింది కూడా అపర్ణ నే. ఆ ఊర్లో మగ పిల్లలందరూ జైలులో వున్నప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగటం బహుశా చాలా మందికి బాధ కలిగించి వుండొచ్చు. చాలా తిట్టుకున్నారని కూడా చెప్పారు అత్తయ్య. ఇవన్నీ నాకు తెలీదు. నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడాలని చూసినా అందరూ నాతో కాస్త దూరం గానే వుండే వాళ్ళు అనిపించేది ఆ ఊర్లో, దగ్గరి బంధువులు తప్ప. కానీ అక్కడి ఎస్.సి కాలనీ లో మహిళలు మాత్రం నాకు ముందుగా తెలుసు. కారణం కర్నూలు జిల్లా నుండి వెలుగు ప్రాజెక్టు కమ్యూనిటీ రెసోర్స్ పర్సన్స్ గా అక్కడి చుట్టుపక్కల పల్లెల్లో ఎస్.సి మహిళలు శ్రికాకుళం వచ్చినప్పుడు నాకు పరిచయం. వాళ్ళు మాత్రం నన్ను కలిసేందుకు మేడం, మా మేడం అని నేను వెళ్ళినప్పుడంతా వస్తారు.
మా పెళ్ళి తరువాత నేను మా అత్తగాఇంటికి వెళ్ళి నప్పుడు రెడ్డీ ని ఎన్నో సార్లు అడిగాను అపర్ణ ని కలవాలి అని, అత్తయ్యని కూడా, అపర్ణ ఎవరినీ కలవదు, ఆమెకి ఎయిడ్స్ అని చెప్పారు. కాని మా మిద్దెమీదకి వాళ్ల మిద్దె, తను వుండే గది కిటికీ కనిపించేవి. నేను పైకెళితే నాకెప్పుడూ అపర్ణ రెడ్డి మీద కోపంతో ఆ గదిలో తనని శిక్షించుకుంటుంది అనిపించేది. రెడ్డీ కి చెప్తే నువ్వంత ఆలోచించకు అనేవాడు. ఎన్నోసార్లు ఎవరికీ తెలీకుండా అయినా వెళ్ళి తనని కలవాలనిపించేది. తనని ఆ పరిస్థితిలో వదిలేసింది రెడ్డీ అనిపించేది, నా బాద్యతే తనని బయటకి తీసుకు రావటం అనిపించేది. మా పెళ్ళి అయిన సంవత్సరం లోపలే అపర్ణ చనిపోయింది. ఆ రోజు రెడ్డి బాధపడ్డాడో లేదో నాకు తెలీదు కాని నాకు చాలా బాధ వేసింది. రెడ్డి కొంచెం ధైర్యం చేసి వుంటే అపర్ణ ఈ రోజు నా స్థానం లో వుండేది, కనీసం ఇలా దారుణమైన జీవితం అనుభవించి చనిపోయేది కాదు అని రెడ్డి తో అనేశాను. నాకు ఆమెని తలుచుకున్నప్పుడంతా ఎంతో బాధ కలుగుతుంది.

ఫ్యాక్షన్ వల్ల ఒక తరం అంతా ప్రభావితమవుతుంది. పిల్లలికి చదువులుండవు, చిన్న పిల్లలు పనిచెయ్యాల్సి వస్తుంది. ఆడపిల్లలికి కనీసం మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళి చెయ్యలేరు. మగ పిల్లలికి కూడా. హత్యల తరువాత ఊర్లో వాతావరణం నరకం అయిపోతుంది. ఏ క్షణంలో ఎవరు ఎవరిని చంపుతారో, ఎవరింటికి, పొలానికి నిప్పంటిస్తారో అని భయంతో బ్రతకాలి. నిన్నటివరకు అత్తా, మావా, బావ అని వరసలు పెట్టి పిలుచుకుని, ప్రతీ అవసరానికి తోడుగా వున్న వాళ్ళు ఈరోజు ఉద్వేగంతో యమకింకరులై మనమీద కొడవలి ఎత్తి నరకడానికి, నిప్పు పెట్టి మనల్ని తగలబెట్టడానికి వస్తారు. ఇది అదుపులో పెట్టడానికి పోలీసులు మోహరించి కర్ఫ్యూ విదిస్తే అది ఇంకో నరకం, అందరూ ఊరు వదిలి, పశువులను , పొలాలను వదిలి ఎక్కడో దూరంగా బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళలేని వాళ్ళు పోలీసులు చూపించే నరకం అనుభవిస్తూ, ప్రాణాలు, వారికున్న కోడి, మేక ఆస్థులు కాపాడుకోడానికి నానా అవస్థలు పడ్డారని అత్తయ్య చెప్తారు. ఊరి మొత్తానికి అత్తయ్య ఒక్కరే ఆడ మనిషి ఆ సమయంలో వున్నారంట. నా తప్పు లేకుండా మేమెందుకు భయపడాలి అని వున్నారంట. ఇంట్లో ముసలి వాళ్ళు, ఆడపిల్లల్ని తీసుకొని ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఆమెది.  ఇక ఇది ఇలా వుంటే జైలు కి వెళ్ళని వారంటూ ఆ ఊర్లో మిగలలేదు. ముసలి, పిల్లా అని తేడా లేకుండా అందరిని పోలీసులు పట్టుకెళ్ళారు. విచారణ పేరుతో వారాల పాటు, భయం వల్ల నెలలు పాటు ఊరొదిలి ఎక్కడెక్కడో తిరిగారు, దాక్కున్నారు మగవాళ్ళంతా.

కేసుల్లో జైలుకెళ్ళిన వారి కుటుంబాల అవస్థలు ఇప్పటికీ తీరలేదు. ప్రతి అవసరానికి జైలులో వున్న వాళ్ళని బెయిలు మీద ఇంటికి తేవాలంటే ఎంతో డబ్బు కావాలి. సంపాదించే మనిషి లేక ఆడవారి మీద కుటుంబం మొత్తం భారం పడుతుంది. ఊర్లో వాళ్ళు తమ ఆస్తులు పొలాలు కబ్జా చెయ్యకుండా చూసుకోవాలని కూడా ఆడవాళ్ళు భయపడాలి. వయసులో వున్న ఆడవాళ్ళు భర్త లేక, భవిష్యత్తు ఏంటో తెలియక రకరకాల సమస్యలు, కుటుంబ ఆసరా కొసం అక్రమ సంబంధాలు, ఇలా....చెప్పుకుంటూ పోతే ఒక తరం లో ముసలి వాళ్ళు, వయసు వాళ్ళు, పిల్లలు అందరూ ఎన్నో అవస్థలు పడతారు. కొందరి జీవితాలు నరక ప్రాయం అయిపోతాయి అపర్ణ లా, వసంత, రవి  ల లా ( బి.ఇ.డి లవర్స్)
కానీ ఈ స్థితి కి కారణమైన కుటుంబాలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదుగుతూ బాగానే వున్నారు. మంచో చెడో పేరు బాగా సంపాదిస్తున్నారు. అలా అని వారి జీవితాలు అంత గొప్పగా లేవు. అపర్ణ ఆ ఇంట్లో అమ్మాయే. అనసూయమ్మ పగ, ప్రతీకారాలతో కేసులతో అడవులలో తిరిగింది కొన్నాళ్ళు.
మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది అడిగారు. నేను ఒక ముక్కలో చెప్పే పరిష్కారం ఏమీ లేదు. కానీ నా అనుభవం ప్రకారం సీమ లో పేదరికం ఎక్కువ, వర్షాధార పంటలవల్ల అయివుండొచ్చు. ఎక్కువ నిరక్షరాస్యత. ఆడపిల్లలికి చదువు ఇంకా తక్కువే. నిరక్షరాస్యత వల్ల నే ఎన్నో మూఢాచారాలు, కోపం, మూర్ఖత్వం. అందరూ చదువుకొని, ఆడ మగ బేధం తగ్గించుకొని, కాస్త ఆలోచన పెంచుకోవటం మంచిది. వారిని వాడుకొని ఈ పెద్దలు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోగలిగితే వాళ్ళే బయట పడగలరు.అది ఒకసారిగా జరగదు. కొన్ని తరాలు మారాలి. హింస కి హింసే జవాబు కూడా కాదు అనే ఆలోచన వస్తే ఒక హత్య తో ఆగిపోయేది ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవి కాదు. మన చరిత్ర రక్త చరిత్ర అయితే ఆ రక్తం ఎవరిది? కేవలం ఆ ఒక్క కుటుంబానిదేనా? అందరి రక్తాలు చిందించిన ఆ చరిత్ర ఎవరికి వుపయోగం!!ఎంతో భవిష్యత్తు వున్న వారి జీవితాలు అర్ధాంతరంగా చరిత్రలయిపోడానికా?

Thursday, November 18, 2010

మా ఊరి రక్త చరిత్ర - ఫ్యాక్షన్ అసలు కధ

 (సమర సిం హా రెడ్డి తరువాత భాగం)
ఫ్యాక్షన్... ఇలాంటి ఒక పదం వుంది అనికూడా నాకు తెలియదు. నా పెళ్ళి వెంకటేశ్వర రెడ్డీ తో జరిగిన వరకు. జీవితంలో కొన్ని ఎందుకు జరుగుతాయో అసలు అర్ధం కాదు. నేనెక్కడో విజయనగరం జిల్లాలో ఒక చిన్న టౌన్ లో పుట్టి పెరిగాను, నా ఊహలు మహా అయితే వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు వుండేవేమో నా భవిష్యత్ గురించి. కానీ ఏదో సినిమా కధలా గా రక రకాల మలుపులు తిరిగి నేను రెడ్డీ ని పెళ్ళి చేసుకున్నాను. ఆ గ్రామంలో ఇంట్లో నాకు అన్నీ కొత్తగా అనిపించాయి. మన దేశంలోనే వున్నా అది ఒక పరాయి లోకం లా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ, మన బాషే అయినా ఒక్క ముక్క కూడా అర్ధమై చచ్చేది కాదు పెళ్ళి అయిన కొత్తలో. ఇప్పుడు కాస్త నయం. వాళ్ళు తినే తిండి, మెసిలే పద్ధతి, ఇళ్ళు, వంట, నిద్ర అన్నీ ప్రతీది కొత్త. పెళ్ళైన రోజే ఆ ఊరు చూడడానికే వింతగా వుంది. అన్నీ మట్టి మిద్దెలు. ఒకరి మిద్దె మీద మొదలుపెడితే వీధి చివర కి మిద్దెల మీద రోడ్ లాగా నడుచుకొని పోవచ్చు. ఇళ్ళు బండలతో పలకలతో కట్టుకుంటారు, దేవాలయానికి వున్నట్లు పెద్ద పెద్ద తలుపులు, గుమ్మాలు. అన్నిటికంటే వింత ఇంట్లోనే పశువులు కూడా కడతారు. మనుషులు పశువులు కలిపి ఒకే ఇంట్లో వుండటం అనేది వాళ్ళు చెప్పే గొప్ప రీజన్స్ ఎలా వున్నా నాకు మాత్రం కష్టమే. దోమలు ఈగల్లా ముసురుతుంటాయి దాని వల్ల. ఈగలు కూడా ఎక్కువే. నాకోసమని పెళ్ళి కి బాత్రూం, లెట్రిన్ కట్టించారంట మా ఇంట్లో. సాధారణంగా పల్లెల్లో ఇది చాలా ఇళ్ళల్లో వుండే సమస్యనే. కాకపోతే బాత్రూం లో ఎవరివో బాంబులు దాచిపెట్టడం మాత్రం సాధారణం కాదు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ ఊరి ఫ్యాక్షన్ కధ మా అత్తయ్య ద్వార, మిగిలిన వాళ్ళ ద్వారా వింటుంటే తెలుసుకుంటుంటే నేను సినిమాల్లో చూసిన బాలకృష్ణ, చిరంజీవి కధలు కాదు అని అర్ధం అయింది.అక్కడ ప్రతీ ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు జైల్లో వున్నారు. మొదటగా వెకటేశ్వర రెడ్డి (ఇతను ఫ్యాక్షన్ ఒక వైపు లీడర్) ని చంపిన తరువాత అతని భార్య అప్పటి నుండి ఒక పెద్ద ముఠా ని ఇంట్లోనే వుంచి వాళ్ళకి తిండి, బాంబుల తయారి, హత్యల ప్లానింగ్ లాంటి వాటికోసం వాడుకుంది. వీళ్ళందరి ని మెంటైన్ చెయ్యడానికి ఆవిడకి వున్న 500 ఎకరాల పొలం లో కొంత అమ్మేసుకుంది. అది చూసి వీళ్ళందరు గొప్పగా ఫీల్ అయ్యారు. మీ అందరికి ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. అది విని ఆవిడ వుండగా మనకేంటి అనుకున్నారు. కాని ఆపోజిట్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవటం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఇంటికొకరు చొప్పున జైల్లో పడ్డారు.

ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాధమైన కధ. కొన్ని ఇళ్ళు తాళాలు పడిపోయాయి శాశ్వతంగా ఆ ఇంట్లో ఎవరూ లేకుండా జైలుకి వెళ్ళిపోయారు. ముసలి తల్లి దండ్రులు పిల్లల మీద దిగులుతో చనిపోయారు. పిల్లల తల్లులు కుటుంబం లో వ్యవసాయం చేసే మగ వాళ్ళు లేక కూలిలుగా మారిపోయారు. ఊర్లో వున్న కొందరు మగవాళ్ళ తో పనులు జరగాలంటే మిగిలిన ఆడ వాళ్ళు ఎన్నో రకాలుగా బతిమలాడుకోవాలి. స్త్రీ పురుషుల జనాభా తేడాల వల్ల, జీవనాధారం పోవటం వల్ల ఎన్నో అక్రమ సంభంధాలు(అలా అనొచ్చో లేదో నాకు తెలీదు). జైలుకి వెళ్ళిన వాళ్ళలో ఇంజనీర్లు చదివిన అబ్బాయిలు, ఎం.బి.ఎ లు చేసిన వాళ్ళు, టీచర్లు ఇలా చదువుకుని జీవితంలో ఎన్నో సాధించాల్సిన వాళ్ళున్నారు. పెళ్ళిళ్ళు చేసుకొని కళకళలాడాల్సిన కుటుంబాలలో చీకటి, ఒంటరితనం, దిగులు, భయం నిండిపోయింది. అంత పెద్ద ఇంట్లో ఒక్కరే బిక్కు బిక్కుమనే వాళ్ళున్నారు. ఎవరి కోసమో మన పిల్లలు బలైపోయారని, అన్నీ చూసుకుంటానని చెప్పిన ఆవిడ చేతులెత్తేసి తను రాజకీయంగా ఎదిగిపోతుంటే చూస్తు కడుపు రగిలిపోతున్నవాళ్ళే వున్నారు. ఆపోజిట్ వాళ్ళలో మొదటిసారి వీరి ఆవేశానికి, రెండవసారి వీళ్ళు ప్లాన్ ప్రాకారం చనిపోయిన వ్యక్తులున్నారు. వారి కుటుంబాలు కూడా సంతోషంగా లేవు.

ఈ కేసులు, జైల్లు ఇదంతా ఒక వేరే ప్రపంచం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట. ఎన్నో విషయాల మీద వీరి తీర్పు ఆధారపడి వుంటుంది. జడ్జికి లంచం ఇవ్వడానికోసమని ఊరందరూ చందాలేసుకుంటారు. నాకు తెలిసిన లోకంలో జడ్జి అంటే దేవుడు. కాని వీళ్ళకి లంచం తీసుకొని కూడా మంచి చెయ్యని ఒక లంచగొండి. ఎలక్షన్లు వస్తే నా వరకు నేను ఆలోచించేది మహా అయితే మన లోకల్ ఎం.ఎల్.ఎ కేండిడేట్లలో ఎవరు తక్కువ చెడ్డవాడు అని, ఏ పార్టీ గెలిస్తే కాస్త తక్కువ అవినీతి వుంటుంది అని మాత్రమే. కాని ఇక్కడ ఎలక్షన్లంటే ధారాళంగా ఎవరు మందు పోస్తారు, ఎవరు కుటుంబానికి ఎంత ఇస్తారు అని మాత్రమే కాదు. ఎవరు గెలిస్తే మన కేసులు ఎత్తేస్తారు, ఏ పార్టీ గెలిస్తే ఎవరు జడ్జిగా వస్తారు, ఎవరు గెలిస్తే మనకి లైఫ్ పడుతుంది, ఎవరు గెలిస్తే మనకి లంచం తగ్గుతుంది అని. ఎలక్షన్లు ఈ కుటుంబాలకి జీవన్మరణ సమస్యలు. ఒకసారి లంచం తీసుకున్న జడ్జి వల్ల కేసు ఏదో అనుకూలంగా మారుతుంది అనుకుని అదే ఆశతో బెయిల్ మీద వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్తారు కొందరు. మళ్ళీ బైల్ మీద వచ్చి కాపరం చేసి వెళ్తారు, ఎందరికో పెళ్ళిళ్ళు కాలేదు. మొదటి కేసులో లైఫ్ పడేసరికి అంతవరకు ధీమాగా వున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారి షాక్ చెందాయి. ఇక ఈ గ్రామాం లో వారికి ఎవరు పిల్లని ఇవ్వటం మానేసారు. నా పెళ్లి అక్కడ చుట్టుపక్కల ఒక వింత. ఎవరో చదువుకున్న అమ్మాయి, వుద్యోగం చేస్తుంది, ఎక్కడో దూరం లో ఊరు పెద్ద షావుకార్లు పిల్ల పాపం ఈ ఊరికి ఇచ్చారంట అని. నన్నే ఎంతో మంది అడిగారు తెలిసే ఈ పెళ్ళి చేసుకున్నావా అని. నాకు ఫ్యాక్షన్ తాలూక నిజస్వరూపం తెలీదు. రెడ్డీ కళ్ళల్లో కనిపించే ప్రేమ ఎందుకు నొరు దాటి బయటకి వచ్చేది కాదో అక్కడి పరిస్థితులు చూస్తే అర్ధం అయ్యింది. రెడ్డి మీద ఏమీ కేసు లేదు. కాని వెంకటేశ్వర రెడ్డి పేరు మీద కేసు వుంది. మా పక్క ఇంట్లో మా మామయ్య గారి చిన్నాన్న మనవడి పేరు కూడా అదే ఇంటి పేరుతో సహా. కాకపోతే ఆ వెంకటేశ్వర రెడ్డి నిజంగానే గొడవల్లో వున్నాడు, మా రెడ్డి ఆ గొడవల సమయంలో కర్నూల్ లో చదువుకుంటున్నాడంట. అందుకని కేసు మా రెడ్డి మీద కాదని ఆపోజిట్ వాళ్ళు క్లెయర్ గా చెప్పారంట. అయినా భయానికి మా అత్తయ్య వాళ్ళు రెడ్డిని ఎప్పటికి ఆ ఊరుకి దూరంగానే వుంచారు. ఈ క్రమంలో రెడ్డీ చిన్నప్పటి ప్రేమ మొగ్గలోనే తుడుచుకుపోయింది.కానీ...ఆమె జీవితం నాశనం అయిపోయింది.(అదిప్పుడు చెప్పను తరువాత చెప్తా)

నేను ఒకసారి మా అత్తయ్య గారి ఊరు వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వెంకటేశ్వర రెడ్డి జైలు నుండి మొదటి కేసు కొట్టేస్తే ఇంటికి వచ్చాడు.అలా చాలా మందికి మొదటి కేసు కొట్టేసారని అప్పుడు వాళ్ళంతా ఇంటికి రావటంతో ఊరంతా పండగ లా వుంది. మా మిద్దెలు కలిసే వుంటాయి. నేను పైన కూర్చొని పుస్తకం చదువుకుంటుంటే వాళ్ళ మిద్దె మీద నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళెప్పుడు మాతో మాట్లాడరు. పేర్లు ఒకటయినా కూడా తనే జైలు కి వెళ్ళాల్సి రావటం వల్ల ఒక్క ముసలి తల్లి మాత్రం ఇంట్లో మిగిలింది, ఆమె కోపంతో మాట్లాడేది కాదు. సో ఇతను తొంగి చూస్తుంటే నేను పలకరించాను. మీరు వాళ్ళ బంధువులా? అని. కాదు ఇది మా ఇల్లే అని చెప్పాడు. నాకు అర్ధం అయింది తను ఎవరో. కాసేపు మౌనంగా వుండిపోయాము. కానీ తను నాతో మాట్లాడాలని చూస్తున్నాడనిపించింది. నేనే తిరిగి అడిగాను "అంటే మీరు వెంకటేశ్వర రెడ్డీ ..ఆ?"అని. దానికోసమే ఎదురు చూస్తున్నట్లు గడ గడా మాట్లాడేసాడు. అవును మీ ఆయన పేరూ, నాది ఒకటే కాని కేసులో నన్ను జైలుకి పంపారు ఊరివాళ్ళంతా కలిసి. మీ వాయన బయట చదుకుంటున్నాడు గొడవల్లో లేడు అని. అప్పుడు నేను కూడా ఏముందిలే ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనుకున్నాను, జైలుకి వెళ్తున్న మా అందరినీ ఊర్లో వాళ్ళు అప్పుడు హీరోల్లా గొప్పగా చూసారు. మీ ఆయన ని పిరికివాడని,ఊరొదిలి పోయాడని అనుకున్నారు. కాని ....3 సంవత్సరాలు జైలులో వున్నా. శిక్ష పడింది వదినా!! అన్నాడు. తను అలా పిలిస్తే నాకు గుండెల్లో ఒక ఆత్మీయ భావం కలిగింది. రెడ్డీకి ఎవరూ తమ్ముడు లేరు. వుంటే నాకు ఒక మరిది వుంటే నన్ను ఇలాగే పిలిచేవాడుకదా అనిపించింది. నా భావం తనకి కూడా తెలిసిందో ఏమో అప్పటివరకు తన మనసులో వేదన అంతా నాకు చెప్పాడు. జైలు జీవితం నరకం వదినా, ఆ తిండి, నీరు, ఆఖరికి అక్కడ గాలి కూడా మనల్ని చంపేస్తుంది. బాగా పెడతారు తిండి కానీ అది తిన్న మనిషి మరి జీవితంలో ఏ పని చెయ్యడానికి శక్తి వుండదు. నాకు ఏడుపొచ్చేది, మా ఇంట్లో ఎంత పాడి వుంది. నెయ్యి లేనిదే ముద్ద దిగదు నాకు. ఎవడో చేసినదానికి, ఎవరో కుటుంబం కోసం నేనెందుకు ఈ కష్టాలు పడాలి అనిపించేది.వాళ్ళంతా హాయిగా లీడర్లు అయిపోయి ఆస్తులు పెంచుకుంటుంటే నేను మా ముసలిదాన్ని చూసుకునే వాళ్ళు కూడా లేకుండా వదిలేసి వాళ్ళకోసం జైల్లో వున్నా. ఎంత ఖర్చయినా ఇడిపిస్తాము మీకు అసలు భయం లేదు అన్నారు వదినా, మా పొలాలు అమ్మి జడ్జిలకి లంచాలు కట్టుకున్నాము.ఇక అమ్ముకోడానికి ఏమీ లేకపోతే ఊర్లో అందరు చందాలు ఏసారు మా కోసరం. ఇలా చెప్తుంటే తను ఏడుస్తాడేమో అని భయం వేసింది. టాపిక్ మార్చాను. మరి ఇప్పుడు వచ్చేశావు కదా! ఇక దాని గురించి ఆలోచించకు. నీకెంతో భవిష్యత్తు వుంది. ఏమి చెయ్యాలనుకుంటున్నావు? అని అడిగాను. పెళ్ళి చేసుకుంటా, ఇక్కడే వుంటే మీ కంటే నాకే ముందు పెళ్ళి అయిపోయేది, కొంచెం ఆరోగ్యం చిక్క బెట్టుకొని మిగిలిన పొలం లో పని చూసుకుంటా. మా అమ్మని ఒంటరిగా వదిలేసాను. ముసల్ది చానా కష్టపడింది. నేను పెళ్ళి చేసుకుంటే కోడలొస్తే కొంత సుఖపడతాది,చూడాలి...!!అని. తన కళ్ళల్లో ఎంతో ఆశ. ఈ మాటల మధ్యలో రెండు సార్లు వాళ్ళ అమ్మ, మా అత్తయ్య, మామయ్య వచ్చి మమ్మల్ని పిలిచారు. కానీ మేము మాట్లాడుతూనే వున్నాము.నాకు మీ మీద ఏమీ కోపం లేదు వదినా, మా ముసల్దానికి కడుపుకోత అంతే. దాన్ని కూడా 6 నెలలు జైల్లో పెడితే కోపం, బాధ,పౌరుషం అనీ పోతాయి అని నవ్వాడు.

ఇలాంటి ఎన్నో కధలు, ఎన్నో సమస్యలు, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరు. ఆ పరిస్థితుల్లో వారి బతుకు గడవడానికి ఎవరు కారణం? ఫ్యాక్షన్ వల్ల ఊర్లో 2 సంవత్సరాలు కర్ఫ్యూ పెట్టారు. ఇళ్ళు పొలాలు పశువులు వదిలేసి ఊర్లెమ్మట, అడవులెమ్మట తిరిగారు మగవాళ్ళు. పోలీసులకు భయపడి అమ్మగారిళ్ళకి, బంధువుల ఇళ్ళకి వెళ్లిపోయారు ఆడవాళ్ళు. ఊరి మొత్తానికి 4,5 కుతుంబాలు మాత్రమే వుండి అందరి పంటలు, పశువుల బాద్యత తీసుకున్నారంట.మా అత్తయ్య మాత్రం ఎవరెంత చెప్పిన కదలక ఇంట్లోనే వున్నారు ఇద్దరు ఆడ పిల్లలతో, ఒక ముసలి అత్తగారితో. పోలీసులకి భయపడి పిల్లలు చదవలేదు, ఫ్యాక్షన్ కి భయపడి, జైలు శిక్షలు పడి, ప్రేమించుకున్న వాళ్ళవి, పెళ్ళి కుదిరిన వాళ్ళవి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి.

కుటుంబం అంటే ఎన్ని పనులు, ఎన్ని బాద్యతలు...పిల్లలికి చదువైన, రోజు వారి జీవనాధారమైన, ఇంట్లో ఏదైన కార్యక్రమానికి నిర్ణయమైనా...ఏది జరగాలన్నా ఆ ఊర్లో జైలుకి వెళ్ళి మాట్లాడే వరకు లేదా వాళ్ళ వాళ్ళకి బెయిలు ఇప్పించగలిగే వరకు ఆగాలి.  బెయిలు మీద ఎన్నాళ్ళు తీసుకురాగలరు? ఎన్నాళ్ళు ఒక మనిషి కోసం మన జీవితం లో అన్ని ఆపగలం? ఎవరు ఏ విషయాల్లో ఎదురు చూడగలరు?

బి. ఇ. డి చేసే సమయంలో కలిసి జీవితం పంచుకోవాలని కలలు కన్న ఇంకో జంట సడన్ గా అబ్బాయి జెయిలు కు వెళ్తుంటే ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, పరిచయం లేని జెయిలు కి వెళ్ళి ఆ అబ్బాయి ని కలిసి ఎప్పుడొస్తావు అని ఆమె ఏడుస్తుంటే, తనని చూసి ఆ అబ్బాయి ఏడుస్తుంటే.. చూసిన వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఆగేవి కాదు. ఇక ఆమె బాధ ని చూడలేక ఆ అబ్బాయి ఆమెని కలవకుండా మానేసాడు. ఆ నిర్ణయం తీసుకొని ఆచరించడానికి ఎంత నరకయాతన అనుభవించాడో ఆ ఊరిలో చెప్పే జెయిలు కధల్లో ఒకటి, ముక్కుపచ్చలారని పిల్లల జీవితాలు ఇలా జెయిలు గొడల మద్య నలిగిపోవాల్సిందేనా? వాళ్ళేమి చేసారు? మన కోర్టులకు టైము లేకపోతె, ఎవరో చెప్తే వినడమే తప్ప, నిజం తెలుసుకోవటం కోర్టు పని కాక పోతే అది ఎవరి తప్పు? ఇలాంటి పరిస్తితి నేను విన్నాను, చూసాను కాబట్టి నాకు తెలిసింది. కాని ఇలాంటి ఎన్నో వేల లక్షలమంది ఎవరో చేసిన తప్పులకి, ఎవరో స్వార్ధానికి జీవితం బలి చేసుకొని ఏదో వింత జరిగి వారి జీవితం మారిపోవాలని ఎదురుచూస్తూ బ్రతుకుతున్నారో!!! ఇది ఫ్యాక్షన్ నడిపిన వాళ్ళ కధ కాదు, దానికి ఏ సంబంధం లేకపోయిన ఆ ఊర్లో పుట్టినందుకు నలిగిపోయిన ఎన్నో ఇళ్ళళ్ళో కధ.

కానీ ఆ ఇంట్లోనే పుట్టిన పిల్లల కధలు ఎలా వున్నాయో తరువాత పోస్ట్లో.